Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనా నియంత్రణలో పాలకుల వైఫల్యం
- నిరసనగా 16న సత్యాగ్రహం
- సమస్యలను కప్పిపుచ్చేందుకే టీఆర్ఎస్, బీజేపీ తగాదాలు
- జులై 20 నుంచి ప్రజల వద్దకు సీపీఐ(ఎం) శ్రేణులు
- వరవరరావును విడుదల చేయాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-వరంగల్
''కరోనా వైరస్ ఉధృతిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇందుకు నిరసనగా ఈనెల 16న జిల్లా, మండల కేంద్రాల్లో సత్యాగ్రహం నిర్వహిస్తున్నాం. ప్రయివేటు ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలందరికీ వైద్యం అందించాలి'' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు నెలల లాక్డౌన్ కాలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయన్నారు. లాక్డౌన్ కాలంలో ప్రజల అవసరాలను తీర్చితే బయటకొచ్చేవారు కాదని, ఈ వైరస్ విస్తరణ తీవ్రస్థాయికి చేరేది కాదని అన్నారు. హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తొలినాళ్లలో వైరస్ కాంటాక్టు వ్యక్తుల జాబితాను రూపొందించి వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి వైద్య సేవలందించిన అధికారులు, సిబ్బంది ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. నేడు ఇంట్లో పాజిటివ్ కేసు నమోదైనా, కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించడం లేదని, దాంతో వారికీ వస్తోందని తెలిపారు. 16న జరుగనున్న సత్యాగ్రహం కార్యాక్రమంలో సీపీఐ(ఎం) శ్రేణులతోపాటు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు బేఖాతర్ చేస్తున్నాయని విమర్శించారు. కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భిన్నంగా ఇష్టమొచ్చినట్టు వసూలు చేస్తున్నాయన్నారు. స్వయంగా వైద్య, ఆరోగ్య మంత్రి జోక్యం చేసుకుంటేగాని పరిష్కారం కాని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు పెంచి, ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయాలని కోరారు. ప్రయివేటు ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 2,500 డాక్టర్ పోస్టులు, 7,500 నర్సుల పోస్టులు నేటికీ ఖాళీగా వున్నాయన్నారు. వెంటనే వీటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆస్తుల ప్రయివేటుపరం
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రయివేటుపరం చేస్తోందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ రైల్వేలను ప్రయివేటుపరం చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని, ఇందుకు నిరసనగా ఈనెల 17న ప్రజాసంఘాలు కలిసి అన్ని రైల్వే స్టేషన్ల ఎదుట తెలిపే నిరసన కార్యక్రమాలకు సీపీఐ(ఎం) మద్దతునిస్తున్నట్టు తెలిపారు. జులై 20 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు సీపీఐ(ఎం) శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి చైతన్యం కలిగిస్తారని చెప్పారు.
వరవరరావును విడుదల చేయాలి
అర్భన్ నక్సల్స్ పేరిట అరెస్టు చేసిన కవి వరవరరావును వెంటనే విడుదల చేసి వైద్యసేవలందించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. ప్రజల తరుపున మాట్లాడే వారిని అణగదొక్కడం దుర్మార్గమన్నారు. వరవరరావు అనారోగ్యం విషయం ప్రధాని దృష్టికి వెళ్లినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జైలులోనే ఆయన్ను చంపడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు భావించాల్సొస్తుందన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర తగాదాలు
వరంగల్లో బీజేపీ, టీఆర్ఎస్ నేతలవి చిల్లర తగాదాలని తమ్మినేని అభివర్ణించారు. బీజేపీ కేంద్రంలో, టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయని, ఆయా ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ తగాదాలకు దిగుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాసమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, సాయిబాబు, జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవారెడ్డి, జి.ప్రభాకర్రెడ్డి, సీహెచ్.చుక్కయ్య, నలిగంటి రత్నమాల, టి.ఉప్పలయ్య పాల్గొన్నారు.