Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అంట్లు తోమేదిలేదు..బట్టలుతికేది లేదు...
-కరోనా భయంతో పనిమనుషులను వద్దంటున్న ఇంటి యజమానులు
- రోడ్డున పడ్డ లక్షలాది మంది ఇంటిపనివారలు
- ఎక్కువ మందికి అందని ప్రభుత్వ సహాయం
- స్వయం ఉపాధి కల్పిస్తేనే ప్రయోజనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పొద్దస్తమానం నాలుగిండ్లు తిరిగి అంట్లు తోమి...బట్టలుతికితేనే పూట గడిచేది. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు కూలినాలి చేసే భర్తల రోజువారీ సంపాదనకు వారి నెల సంపాదన తోడైతేనే బతుకుబండి నెట్టుకురావడం కష్టంతో కూడుకున్నది. మామూలు సమయాల్లోనే అంతంత మాత్రంగానే ఉండే వారి కుటుంబాల పరిస్థితి కరోనా కాలంలో అగమ్యగోచరంగా తయారైంది. నాలుగైదు ఇండ్లేమోగానీ ఒక్క ఇల్లూ పని చేసేందుకు గతి లేకుండాపోయింది. మరోపక్క భర్తల సంపాదనా ఆగిపోయింది. కరోనాతో మా ఇండ్లు గడవటమే కష్టమంటూ ఇన్నాండ్లు పనిచేయించుకున్నోళ్లు చేతులెత్తేశారు. దీంతో లక్షలాది ఇంటిపనివారల కుటుంబాలు నేడు రోడ్డునపడ్డాయి. కష్టకాలంలో ఇంటి పనివారలు సుడిగుండంలో చిక్కుకున్నారు.
ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగులు రోజు పొద్దునలేవగానే ఏదో వంట చేసుకుని ఆఫీసులకు వెళ్లిపోతుంటారు. ఇళ్లంతా చిందరవందరగా వదిలి పోతారు. వారి వదిలివెళ్లిన పనినంతా ఇంటి పనివారు చేస్తారు. ముఖ్యంగా ఇల్లు ఊడ్వటం, అంట్లు తోమడం, బట్టలుతకడం వంటి పనులు చేయాలి. ఇలా బండెడు చాకిరీ చేస్తే ఆ మహిళలకు దక్కేది వెయ్యి నుంచి రెండున్నరవేల లోపే ఉంటుంది. పొద్దస్తమానం నాలుగైదు ఇండ్లు చేసుకుంటే వారి నెల సంపాద అంతా కలిపి మహా అయితే ఏడెనిమిదివేలకు మించదు. అయినప్పటికీ, కుటుంబ అవసరాల రీత్యా ఆ పనిచేయక తప్పదు. పట్టణాల్లో నేడు ఇదొక ఉపాధి అయిపోయింది. ఇలా ఇండ్లల్లో పనిచేసేవారు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మందికిపైగా ఉన్నారు. వీరిలో 80 శాతానికిపైగా ఒక్క హైదరాబాద్లోనే ఉన్నారు. మిగతావారు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్లో ఉండేవారిలో ఎక్కువగా రాజధాని చుట్టుపక్కల జిల్లాల నుంచి పొట్టకూటి కోసం వలసొచ్చినవారే. అందులోనూ వీరంతా బడుగు బలహీన వర్గాల సామాజిక తరగతుల వారే. కూలినాలికెళ్లి(భవన నిర్మాణ పనులు, రిక్షాలు అద్దెకు తీసుకుని తొక్కడం, ఆటోలు నడపడం) భర్తలు సంపాదించే దానికి వారి జీతం చేదోడువాదోడు నిలిచేది. కరోనా వ్యాప్తితో లాక్డౌన్ పెట్టడం వల్ల భర్తలకు కూలినాలి దొరకడం ఆగిపోయింది. ఆ మహిళలకూ ఇండ్లల్లో పనిలేకుండా పోయింది. మొన్నటిదాకా నాలుగైదు ఇండ్లల్లో పనిచేసేవారికి ఒక్క ఇల్లూ దిక్కులేకుండాపోయింది. పనుల్లేని కష్టకాలంలో కనీసం మీరైనా ఆదుకోండి అంటే 'మేమే సగం జీతాలతో అవస్థలు పడుతున్నాం..