Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆ నిధులను బోర్డులో జమచేయాలి
- వెల్ఫేర్ బోర్డు నుంచి రూ.5000 చొప్పున ఇవ్వాలి
- భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి : బీసీడబ్ల్యూయూ
- అంజయ్య భవన్ ఎదుట ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వెల్ఫేర్ బోర్డు నుంచి అక్రమంగా దారి మళ్లించిన వెయ్యి కోట్ల రూపాయలను తిరిగి బోర్డులో జమచేయాలనీ, కరోనా కాలంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న ఒక్కో భవన నిర్మాణ కార్మికునికి బోర్డు నుంచి ఐదు వేల
రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని బీసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షులు వంగూరు రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూఎఫ్ఐ పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ, భవన నిర్మాణ కార్మికుల చట్టం-1996, 1979 వలస కార్మికుల చట్టాలను రక్షించాలని కోరుతూ హైదరాబాద్లోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట బీసీడబ్ల్యూయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వంగూరు రాములు మాట్లాడుతూ...తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డు ఏప్రిల్ ఒకటో తేదీన సమావేశమై పేరు నమోదు చేయించుకున్న ప్రతి భవన నిర్మాణ కార్మికునికి రూ.1500 ఇస్తామని మూడు నెలలు గడుస్తున్నా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. పైగా, వెల్ఫేర్ బోర్డు నిధులను పౌరసరఫరాల శాఖకు దారిమళ్లించడం అన్యాయమన్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వెల్ఫేర్ బోర్డుల కింద రూ.5 వేల నుంచి రూ.2 వేలు ఇచ్చి భవన నిర్మాణకార్మికులను ఆదుకున్నాయనీ, ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్క పైసా ఇవ్వకపోవడం దారుణమన్నారు. తెల్లరేషన్ కార్డులు లేని భవన నిర్మాణ కార్మికులు సుమారు రెండు లక్షల మంది ఉన్నారనీ, వారంతా రూ.1500 ప్రభుత్వ సహాయాన్ని కోల్పోయారన్నారు. అవకాశం లేక బియ్యం తీసుకోనివారు మరో 8 లక్షల మంది కుటుంబాలున్నాయని వాపోయారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలనీ, వారి కోసం ఉన్న చట్టాలను పక్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, బీసీడబ్ల్యూయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.మల్లేశ్, హైదరాబాద్ సిటీ నాయకులు మోహన్, బాబు, వి.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.