ప్రశ్న: ఈ జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా 'ప్రజల కోసం సైన్స్, సైన్స్ కోసం ప్రజలు' అన్న జోడు నినాదాలతో ప్రజా సైన్స్ ఉద్యమకారులయిన జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు కార్యకలాపాలు చేస్తున్నట్టు వింటున్నాము. ఈ నినాదాల నేపధ్యాన్ని విశదీకరిస్తారా?
- ఎం.జగన్మోహనరెడ్డి, హన్మకొండ
జవాబు: మానవాళికి మాత్రమే చెందిన సామూహిక ఒరవడి సైన్సు. తరతరాలుగా ఎన్నో త్యాగాలు, అచంచల కృషి, అత్యున్నత స్థాయిలో జ్ఞానతృష్ణ, సృజనాత్మకత, మానవీయత, హేతుబద్దత వంటి అనేకానేక మానవజాతి లాక్షణికాలతో ప్రోదిపడిన భాండాగారమే విజ్ఞానశాస్త్రం. సైన్సు ఏ ఒక్కరిదో కాదు. ఏ ఒక్క దేశానిదో కాదు. ఏ ఒక్క తరానిదో కాదు. ప్రపంచంలోని మానవులందరి సమిష్టి కృషిఫలితం సైన్సు. ఆదిమ మానవుడి కాలం నుంచి ఆధునిక మానవుడి కాలం వరకు సమాకలించుకొన్న చారిత్రక సంధానం సైన్సు. శారీరక, మానసిక శ్రమల మేళవింపు సైన్సు. ప్రక తిలో జరిగే అనేకానేక దృగ్విషయాలను పరిశీలించి, పరికించి, పరిక్షించి, తనకంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భూమ్మీద నివసిస్తున్న ఇతర వృక్ష, జంతు సంబంధ జీవజాతుల మనుగడలను ఆకళింపు చేసుకొంటూ ప్రకృతిలో వున్న నిర్దిష్ట క్రమానుగత సూత్రాలను అర్థం చేసుకొని ఎన్నో సాధనాలను, పనిముట్లను, పద్ధతుల్ని మానవజాతి వర్తమాన, భావితరాల వినియోగార్థం నిర్మించుకొంది. పదార్థం (Matter), ప్రదేశం (Space), కాలం (Time) అనే మూడు మితుల చట్రంలో క్రోడీకరించబడ్డ విశాల విశ్వ పరిజ్ఞానం వేలాది కాంతి సంవత్సరాలు, గెలాక్సీలు, కృష్ణబిలాల వంటి స్థూలస్థాయి నుంచి ఫెమ్టోమీటరు కన్నా లోతులో వున్న ప్రోటాన్లు, క్వార్కులు, బోసాన్ల వంటి సూక్ష్మస్థాయి వరకు అద్భుతంగా ప్రోదిపడింది. ఒకట్రెండు శతాబ్దాల కాలంలోనే అద్భుత వేగంతో మానవ విజ్ఞానం పరిఢవిల్లింది. గతకొన్ని దశాబ్దాలలోనే అణుస్థాయి, పరమాణు స్థాయి పరిజ్ఞానం నిర్ద్వంద్వంగా బోధపడ్డాక ఎలక్ట్రానిక్, సమాచార వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమాచార వినియోగం భౌగోళికంగా సెకన్ల వ్యవధిలో అందరికీ పరిచయం అవుతోంది. కోట్లాది కిలో మీటర్ల దూరంలో వున్న గ్రహాల నేలల మీద వ్యోమ శకట బాటల్ని, వాటి ఆటపాటల పటాటోపాల్ని కీబోర్డు మీటలతో మీటగలుగుతున్నాం. వేల కాంతి సంవత్సరాల దూరంలో జరిగిన కృష్ణబిలాల తాడన జనిత గురుత్వ తరంగాల ప్రభావంతో మిల్లీమీటర్ల విస్తారంలో జరిగే భూకంపనాల్ని రికార్డు చేయగలిగాం.