మిమ్ముల్ని ఎక్కడ ఆదుకుంటాం' అంటూ ఇంటి యజమానాలు చేతులెత్తేయడంతో లక్షలాది మంది ఇంటిపనివారలు రోడ్డుపడ్డారు. ఒకవేళ ఇండ్లల్లో ముసలివారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రమే అనేక కండిషన్లు పెట్టి మరీ పనికి పిలుపించుకుంటున్నారు. నాలుగైదు ఇండ్లల్లో తిరిగి రావడం వల్ల ఎక్కడ తమకు వారి నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందో అన్న భయంతో కొందరు, సగం వేతనాలతో కుటుంబమే కష్టమవుతున్న మరికొందరు నిర్మొహమాటంగా ఇంటి పనివారిని వద్దని చెప్పేశారు. దీంతో లాక్డౌన్సమయంలో వీరి కుటుంబాలు కాలనీ సంఘాలు, స్వచ్ఛంధసంస్థలు ఇచ్చిన నిత్యావసరాలలతో కాలం వెళ్లదీస్తున్నాయి తప్ప వీరికి ప్రభుత్వం నుంచి అందిన సహాయం అంతంతే. ఎందుకంటే వీరిలో చాలా మంది రేషన్కార్డులు కూడా లేవు. సొంతంగా ఇండ్లూ లేవు. ఇప్పటిదాకా మురికివాడల్లో రెండు, మూడు వేల రూపాయలకు అద్దె తీసుకుని ఉంటున్న వీరికి అదీ కట్టడం తలకు మించిన భారమైంది. అప్పులు తెచ్చి మరీ రెంట్లు కట్టుకోవాల్సిన దుస్థితి. ఇక్కడ బతుకుదెరువు లేక చాలా మంది సొంతూర్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), ఇంటిపనివారల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుజిల్లాల్లో, హైదరాబాద్ నగరంలో చేపట్టిన సర్వేలోనూ ఇవే అంశాలు వెల్లడయ్యాయి. అంబర్పేటకు చెందిన ఆర్. రేష్మా, బచ్చలబారు, కె.రేఖ తదితర ఇంటిపనివారలు మాట్లాడుతూ..'ఇల్లు గడవడం కష్టమైతాంది. ఒక్కరు కూడా పనికి రానివ్వడం లేదు. మా భర్తలకూ పనిలేదు. ఇల్లు గడ్వక ఈ నాలుగు నెలల కాలంలో 10 నుంచి 30 వేల రూపాయల దాకా అప్పుజేసినం. పిల్లలకు ఆన్లైన్ క్లాసులంటున్నరు. మాకే ఫోన్లు లేవు. పిల్లలకు ఏడెక్కెళ్లిదెచ్చి కోనివ్వాలో అర్థం అయితలేదు. క్లాసులే ఇనిపిస్తలేం' అని ధీనంగా చెప్పారు. 'నాలుగిండ్లల్లో పనిచేసేదాన్ని. ఆ సార్లు నెలనెలా ఇచ్చే రూ.8 వేలు మా కుటుంబానికి ఎంతో ఉపయోగపడ్డవి. కరోనా భయంతో పనికి వద్దంటున్నరు. ఆకిలి ఊకి పొమ్మంటున్నరు. దానికి రెండువేలు ఇస్తున్నరు. ఆ డబ్బులతోని, కాలనీ అసోసియేషన్ వాళ్లు పంచిన బియ్యం, పప్పులు, నూనెతోని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నం' అని ఎల్బీనగర్కు చెందిన జయమ్మ తన గోసను వెళ్లబుచ్చుకున్నది.
వారికి స్వయం ఉపాధి కల్పించాలి
కరోనాతో ఇంటిపనివారలు ఉపాధి కోల్పోయారు. మాస్కులు కుట్టేందుకు, శానిటైజర్లు తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి ముడి సరుకును అందజేయాలి. ఫలితంగా వారికి ఉపాధి కల్పించినట్టవుతుంది. ప్రభుత్వ అవసరాలూ తీరుతాయి. ఇంటి పనివారు ఎక్కువగా మురికివాడల్లో ఉంటున్నారు కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు పోషకాహార కిట్లను అందజేయాలి.
-అరుణజ్యోతి,
ఇంటిపనివారల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు
పది కిలోల బియ్యం, రూ.1500 ఇవ్వాలి
ఇంటి పనివారల కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల ఆహార ధాన్యాలు, 1500 రూపాయలు ఇవ్వాలి. రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో ఇంటిపనివారలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి. యజమానుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి.
- మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి