అతి ఎప్పుడైనా అనర్థమే అని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ విషయం మానవ నిత్యావసరాలలో ఒకటైన స్మార్ట్ఫోన్ వినియోగానికి సరిగ్గా సరిపోతుంది. పెరుగుతున్న సాంకేతికతతో ఫోన్ వినియోగం పెరిగింది. ఇందుకు తగినట్టే ఆయా నెట్వర్క్లు ఇంటర్నెట్ ను ఎక్కువగా అందిస్తున్నాయి. ఇది మానవ జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఏ వస్తువైనా సరే ఉపయోగించే తీరులో ఉంటుంది. మితిమీరిన వినియోగం మనిషి జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫోన్ను అతిగా వినియోగిస్తే, ఏర్పడే సమస్యలు, మనల్ని మనం కట్టడి చేసుకునేందుకు కొన్ని సూచనలు చూద్దాం..
స్మార్ట్ఫోన్ల్ వినియోగం ఏ రీతిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పెద్దా తేడా లేదు.. ప్రతి ఒక్కరిలో చేతిలో స్మార్ట్ఫోన్ దర్శనమిస్తోంది. కొందరు స్టైల్ కోసం, మరికొందరు అవసరం కోసం, కారణమేదైనా సరే.. ఫోన్ మాత్రం తప్పనిసరి అయింది. ఈ సంస్కృతి పట్టణాలు, నగరాలే కాదు.. పల్లెల్లోనూ వ్యాపించింది. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత స్మార్ట్ఫోన్ అమ్మకాలు అదే తీరున డేటా వినియోగాలు నానాటికి పెరుగుతున్నాయి. మరో ఏడాదిలో డేటా వినియోగం ఐదు రెట్లు పెరుగుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణగా ఈ మధ్య కాలంలో డేటాకు సంబంధించి ఆయా కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ వినియోగం పెరిగే కొద్ది అందరూ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఉదాహరణకు చిన్నపిల్లలనే తీసుకుంటే.. పసి పిల్లలకు చేతిలో ఫోన్ లేకుంటే అన్నం కూడా తినరు. వారికి అందులో కనిపించే రంగుల రంగుల బొమ్మలు కావాలి. కొంచెం పెరిగిన పిల్లలకు వీడియో గేమ్స్, షూటింగ్ గేమ్స్, ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న పబ్జీ లాంటి ఆసక్తికరమైన గేమ్స్ కావాలి. ఇంకాస్త వయసొచ్చిన వారి నుంచి పెద్దవారి దాకా సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్నారు. ఇలా వయసును బట్టి ఏదోక రీతిలో స్మార్ట్ఫోన్ వినియోగానికి బానిసలవుతున్నారు.
ప్రమాదాలు
ఇంటర్నెట్ ప్రపంచాన్ని చిన్నదిగా మార్చేసింది. స్మార్ట్ఫోన్ వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. దీనికి చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బానిసలవుతున్నారు. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. సోషల్ వెబ్సైట్లలో ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. దీని వల్ల ఏర్పడే ప్రమాదాల గురించి న్యూరో రెగ్యులేషన్ జర్నల్లో కొన్ని భయంకరమైన అంశాలు వెల్లడించారు. అవసరం కోసం కొద్ది సమయం స్మార్ట్ఫోన్పై కేటాయించడం ప్రమాదం కాదు. కానీ అదే పనిగా వినియోగిస్తుంటే.. ఆలోచనా పరిధి మందగిస్తుంది. నరాలపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఒత్తిడి పెరుగుతుంది. ఆత్రుత, ఒంటరితనం అధికంగా ఉంటుంటాయి. సాధారణంగా మానవ మెదడు ఒక భాగం యాక్టివ్గా ఉంటే, మరో భాగం విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తూ, ఫోన్ను కూడా వాడుతుంటే మాత్రం మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇవన్నీ కలిపి మనిషి సహజసిద్ధ స్వభావాన్ని కోల్పోయి అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. నెట్ ఆన్లో ఉంచడం వల్ల రేడియన్ ముప్పు తప్పదు. మానసికంగా ఏర్పడిన ప్రభావం ఎదుటి వ్యక్తులను నిందించే పరిస్థితికి తీసుకెళ్తుంది.
అనారోగ్య సమస్యలు
ఫోన్ వాడకం పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా డేటా వినియోగం పెరిగేకొద్దీ ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఒకప్పుడు ఒక రోజుకు 1జీబీ డేటా వినియోగం వస్తేనే ఎక్కువ అనుకుంటే, ప్రస్తుతం అపరిమితంగా ఉంటోంది. డేటా ఎక్కువగా ఉంటుండడంతో అదే పనిగా ఫోన్లో యూట్యూబ్, పలు రకాల ఎంటర్టైన్మెంట్ యాప్స్ వినియోగం వంటివి విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల అర్ధరాత్రి అయినా నిద్రపోకపోవడం, తెల్లవారినా నిద్ర లేకపోవడం, తినేపుడు,నడిచేపుడు ఇలా ప్రతి పనిలో ఫోన్ ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెదడు ఒత్తిడికి లోనై, పని తీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. తరచూ ఫోన్లోనే గడపడం అలవాటైతే ఒంటరితనం పెరుగుతుంది. అంతేకాదు, ఇంటర్నెట్ వినియోగం ఎక్కువవడంతో రేడియషన్ ముప్పు లేకపోలేదు.
తప్పించుకోవాలంటే..
- నిద్ర పోవడానికి కనీసం గంట ముందు ఫోన్ను పక్కకు పెట్టేయాలి. ఫోన్ లైట్ నుంచి వెలువడే బ్లూవేవ్లెంథ్ కాంతి మెదడులో నిద్రను కలిగించే మెలటోనిస్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది.
- ఫోన్ను చాలా మంది పక్కనే పెట్టుకుని పడుకుంటారు. మొబైల్ ఫోన్లలో వచ్చే నోటిఫికేషన్లు, పింగ్లు, వైబ్రేషన్లు, అలెర్ట్ల వల్ల నిద్రకు అంతరాయం ఏర్పడి సుఖ నిద్ర దూరం అవుతుంది. కనీసం రెండు మీటర్ల దూరంలో ఉంచాలి. రాత్రి సమయాలలో సైలెంట్లో పెట్టడమో, స్విచ్ఛాఫ్ చేయడమో మంచిది. దీని వల్ల రేడియషన్ ప్రభావం అంతగా పడదు.
- ఏదోక పని ఉన్నపుడు ఫోన్లో అలారం పెట్టుకోవడం ఎవరికైనా సర్వసాధారణమైన అలవాటు. అలారం పెట్టుకుంటే ఫోన్ పక్కన పెట్టుకోవాలి. దాని వల్ల సమస్యగా ఉంటుంది. అలా కాకుండా అలారం కోసం వేరే గడియారం ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
- ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో లీనమవ్వకపోవడం ఉత్తమం.
- మొబైల్, కంప్యూటర్,ల్యాప్ట్యాప్ వంటి వాటిపై ఆసక్తి కలిగినపుడు, వాటి స్థానంలో పుస్తక పఠనం అలవరుచుకోవాలి.
- సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఆన్లైన్ మీద ఆధారపడకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం సమయం కేటాయించుకోవాలి. దీని వల్ల మానసిక ప్రశాంతతతో పాటు, మానవ సంబంధాలు మెరుగుగా ఉంటాయి.
- ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ, ఫోన్, సోషల్ మీడియా వినియోగానికి తక్కువ సమయం కేటాయిస్తుంటే.. ఆరోగ్యం బాగుంటుంది. మానసికానందం ఉంటుంది.
Authorization