పదార్థ స్థల కాల త్రిమితుల అద్భుత మేళవింపు జీవం. జీవ జాతులేవైనా వాటి మధ్య వున్నదొకటే జన్యుసంకేతం (Genetic Code) అన్న సార్వనీన వైజ్ఞానిక సత్యం బోధపడ్డాక నూతన వంగడాల్ని సృష్టించడంతోపాటు, జబ్బులకు కారణాల్ని తెలుసుకొనగలిగాం. దరిమిలా చికిత్సా పద్ధతుల్ని రాబట్టుకొన్నాం. మూడు పదుల సగటు ఆయుర్దాయాన్ని ఎనిమిది పదుల స్థాయికి ఐదుపదుల సంవత్సరాల కాలంలోనే విస్తారం చేయగలిగాం. అంతేకాదు. జీవం అంటే పాదార్థిక మేళవింపేనని తెలుసుకొన్నాక జీవకణాన్నే సృష్టించగలిగాము. మానవ జీవన ప్రమాణ పరిమాణాన్ని గణనీయంగా పరిణమించగలిగాం. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. సైన్సు సాధించిన అద్భుత సాధనాలు, ప్రయోజనాలు, పరికరాలు, పద్ధతులు ప్రజలందరికీ చెందడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సైన్సు ఆధారిత ఉత్పత్తి సాధనాల్లో ప్రకృతిసిద్ధ వనరులు కలగలిపి చూస్తే కేవలం 10 శాతం సంపన్నుల కబంధ హస్తాల్లో లేదా వారి సేవా నిమగంలో 90 శాతానికి పైబడ్డ వనరులు, వసతులు, సాధనాలు, ప్రయోజనాలు వున్నాయి. మిగిలిన 90 శాతం మందికి సైన్సు ప్రయోజనాలలు, ప్రకృతి వనరులు పదిశాతం కూడా దక్కడం లేదు. ఇది అన్యాయం, సహజ న్యాయానికి వ్యతిరేకం, ప్రకృతికి విరుద్ధం. అందుకే ఏ కొద్దిమందికో చేరువై, వారి సేవలకే పరిమితమైన శాస్త్ర సాంకేతిక ప్రయోజనాలు, ఫలితాలు ప్రజలందరికీ చేరాలన్న ఆకాంక్ష, ఆశయంతో 'ప్రజల కోసం సైన్సు' అంటున్నాం.
ఇక ఆ నినాదానికి తోడుగా 'సైన్సు కోసం ప్రజలు' అనవలసిన పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి వుండరు. సైన్సును ఓ పనిముట్టుగా మాత్రమే వాడుకుంటూ సైన్సుకున్న తత్పరత (Content)కు తూట్లు పొడిచే దురవస్థ నేడు దేశంలో క్రమేణా బలపడుతోంది. ఒక మొబైల్ ఫోనును పరికరంగా వాడడం ఒక ఎత్తు. కానీ అదే మొబైల్ ఫోనులో వున్న శాస్త్రీయతను గుర్తించడం మరో ఎత్తు. నిక్కచ్చిగా నమ్మదగిన విధంగా కొన్ని ప్రకృతి సూత్రాల ఆధారంగా సెల్ఫోన్ పనిచేస్తుంది. సెల్ఫోన్ పనితీరులో నమ్మదగిన నికర సూత్రాలు లేకుంటే ఎవరూ సెల్ఫోన్లను కొనరు. నిన్న పనిచేసింది గానీ రేపు పనిచేస్తుందన్న నమ్మకమేమిటి అన్న సందేహం ఉంటే, ఎవరయినా సెల్ఫోన్ కొంటారా? కొన్ని నిర్మాణ దోషాల వల్ల సెల్ఫోన్ పనిచేయకపోయినా ఎందువల్ల పనిచేయడంలేదో అన్న ప్రశ్నకు సశాస్త్రీయ కారణాలు వుంటాయి. వాటి ఆధారంగానే దాన్ని రిపేరు చేయగలుగుతారు. నేడు మనం వాడుతున్న అనేకానేక పరికరాలు, సాధనాలు, ఉత్పత్తులు, పద్ధతులు, కార్యకలాపాలు నిర్దిష్ట ప్రకృతి సూత్రాల కనుగుణంగా నడుస్తున్నాయి. మనిషి శరీరం సైన్సు సాంకేతిక పరికరాల బాహ్యరూపం అనుకొంటే మనిషిలోని ప్రాణంలాంటిదే ఆ పరికరాల వెనుక వున్న సైన్సు సూత్రాలు. శక్తి, పదార్థం ఒక రూపం నుంచి మరో రూపంలోవకి మార్చగలంగానీ వాటిని శూన్యం నుంచి రాబట్టలేమని, ఉన్న శక్తి, పదార్థాలను మటుమాయం చేయలేమనేది సైన్సు సూత్రం. తపస్సు చేస్తేనో, ఓ బాబా దగ్గరికెళ్తేనో అన్నం, గృహం, బట్టలు శూన్యం నుంచైనా వస్తాయనుకుంటే అందరూ తపస్సే చేసేవాళ్లు. లేదా