Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్ ఎదుట రైతు కుటుంబం బైటాయింపు
నవతెలంగాణ-ఎడపల్లి
భూమి కొనుగోలు చేసి 14 ఏండ్లు అవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టా మార్పిడి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతు కుటుంబీకులు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించారు. బాధితుల వివరాల ప్రకారం.. ఠానాకలాన్ గ్రామానికి చెందిన రైతు మున్ని బేగంకు 4.18 ఎకరాల భూమి ఉంది. అయితే, 3.17 ఎకరాల భూమికే ఆన్లైన్ డిజిటల్ పట్టా వచ్చింది. అదే గ్రామానికి చెందిన గిరిరెడ్డి వద్ద 2006లో సర్వే నెంబర్ 886/2/పీ7లో, 890/పీ7లో 1.11ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని తమ పేరు మీద పట్టా చేయాలని తిరుగుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మున్నిబేగం కుటుంబీకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించారు. సంబంధిత రైతు పత్రాలను, ఈసీలను అధికారులకు ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు తహసీల్దార్లు మారినా తమ పని మాత్రం చేయడం లేదని వాపోయారు. ప్రస్తుత తహసీల్దార్ ప్రవీణ్కు విన్నవిస్తే వీఆర్వోకు ఆదేశాలు జారీ చేశారనీ, అయినా వీఆర్వో పూల్సింగ్ పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారుల తీరుతో మానసికంగా కుంగిపోతున్నామనీ, అన్ని పత్రాలు ఉన్నా పట్టా చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదనీ అన్నారు. తమకు న్యాయం చేయకపోతే కలెక్టర్కు, జిల్లా వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేస్తామని మహిళా రైతు మున్నిబేగం, ఆమె భర్త షేర్ అలీ తెలిపారు. అనంతరం ఉపతహసీల్దార్ రజినికి వినతిపత్రం అందజేశారు.