Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రజా నాయకులు చనిపోతే సమాజం గొల్లుమంటుంది :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- ముగిసిన అరుణ అంత్యక్రియలు
నవ తెలంగాణ మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజల కోసం, విలువల కోసం పని చేసిన ప్రజాఉద్యమ నాయకులు చనిపోతే సమాజం గొల్లు మంటుంది.. డబ్బు కోసం గడ్డి తినే ఈ రోజుల్లో పేదల పక్షాన పోరాడటానికి ముందుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి అరుణ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఐద్వా మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి అరుణ అనారోగ్యంతో హైదరాబాదు కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడాలలో జరిగిన అంత్యక్రియల్లో తమ్మినేని పాల్గొన్నారు. అటు కుటుంబం కోసం.. ఇటు పార్టీ బలోపేతానికి సంపూర్ణంగా కృషిచేసిన నాయకురాలు అరుణ అని తమ్మినేని కొనియాడారు. సమాజ మార్పు కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం మహిళా సంఘంతో పాటు సీపీఐ(ఎం)లో పనిచేసి ఈ ప్రాంత ప్రజల మన్ననలను పొందారని చెప్పారు. కమ్యూనిస్టులుగా జీవితం ప్రారంభించి మధ్యలోనే అనేకమంది వదిలిపోతున్న తరుణంలో జీవితాంతం కమ్యూనిస్టులుగా, ఆదర్శ దంపతులుగా ఉండటం కొంతమందికే చెల్లుతుందన్నారు. సీపీఐ(ఎం) మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి ఎ.రాములు, ఆయన భార్య అరుణకు అది వర్తిస్తుందన్నారు. ఆమె ఆశయం కోసం కృషి చేయడమే మనం ఇచ్చే నివాళి అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్, జాన్వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, గోపాల్, సాగర్, మల్లు లక్ష్మి, జ్యోతి, జిల్లా నాయకులు, మహిళా సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.