Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
అంతర్జాతీయ మహమ్మారి కోవిడ్ నుంచి రాష్ట్రాన్ని రక్షించి ఆరోగ్య తెలంగాణగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా 2000 వేల ఎకరాల్లో ఆధునిక ఏకో పార్కును ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కరోనా వైరస్ నివారణ కోసం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితో పాటు మరో 100 పడకల ఆస్పత్రిని నిర్మించి ఆధునిక వైద్యం అందిస్తామని తెలిపారు. మానవాళికి సవాల్గా నిలిచిన కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. రాష్ట్ర ఫార్మా కంపెనీల కృషి అభినందనీయమన్నారు. కొన్ని పత్రికలు ఫార్మా కంపెనీల విషయంలో వింత కథనాలు రాయడం సరికాదన్నారు. కంపెనీలు అన్నతర్వాత కొన్ని ప్రతికూలతలు ఉంటాయని, అంతమాత్రాన వాటి మౌలిక లక్ష్యాలను దెబ్బతీయరాదని చెప్పారు. కరోనా నివారణ వ్యాక్సిన్ తయారికి దేశంలోని ఆరు కంపెనీలు ప్రయత్నం చేస్తుంటే.. అందులో మన రాష్ట్రంలోనివే నాలుగు కంపెనీలు ఉండటం విశేషమన్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో మన డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు విలైవన సూచనలు సలహాలు ఇస్తే అభ్యంతరం లేదు.. కానీ, అదే పనిగా దుమ్మెత్తి పోయడం భావ్యం కాదన్నారు. కరోనా రోగుల నుంచి రాత్రి 12 గంటలకు మెస్సేజ్ వచ్చినా ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే స్పందిస్తు న్నారని చెప్పారు. అనంతరం వీరన్నపేటలో రెండు పడకల ఇండ్లను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.