Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర హౌంమంత్రి
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర పోలీసులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి చేస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర హౌంమంత్రి మహ్మద్ మహమూద్అలీ కొనియాడారు. ఇదే స్పూర్తితో కరోనా బాధితులకు చేయూత నిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి మొదలుకుని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో హౌంమంత్రి టెలికాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరు ఆందోళనకరమనీ, అయితే పోలీసు శాఖలో వైరస్ సోకిన వారు ఏమాత్రం భయపడరాదనీ, చికిత్స ద్వారా వైరస్ను పారదొలవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తనకు కూడా వైరస్ సోకిందని చికిత్సతో ఆరోగ్యంగా బయటికి వచ్చానని గుర్తు చేశారు. కరోనా వ్యాధి బాధితులను ఆస్పత్రికి తరలించడంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఆ సమయంలో బాధితులకు ధైర్యాన్ని నూరిపోయాలని తెలిపారు. రాష్ట్రంలో కరోనాను నియంత్రించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ అవసరమైన చర్యలను తీసుకుంటున్నారని వెల్లడించారు. వైరస్ సోకిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఆరోగ్యంగా విధుల్లో చేరడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న నేరాల గురించి కూడా ఆయన అధికారులతో చర్చించారు. నేరాలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలనీ, ముఖ్యంగా నేరస్తుల కదలికలపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.