Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గాంధీలో కరోనా పరీక్షలు చేయాలి
- హెల్త్ బులిటెన్లో ఖాళీ బెడ్స్ వివరాలు ప్రకటించాలి :
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
- 'పిల్' దాఖలు చేసిన డీజీ నర్సింహారావు, ఇతరులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైద్యం కోసం కేటాయించిన 87 ఆస్పత్రుల గురించి పత్రికల ద్వారా ప్రచారం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏఏ ఆస్పత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్స్ ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయో రోజూ వెల్లడించే హెల్త్ బులిటెన్లో పేర్కొనాలని ఆదేశించింది. కరోనా అంటే గాంధీ ఆస్పత్రే అందరికీ గుర్తుకు వస్తుందని, అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. కరోనాకు సంబంధించిన వివిధ ప్రజాప్రయోజన వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజరుసేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. టీచింగ్ ఆస్పత్రుల్ని కరోనా వైద్యం కోసం వినియోగించుకునేలా ఉత్తర్వులివ్వాలని, కరోనా వైద్యం చేసే ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీలను డిస్ప్లే కోసం డాష్ బోర్డుల్ని ఏర్పాటు చేయాలని, ప్రయివేటు ఆస్పత్రుల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహరావుతో పాటు ఇతరులు విడివిడిగా పిటీషన్లు దాఖలు చేశారు. వీటిని ధర్మాసనం విచారించింది. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కేసులు ఎక్కువగా ఉంటే వాటిపై ఒత్తిడి తగ్గించేందుకు చెస్ట్, ఫీవర్, నీలోఫర్ ఆస్పత్రుల్లోనూ కరోనా వైద్యం చేయాలనీ, ప్రయివేటు ఆస్పత్రుల్లో ఫీజులు కేంద్రం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఉండేలా చేయాలని ఆదేశించింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరై, రాష్ట్రంలో 87 కరోనా ఆస్పత్రుల్లో 8834 బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు. గాంధీలో ఐదుగురు పేషెంట్లకు ప్లాస్మా చేస్తే ఇద్దరికి మెరుగుపడిందన్నారు. జిల్లాల వారీగా కరోనా ఆస్పత్రుల వివరాలు, వివిధ ఆస్పత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్స్, కరోనా పాజిటివ్ కేసుల గురించి తెలియజేశారు. గాంధీలో ఆర్టీపీసీఆర్ కిట్స్ ఉన్నాయని, అయితే వాటిని గర్భిణీలకే ఇస్తున్నట్లు చెప్పగానే హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గర్భిణీలకు ఇచ్చి ఇతరులకు ఇవ్వకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన అవుతుందని, జీవించే హక్కులను కాలరాయడమేనని చెప్పింది. కరోనా గురించి చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది గాంధీ ఆస్పత్రేనని, అలాంటి ఆస్పత్రిలో కరోనా టెస్ట్ చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి భారీగా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. యశోదా ఆస్పత్రి మనోజ్ కొఠారి నుంచి 4.21 లక్షలు బిల్లు వేసిందని చెప్పింది. గాంధీలో 1141 బెడ్స్ ఖాళీగా ఉన్నా కరోనా నిర్ధారణ పత్రాలు లేకపోతే వైద్యం చేయడం లేదని, ఫలితంగా చాలా మంది కరోనా బాధితులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తున్నదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి వివరాల నిమిత్తం విచారణ 27వ తేదీకి వాయిదా పడింది.