Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రిజర్వాయర్లలో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్లను (ఫ్లోటింగ్) ఏర్పాటు చేసేందుకు సింగరేణి కాలరీస్ సంస్థ అధ్యయనం చేస్తున్నది. రాష్ట్ర పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ సహకారంతో ఈ అధ్యయనం చేస్తున్నట్టు సింగరేణి సీఎమ్డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. రిజర్వాయర్ల నీటి సామర్థ్యాన్ని బట్టి వంద నుంచి ఐదు వందల మెగావాట్ల వరకు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. సింగరేణి వ్యాపార విస్తరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని భారీ నీటిపారుదల జలాశయాల మీద, పర్యావరణ హితంగా, నిబంధనలకు లోబడి నీటిపై తేలియాడే సోలార్ పవర్ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. అయితే దీనికి సంబంధించిన అధ్యయనం ప్రాధమిక దశలోనే ఉన్నదనీ, రాష్ట్ర పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ తమకు ఓ నివేదిక కూడా ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. సోమవారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎన్ జానయ్య, సింగరేణి డైరెక్టర్లు శంకర్, రామకృష్ణ తదితరులు సీఎమ్డీ శ్రీధర్ సమావేశమయ్యారు. ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ అంచనాలను జానయ్య సీఎమ్డీ శ్రీధర్కు వివరించారు. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పటికే తమ బొగ్గుగనుల పరిధిలో 11 సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తమ సంస్థ పరిధి దాటి బయటి ప్రాంతంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. తొలివిడతలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని భారీ సాగునీటి జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు అనువుగా ఉన్నట్టు అధికారుల చర్చల్లో వెల్లడయ్యింది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి, నివేదిక ఇస్తే, త్వరలో నిర్ణయం తీసుకుంటామని శ్రీధర్ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాకే, వారి అనుమతితోనే ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడతామని వివరించారు.