బాబాలే రాజులయ్యేవారు. మానవ జాతి చరిత్రలో ఇక శ్రమ అనే విషయానికే అర్థం వుండేది కాదు. శక్తి, పదార్థం వున్నఫళాన మాయమవుతాయన్న భయం వుంటే ఎవరూ బట్టలతో బయటకొచ్చేవారు కాదు. ఆభరణాలు కొనేవారు కాదు. సూర్యుడు రేపు వస్తాడో రాడో అన్న భయంతో వుండేవారు బాహ్య సమాజంలో మన ఇంద్రియ పరిజ్ఞాన పరిధిలో సంభవించే విషయాలన్నింటిలో కేవలం గురుత్వ బలాలు, విద్యుదయస్కాంత బలాలు తప్ప మరే యితర బలాల ప్రమేయంలేదన్నది ప్రకృతి నియమం. దీనికి వ్యతిరేకంగా అవలేశమైనా ఆధారాలుగానీ, ఋజువులుగానీ లేవు. కానీ దేశంలో 90 శాతం మందికి పైగా ప్రజలు గ్రహబలం, దైవబలం, నక్షత్రబలం, పూర్వజన్మ సుకృతం ఆత్మబలం అంటూ మిథ్యాబలాల బలాత్కారంలో చిక్కుకుపోయి శాస్త్రీయ దృక్పథ శీలాన్ని చెరిపేసుకొంటున్నారు. ఎన్నెన్నో మూఢ నమ్మకాల చాటున వర్తమాన నిజజీవిత సమస్యలకు పొంతన కుదరని నిష్ఫలిత, శుష్కప్రియ పరిష్కారాల్ని వంటపట్టుకొంటున్నారు. వాస్తులు, జ్యోతిష్యం, కర్మకాండలు, వర్ణవైషమ్యాలు, కుల వివక్షతలు, లైంగిక పక్షపాతం వంటి అనేకానేక అశాస్త్రీయపుటాచారాలను సైన్సు పదజాలంతో సమర్దించే దుర్మార్గ పద్ధతులు పెద్దపెట్టున నిరాఘాటంగా చలాయిస్తున్నాయి. నిస్సందేహంగా రుజువైన శాస్త్రీయ విషయాలను కనుమరుగయ్యేలా ప్రజల అవగాహనను కృత్రిమంగా భ్రమల లోకంలోకి మళ్లించే యంత్రాంగం బలీయమవుతోంది. దానికితోడు రాజ్యాధికారం కూడా ఉపకరించేలా ఛాందసశక్తులు పాలనా వ్యవస్థను చేజిక్కించుకొంటున్నాయి. జీవ పరిణామవాదాన్ని, పరీక్ష నాళికా ఫలదీకరణాన్ని, అంతరిక్ష గమనాన్ని, ఇంటర్నెట్ను, ఆధునిక గణితాన్ని సమకాలీన ప్రావస్థను అభినందించడానికి బదులు అవి మాకు ముందే తెలుసంటూ మతతత్వ కుతంత్రాలతో సమాజాన్ని సతమతం చేస్తున్నారు. తమకు గౌరవాన్ని, హౌదాను, ఆర్థిక బలాన్ని యిచ్చిన సైన్సుకు తూట్లు పొడుస్తున్న కొందరు సైంటిస్టులు, విద్యాసంస్థల అధిపతులు తమ పడికట్టు పదాలతో ఇష్టారాజ్యంగా సూడో సైన్సు గురించి మాట్లాడుతున్నారు. అందుకోసం సైన్సు మహాసభల్నే వేదికలుగా మార్చుకొని ప్రజల మనోభావాల్ని తిరోగమన దిశలోకి నెడుతున్నారు. అధికార మత్తులో అసలు శాస్త్రీయతను మరిచిపోతున్నారు. ఇపుడు సైన్సుకే సవాలు ఎదురయ్యింది. సైన్సును నమ్మేవాళ్లు ప్రమాదాల పాలవుతున్నారు. సైన్సు సంస్క తి మరుగునపడుతోంది. భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో సైన్సు అనే నిజం, గజగజలాడుతోంది. శాస్త్రం అనే వాస్తవం అవస్థల్లో వుంది. శాస్త్రీయ దృక్పథం అనే సమాసమే పాలకవర్గాలకు కంటక ప్రాయమవుతోంది. సత్యవాక్కు జన్మహక్కు కాగా అది దేశద్రోహమంటూ మత దురహంకారం హుంకరిస్తోంది. కోటానుకోట్ల జీవజాతుల్లో అగ్రస్థాయికి చేరుకున్న మానవజాతిని ఆదిమ మానవుడి స్థాయి నుంచి ఆధునిక అద్భుత విజ్ఞాన స్థాయికి చేరుకోగలిగిన స్థాయికి చేర్చిన సైన్సును, సైన్సు ద క్పథాన్ని కాపాడుకొనవలసిన ప్రమాద స్థితిలోనే సైన్సు వుంది. అందుకే 'సైన్సు కోసం ప్రజలు' అన్న నినాదానికీ నేడు ఆవశ్యకత ఏర్పడింది.
- ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Authorization