ఒకప్పుడు ఫ్లిప్ ఓపెన్ ఫోన్లు అంటే ఫ్యాషన్.. స్మార్ట్ఫోన్లు మాత్రం కాదు.. కీపాడ్ ఫోన్లే.. అయినా ఎంత ఇష్టపడేవారో అవంటే.. మళ్ళీ అదే తరహాలో స్మార్ట్ఫోన్లలో వినూత్నతను తీసుకువచ్చారు తయారీదారులు. అవే.. ఫోల్డబుల్ ఫోన్లు.. ప్రస్తుతం మార్కెట్లో హాట్టాపిక్గా మారాయి. ఈ తరహా ఫోన్లను త్వరలో ప్రారంభించనున్నట్టు ఇప్పటికే శాంసంగ్ ప్రకటించింది. మన దేశీ మార్కెట్లోకి ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ ఫోన్ల వల్ల ఏమేం లాభాలున్నాయో.. అసలు ఉండబోతున్నాయో తెలుసుకుందామా..!
ప్రతి ఒక్కరికి ఫోన్ నిత్యావసరమైపోయింది. సాంకేతిక పరంగా అనేక మార్పులు రూపాంతరం చేసుకుంటూ ఫోన్లు అత్యంత వేగంగా దూసుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ఫీచర్ జోడించుకుంటూనే ఉంది. అంతేకాదు ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా స్మార్ట్ఫోన్ల డిస్ప్లేలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు 4.7 అంగుళాల డిస్ప్లే ఉన్న ఫోన్లనే పెద్దవిగా అభిప్రాయపడేవారు. రానురాను అంగుళాల సైజు పెంచుకుంటూ ప్రస్తుతం 6.8 అంగుళాల వరకు తీసుకువచ్చారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫోన్ సైజుల్లో మార్పులతో పాటు కెమెరాల సంఖ్యను కూడా పెంచుకుంటూ వెళ్ళారు. ఒకప్పుడు ఒక్క కెమెరానే ఉండేది. తర్వాత ఫ్రంట్, బ్యాక్, తర్వాత 3 కెమెరాలు, 5 కెమెరాలు.. బ్యాటరీ కెపాసిటీలో పెరుగుదల, ర్యామ్ సైజు, ఇంటర్నల్ మెమొరీలో పెరపు, ఇలా చాలానే ప్రయత్నాలు చేశారు. ఇలా అన్ని పెంచుకుంటూ మార్పులు చేశారు. ఈ తరహాలోనే ఫోల్డబుల్ ఫోన్లను తయారు చేస్తున్నారు. చాలా కాలంగా అందరినీ ఊరిస్తున్న ఈ మడతపెట్టే ఫోన్ వస్తుందా రాదా అనే మీమాంస ఉండేది. ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ తరహా ఫోన్లను విడుదల చేయనున్నట్టు శాంసంగ్ ఇప్పటికే ప్రకటించేసింది. జులై 30 వరకు మన దేశంలో లాంచ్ చేయబోతున్నట్టు, దీని ధర దాదాపు లక్షన్నర వరకు ఉంటుందని ప్రకటన చేసింది.
ప్రస్తుతం మన ఉపయోగించే ఫోన్లు కింద పడితే చాలు పగిలిపోతాయని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కొంచెం కూడా ఒత్తిడి పడకుండా చూసుకుంటాం. మరి ఇపుడు రాబోతున్న ఈ మడత ఫోన్లు అసలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్సుకత చాలా మందిలో నెలకొంది. అంతేకాదు బ్యాటరీ సైజు, సాఫ్ట్వేర్ వినియోగం, యాప్లు ఇలా అనేకాంశాలు ఏ విధంగా పనిచేస్తాయో తెలియాల్సి ఉంది. అంతేకాదు, ఈ ఫోన్లతో ఉపయోగం ఎంత ఉందో, అసౌకర్యమూ అంతే ఉంది.
చాలా అప్లికేషన్లు ఒకేసారి..
మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లలో ధరను బట్టి అధిక జీబీలు కలిగిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయినప్పటికీ ఒకే సారి కనీసం రెండు మూడు అప్లికేషన్లు ఓపెన్ చేసి ఉపయోగించలేం. ఇందుకు మొదటి కారణం స్క్రీన్ పరిమాణం. అయితే ప్రస్తుతం రానున్న ఫోల్డబుల్ ఫోన్లలో ఆ సమస్య ఉండదు. మనం ఉపయోగించాలనుకున్న అప్లికేషన్లు లేదా యాప్లు ఓపెన్ చేసి డెస్క్టాప్, ల్యాప్టాప్లలో ఉపయోగించిన తీరుగా పక్కపక్కన పెట్టుకుని చూసుకోవచ్చు. వీడియోలు పెద్దవిగా కనిపిస్తాయి. గేమింగ్ప్రియులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్లేయింగ్ గేమ్, గేమ్ కంట్రోల్స్ను పక్కపక్కన పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళేపుడు సాధారణంగా రూట్ కోసం ఉపయోగించే గూగుల్ మాప్స్లో చుట్టుపక్కల ప్రదేశాల కోసం స్క్రీన్ అటు ఇటూ జరుపుతుంటాం. ఇందులో అలాంటి సమస్య ఉండదు. స్క్రీన్ పెద్దదిగా కనిపించి చుట్టుపక్కల ఉండే ప్రదేశాలను స్పష్టంగా అర్థమయ్యేలా చూపిస్తుంది.
