Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తగ్గిన పసుపు విస్తీర్ణం.. రెండింతలైన పెట్టుబడి వ్యయం
- గిట్టుబాటు ధర కరువు
- ఆదుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- పసుపు బోర్డు పేర రాజకీయ క్రీడ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పసుపు బోర్డు పేర ఆడుతున్న రాజకీయ పార్టీల క్రీడలో రైతు బలవుతున్నాడు.. బోర్డు రాకపోవడం.. గిట్టుబాటు ధర కరువవుతుండటంతో రైతులు సాగును వదులుకుంటున్నారు. దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా సాగు చేస్తున్న పంటకు మెల్లిమెల్లిగా స్వస్తి పలుకుతున్నారు. పెట్టుబడి వ్యయం రెండింతలవ్వగా.. పంట ధర మాత్రం ఏడాదికేడాదికి తగ్గుతోంది.. దాంతో ప్రతియేటా గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కాల్సి వస్తుండటంతో విసుగుచెందారు. ఒకప్పుడు దేశంలోనే అత్యధిక పసుపు పంట సాగైన ప్రాంతంలో.. ప్రస్తుతం రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు సాగుకు పేరెన్నికగన్నది. ఇక్కడి నుంచి పసుపు దేశ, విదేశాలకు సరఫరా అవుతోంది. అత్యధికంగా ఆర్మూర్ డివిజన్లోని మండలాల్లో రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. అయితే, అన్ని పంటల ధరలు ప్రతి యేడాదీ ఎంతోకొంత పెరుగుతుండగా.. పసుపు పంట ధర మాత్రం అందుకు విరుద్ధంగా తగ్గుతూ వస్తోంది. ఐదేండ్ల కిందట పసుపు క్వింటా ధర రూ.15 వేలు పలుకగా.. ఇప్పుడు రూ.4 వేలకు పడిపోయింది. మరోవైపు పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. సగటున ఎకరాకు రూ. లక్షా 20 వేల వరకు పెట్టుబడి అవుతోంది.
'పసుపు' పేర రాజకీయం
దశాబ్దకాలంగా పసుపు రైతులను ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వంచించాయి. నిజామాబాద్ లోక్సభ స్థానంలో గెలిపిస్తే.. 'పసుపు బోర్డు' తెసుకొస్తామంటూ అధికారంలోకి రావడం.. ఆపై కుంటిసాకులు చెప్పడం పరిపాటిగా మారింది. గడిచిన లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్.. తానను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని వాగ్ధానం చేశారు. ఒకవేళ బోర్డు తీసుకురాని పక్షంలో ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు. కానీ యేడాది తిరిగిన తరువాత బోర్డుతో లాభం లేదని, సుగంధద్రవ్యాల ఎక్స్టెన్షన్ ప్రాంతీయ కార్యాలయం ప్రకటన చేయించారు. మద్దతు ధరపైనా యూటర్న్ తీసుకున్నారు.
ధర దక్కడం లేదు : మహిపాల్- మోర్తాడ్
పసుపు పంట పండిస్తే.. ధర దక్కడం లేదు. ప్రభుత్వా లు పట్టించుకునే పరిస్థితి లేదు. పంట కోసం ఆరు నుంచి తొమ్మిది నెలలు కుటుంబమంతా కష్టపడితే.. కనీసం చేసిన కష్టానికి కూలి కూడా రావడం లేదు. గతంలో నాలుగు ఎకరాల్లో సాగు చేసేవాడ్ని. ఈ సీజన్లో ఎకరం తగ్గించా ను. మున్ముందు ఈ మాత్రమూ చేసే పరిస్థితిలో లేను.
సాగు ఖర్చులు పెరిగాయి : రాజశేఖర్- తిమ్మాపూర్
పసుపు పంట సాగులో ఖర్చులు పెరిగి పోతున్నాయి. ఎకరానికి లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ క్వింటా పంటకు రూ.ఐదు వేలలోపే వస్తోంది. అందుకే సాగు తగ్గించినం. గతేడాది మూడున్నర ఎకరాలు సాగు చేసిన. ప్రస్తుతం రెండెకరాల్లో వేశాను.
తగ్గిన సాగు..
జిల్లాలో ఈ యేడాది పసుపు సాగు భారీగా తగ్గింది. గత ఖరీఫ్ సీజన్లో 40,624 ఎకరాల్లో సాగవ్వగా.. ఈ యేడాది 30,410 ఎకరాలే సాగు చేశారు. పది వేల ఎకరాల సాగు తగ్గింది. ప్రతియేటా మద్దతు ధర కోసం రోడ్డెక్కే పరిస్థితులు తలెత్తుతుండటంతో విసుగుచెందిన రైతన్న.. తనే పంట సాగును తగ్గించుకుంటున్నాడు. గతంలో ఐదెకరాలు సాగు చేసే రైతులు కూడా ఈ యేడాది రెండెకరాలకు పరిమితం చేసుకున్నారు. మిగతా భూమిలో వరి లేదా మొక్కజొన్న, పెసర్లు తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు.
ఐకేపీతో కొనుగోలు ఉత్తమాటే..
లోక్సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పలు హామీలు గుప్పించారు. పసుపు మద్దతు ధర కోసం కేంద్రంతో కోట్లాడతామని, నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పసుపు రైతులకు మంచి ధర వచ్చేలా ఐకేపీ కేంద్రాలతో కొనుగోలు చేయించి రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తామన్నారు. ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. అంతిమంగా పార్టీల రాజకీయ క్రీడలో పసుపు రైతు బలయ్యాడు. చివరకు సాగు తగ్గించుకున్నాడు.