ల్యాప్టాప్, కంప్యూటర్ వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. భవిష్యత్లో మరింతగా పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. అయితే వీటిని ఇంటి అవసరాల కోసం కొద్ది సేపు ఉపయోగిస్తే సమస్యలేమీ ఉండవు. కానీ వృత్తి రీత్యా వాడే వారు మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి పరిశీలిద్దామా..!
కంప్యూటర్గానీ, ల్యాప్టాప్గానీ వాడేటప్పుడు స్క్రీన్కు మనం ఎంతదూరంలో ఉంటున్నాం. ఏవిధంగా కూర్చుంటున్నార. లైటింగ్ ఏవైపు నుంచి పడుతోంది. వీటన్నింటినీ గమనించకుండా కేవలం పని మీదే మన ధ్యాస కండ్ల మంటల నుండి మొదలై మెడ, నడుము, మణికట్టునొప్పి లాంటివి ఎక్కువైపోతాయి. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే తర్వాత పెరిగి ప్రాణాలమీదకు తెస్తాయి.
కంటి జబ్బులు
కంప్యూటర్లను, ల్యాప్టాప్లను ఎక్కువగా వాడటం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తుంది. కండ్ల మంట, దురదగా ఉండటం, కండ్ల నుంచి నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. మానిటర్ను తీక్షణంగా చూసేవారిలో కనురెప్పలు వాల్చే సంఖ్య తగ్గిపోతుంది. దీంతో కండ్లు పొడిబారిపోతాయి. ఫలితంగా కంటి జబ్బులు వస్తాయి.
20-20-20 సూత్రాన్ని పాటించాలి
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ను నియంత్రించడానికి 20-20- 20 సూత్రాన్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిముషాలకు, 20 సెకన్ల విరామాన్ని తీసుకుని. 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువు వైపుకు దృష్టిని మళ్లించాలి. విరామ సమయంలో ఎక్కువసార్లు కనురెప్పల్ని ఆర్పుతూ ఉండాలి. ఇలా చేస్తే కంటి సమస్యలు రాకుండా కొంత వరకు కాపాడుకోవచ్చు.
90 డిగ్రీల కోణంలో
ల్యాప్టాప్, కంప్యూటర్ ఇలా మనం దేన్ని ఉపయోగిస్తున్నా వాటి స్క్రీన్ పెద్దగానూ, ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి. కంటి చూపుకి తెర ఎప్పుడూ 90 డిగ్రీల కోణంలో ఉండాలి. మనం ఆఫీసుల్లో కంప్యూటర్, ల్యాప్టాప్లపై పనిచేసేటప్పుడు మన చుట్టూ కంప్యూటర్లు ఉంటాయి. ఇలా కంప్యూటర్లన్నీ దగ్గర, దగ్గరగా ఉండటం వల్ల వీటిలోని విద్యుదయస్కాంత శక్తి మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. మన చుట్టూ ఉండే మానిటర్లను నాలుగు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. దీంతో విద్యుదయస్కాంత శక్తి తగ్గుతుంది.
70 సెంటీమీటర్లు దూరంలో
ల్యాప్టాప్, కంప్యూటర్లకు టైప్ చేసే మన చేతులు 70 సెంటీమీటర్లు దూరంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసినప్పుడు మానిటర్పై టెక్ట్స్ చిన్నగా కనిపిస్తే సైజు పెంచుకోవడం మంచిది. గర్భిణులు కంప్యూటర్లను వాడకపోవడమే మంచిది. అలాగే ల్యాప్టాప్లను ఒడిలో పెట్టుకుని వాడటం అస్సలు మంచిది కాదు.
ల్యాప్టాప్తో ఎక్కువసేపు
కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి నడుంనొప్పి, వెన్ను నొప్పి రావడం చాలా సహజం. ల్యాప్టాప్తో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల ఇలా వస్తుంది. సాధారణంగా పీసీని వాడేటప్పుడు వెన్నెముక, మెడను నిటారుగా ఉంచి పనిచేస్తాం. అదే ల్యాప్టాప్ను వాడేటప్పుడు మెడను కొద్దిగా కిందకి వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ల్యాప్టాప్ను టేబుల్పై ఉంచి, కూర్చునే కుర్చీని మన ఎత్తుకు తగినదాన్ని ఎంచుకుని పని చేసుకోవాలి. లేకపోతే మెడ నొప్పి, స్పాండిలైట్ను భరించాల్సిందే.
అరగంటకోసారి ఐదు నిమిషాలు
ఈమధ్య కాలంలో మార్కెట్లో ప్రత్యేకంగా కొన్ని స్టాండ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించవచ్చు. లేదంటే మన ఇంట్లో ఉండే టేబుల్స్ను వాడుకుని కంటిచూపుకు సమాంతరంగా తెరను అమర్చుకోవాలి. దీంతో మెడను వాల్చాల్సిన అవసరం రాదు. అలాగే ప్రతి అరగంటకోసారి ఐదు నిముషాలు విశ్రాంతి తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
భుజానికి తగిలించుకోవద్దు
ల్యాప్టాప్తో బండిపై ప్రయాణించేటప్పుడు భుజానికి తగిలించుకోకూడదు. బండిపైనో, పక్కనో పెట్టుకుని ప్రయాణించాలి. భుజానికి తగిలించుకోవడం వల్ల భుజం నొప్పి వస్తుంది. ఒకవేళ భుజానికి తగిలించుకోవలసివస్తే ఒకవైపు కాకుండా రెండువైపులకు కలిపి పిల్లల పుస్తకాల బ్యాగులా తగిలించుకోవడం మంచిది.
మోచేతికి సమాంతరంగా
ల్యాప్టాప్ కీబోర్డ్పై చేతుల్ని సరైన పద్ధతిలో పెట్టుకోవాలి. లేదంటే మణికట్టు, వేళ్ల నొప్పి వస్తూ చివరకు ఏదైనా వస్తువు కూడా పట్టుకోలేనంత స్థాయికి ఈ సమస్య చేరుతుంది. అందుకే ల్యాప్టాప్ కీబోర్డ్కు సరైన స్థితిలో చేతుల్ని ఉంచాలి. వేళ్లను మోచేతికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. మణికట్టును పక్కకు తిప్పి టైప్ చేయడం మంచిది కాదు.
పై విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కంప్యూటర్, ల్యాప్టాప్ల వల్ల రాబోయే ప్రమాదాలను కొంత వరకైనా తగ్గించుకోవచ్చు.
Authorization