సాఫ్ట్వేర్ పనిచేస్తుందా..?
ఫోల్డబుల్ ఫోన్ చేతిలో ఉండగానే సరిపోదు కదా.. అందులో సాఫ్ట్వేర్ ఏ రీతిలో పని చేస్తుందో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. గూగుల్ సంస్థ ఫోల్డబుల్ ఫోన్లకు సపోర్ట్ చేసేలా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో మార్పులు చేర్పులు చేసినప్పటికీ రోజు వాడే వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్స్ వంటివి ఎంత మాత్రం సపోర్టు చేస్తాయన్నది తెలియాల్సి ఉంది. ఆయా సంస్థలు అందుకు తగినట్టు మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ విషయంపై ఆయా యాప్ల తయారీ దారులు కసరత్తు చేయాల్సి ఉంది. ఫోల్డబుల్ ఫోన్కు తగిన విధంగా ఇంటర్ఫేస్ మార్చాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేనా లేదా అనేది తెలియదు.
సైజు తీరు..
ప్రస్తుతం రానున్న ఫోల్డబుల్ మూసి ఉంచితే 4.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. తెరిస్తే మాత్రం 7.3 అంగుళాలు వరకు వస్తుంది. సాధారణంగా మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సార్ట్ఫోన్లు దాదాపుగా 6.1 నుంచి 6.8 అంగుళాల పరిమాణం మధ్య ఉంటున్నాయి. సహజంగా ఫోల్డబుల్ ఫోన్ ఉపయోగించినా ఎప్పుడూ తెరిచే పట్టుకోలేం కదా... ఎక్కువ శాతం ఫోల్డ్ చేసే ఉంచుతాం. అంటే చిన్న సైజులోనే వినియోగిస్తుండాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో కీబోర్డు వినియోగం కష్టతరమయ్యే అవకాశం ఉంటుంది. ఇదే తరహాలోనే బ్యాటరీ వినియోగం కూడానూ.. సాధారణంగా ప్రస్తుతం ఉపయోగించే స్క్రీన్ సైజుకు తగినట్టుగా బ్యాటరీలు ఉంటున్నాయి. మరి ఫోల్డబుల్ ఫోన్ను మూసివేసినపుడు, తెరిచినపుడు బ్యాటరీ లైఫ్ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోన్ను అవసరాన్ని బట్టి తెరుస్తూ, మూస్తూ ఉపచయోగించే క్రమంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వినియోగంలో ఇంటర్ఫేస్ మార్పు చెందుతూ ఉంటుంది. ఈ క్రమంలో బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
మందం ఎక్కువ..
సహజంగా స్మార్ట్ఫోన్లో అడ్వాన్స్ వర్షెన్స్ వస్తున్నాయి అంటే ముందుగా ఆలోచించేది ఎంత స్లిమ్ ఉంటుందనే. మరి ఫోల్డబుల్ ఫోన్లలో ఆ పరిస్థితి లేదు. ఇపుడు వాడే ఫోన్ల కంటే మందంగా ఉండనున్నాయి. అందువల్ల జేబుల్లో తీసుకెళ్ళడం కష్టతరమే. అంతేకాదు, ఏదైనా మడతపెట్టినపుడు, ఆ ప్రదేశంలో కాస్తయినా నలిగినట్టు కనిపిస్తుంది. మామూలుగా చూసినపుడు ఇది కనిపించకపోవచ్చు కానీ కొన్ని యాంగిల్స్లలో కనిపించే అవకాశం ఉంది. అంతేకాదు, ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్ చేస్తూ ఉంటే కొంత కాలానికైనా స్క్రీన్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉపయోగించేకొద్ది డెడ్ పిక్సెల్స్ ఏర్పడే ప్రమాదమూ ఉంది.
ఇతర తయారీ సంస్థలు..
శాంసంగ్తో ఫోల్డబుల్ ఫోన్ను తీసుకువస్తున్నట్టు ప్రకటించిన తర్వాత షియోమీ, ఒన్ప్లస్, హువారు కంపెనీలు సైతం ఫోల్డబుల్ ఫోన్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించాయి. అంతేకాదు, శాంసంగ్ కంటే తక్కువ ధరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదే జరిగితే మున్ముందు ఫోల్డబుల్ ఫోన్ల ధరలు సైతం తగ్గే సూచనలు ఉన్నాయి. అదే జరిగితే స్మార్ట్ఫోన్ బదులు ఫోల్డబుల్ ఫోన్ వాడకం పెరుగుతుందేమో..
Authorization