Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య
- ఎన్పీఆర్డీ, నిరుద్యోగ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-సంగారెడ్డిటౌన్
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో 5శాతం వికలాంగులకు కేటాయించాలనీ, లేకపోతే పూర్తయిన ఇండ్లను తామే ఆక్రమించుకుంటామని జాతీయ వికలాంగుల వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. ఎన్పీఆర్డీ, నిరుద్యోగ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డిలో 26 మండలాలు, మున్సిపల్ పట్టణాల్లో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తుందన్నారు. వాటి కోసం లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు వికలాంగుల నుంచి మాత్రం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం ఇండ్లు వికలాంగులకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందనీ, దాన్ని కచ్చితంగా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్న వికలాంగులు ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మిస్తున్న ఇండ్లను ప్రత్యేకంగా వికలాంగులకు కేటాయించాలని కోరారు. లబ్దిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 24 ప్రకారం 25శాతం అదనంగా కేటాయించాలనే ఉత్తర్వులను డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అమలు చేయాలన్నారు. నిరుద్యోగ వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమ్మదిపురం మహేష్ కుమార్, ఎస్. వెంకటేష్, ఎన్పీఆర్డీ సంగారెడ్డి పట్టణాధ్యక్షులు షేక్ మహమ్మద్ గని తదితరులు పాల్గొన్నారు.