Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడ్లో శనివారం సమర్దసాయి ఆశ్రమంలో సాయిబాబా లైంగిక వేధింపులకు గురైన శ్రీలత కుటుంబానికి న్యాయం చేయాలనీ, మోసపూరిత బాబాను వెంటనే అరెస్టు చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కెఎన్ ఆశాలత, మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీలత కుటుంబాన్ని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శారద, బి హేమలత, వివిధ ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారని తెలిపారు. బాబా చేస్తున్న లైంగిక వేధింపుల వల్ల కొన్ని సంవత్సరాలుగా మహిళలకుఅన్యాయం జరుగుతున్నదన్నారు. బాబా ఆశ్రమంలో ఇలాంటి మహిళలు అనేక మంది లైంగికంగా, మానిసికంగా వేధింపులకు గురయ్యారని పేర్కొన్నారు. గత కొన్నేండ్లుగా శ్రీలతను తన శిష్యుడి రూపంలో వస్తానని చెప్పి ఆమె ఇంటికి వెళ్లి శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఆ ఆశ్రమంలో రోజురోజుకు ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయంటూ భక్తులు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. అమాయక ప్రజల మూఢవిశ్వాసాలను ఆసరాగా చేసుకుని అక్రమాస్తులు సంపాదిస్తూ, అక్రమ భూదందాలు చేస్తూ ఆశ్రమాన్ని నెలకొల్పారనీ, ప్రభుత్వం వెంటనే ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవాలనీ, ఆభూములను పేదలకు పంచాలని కోరారు. ఇలాంటి దొంగ బాబాలను వెంటనే అరెస్టు చేసి, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు ప్రభుత్వం, న్యాయస్థానం సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఒక సామాన్యమైన మహిళకు అన్యాయం జరుగుతుంటే ఈ బాబాను అరెస్టు చేయాలని డిమాండ్ చేయకుండా కొన్ని సంస్థలు, కొంత మంది వ్యక్తులు బాబా మంచివాడు అంటూ చెప్పి బాబాను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రక్షించే ప్రయత్నం చేసేవారందరి మీద కూడా మహిళల వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీసులు బాబాను అరెస్టు చేసి జైలుకు పంపాలనీ, లేనిపక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.