ప్రస్తుతం అందరూ వినియోగించే నిత్యావసరాలలో భాగమైన స్మార్ట్ఫోన్, ల్యాప్ట్యాప్లలో బ్యాటరీ కీలకం. ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నపుడు బ్యాటరీ డీిచార్జ్ అయితే ఇక అంతే సంగతులు. ఆ కంగారు అంతా ఇంతా కాదు. అసహనం, ఆగ్రహం ఆగవు కూడానూ.. అందువల్ల ల్యాప్ట్యాప్, ఫోన్ కొనుగోలు చేసేపుడు బ్యాటరీ సామర్థ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఏయే సామర్థ్యం ఉన్న బ్యాటరీలు ఎలా పని చేస్తాయో, వాటిని ఏ విధంగా వినియోగిస్తే ఉపయోగంగా ఉంటుందో తెలుసుకుందాం..
బ్యాటరీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం మనం ఉపయోగించేవి రెండు రకాలుగా తీసుకోవచ్చు. అవి చార్జ్ చేస్తూ వినియోగించేవి. ఉపయోగించి పడేసేవి. అయితే వీటిల్లోనూ రకాలున్నాయి. నికిల్ కాడ్మియం, నికెల్ హైడ్రేడ్, లిథియం అయాన్, లిథియం పాలిమర్ బ్యాటరీలు ఇందులో ముఖ్యమైనవి. ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీలను ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. నికిల్ కాడ్మియం, నికెల్ హైడ్రేడ్ బ్యాటరీలు కాస్త బరువుగా ఉంటాయి.ప్రస్తుతం వాడేవి లిథియం అయాన్ బ్యాటరీలు.. ఇవి చాలా తేలికగా ఉంటాయి, వీటి లైఫ్టైమ్ కూడా ఎక్కువే. ఈ బ్యాటరీలకు ఎప్పుడు కావాలన్నా రీచార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ పాతతరం బ్యాటరీలు డీచార్జ్ అయితేనే చార్జింగ్ పెట్టే వెసులుబాటు ఉండేది. బ్యాటరీ రసాయన, విద్యుత్చ్ఛక్తుల అనుసంధానం. ఇందులో ఎక్కువ శక్తి, తక్కువ శక్తి రెండూ కలిగిన ఉత్పన్నాలుగా మారుతూ అదనపు శక్తిని విద్యుత్శక్తిగా మార్చుకుంటాయి. వీటిని గాల్వానిక్ బ్యాటరీలంటారు. రేడియోలు, రిమోట్లు, గోడ గడియారాలు, టార్చ్లైట్లు వాటిలో వీటిని వినియోగిస్తారు. వీటిలో రసాయనిక శక్తి అయిపోయాక పనికి రాకుండా పోతాయి. కొన్ని రసాయనిక చర్యతో అల్పమైన శక్తితో ఉన్న రసాయనాలను విద్యుత్ శక్తిగా అందించి అధికశక్తి గల ఉత్పన్నాలుగా మార్చగలిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి రసాయనాలు కలిగిన బ్యాటరీలను విద్యుద్విశ్లేషణ బ్యాటరీలు అంటారు. వీటిలో రసాయనాలు చర్య జరిపే క్రమంలో విద్యుత్శక్తిని వెలువరించి తిరిగి వీటికి విద్యుత్శక్తిని అందిస్తే మళ్ళీ రసాయనాలుగా మారిపోతాయి. అందుకే వీటిని రీచార్జబుల్ బ్యాటరీలు అంటారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్స్, ల్యాప్ట్యాప్లలో ఉండేవి ఇలాంటివే.
పొటెన్షియల్ పరిధి..
బ్యాటరీలు రసాయన శక్తులను విద్యుచ్ఛక్తిగా ఆర్చుకుంటే, విద్యుచ్ఛక్తి ద్వారా షాక్ కొడుతుందనే అపోహ ఉంది. అయితే బ్యాటరీల ద్వారా కరెంట్ షాక్ కొట్టాలంటే తగినంత విద్యుత్ పొటెన్షియల్, విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉండాలి. బ్యాటరీల్లో ప్రవాహం కన్నా పొటెన్షియల్ పాత్రే ఎక్కువ. వీటిల్లో వాడేది విద్యుత్ అయినప్పటికీ పొటెన్షియల్ చాలా తక్కువగా ఉంటుంది. రిమోట్లో వాడే సాధారణ బ్యాటరీలలో ఉండేది 1.5ఓల్టుల డీసీ కరెంట్. ద్విచక్ర వాహనాలు, కార్లలో వాడే లెడ్ బ్యాటరీలలో 12 ఓల్టులకు మించి ఉండదు. అందుకే ఆ బ్యాటరీలను తాకినా షాక్ కొట్టదు.
చార్జింగ్ సామర్థ్యం..
ప్రస్తుతం మనం ఉపయోగించే విద్యుద్విశ్లేషణ బ్యాటరీల్లో రీచార్జి చేసి బ్యాటరీల సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కానీ రీచార్జి చేసినపుడల్లా ఆ బ్యాటరీల సామర్థ్యంపై కొంత ప్రభావం పడుతుంటుంది. కొంత మందికి చార్జింగ్ కాస్త తగ్గినా వెంటనే చార్జి చేయడం అలవాటుగా ఉంటుంది. ఇది కచ్చితంగా బ్యాటరీ సామర్థ్యంపై ప్రభావం పడుతుంటుంది. అయితే నిర్దిష్ట సంఖ్యకు చేరిన దగ్గరి నుంచి చార్జింగ్ పెట్టుకోవచ్చు. 1700 నుంచి 2000 ఎంఏహెచ్ వరకు ఉండే బ్యాటరీలు నికెల్ మెటల్హైడ్రేడ్ బ్యాటరీలను వెయ్యి సార్ల వరకు, 2500 ఎంఏహెచ్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలను ఐదు వందల సార్లు రీచార్జ్ చేయవచ్చు. నికెల్ కాడ్మియం బ్యాటరీలను మాత్రం వెయ్యిసార్లు రీచార్జి చేసుకోవచ్చు.
ఎక్కువ కాలం మన్నాలంటే..
బ్యాటరీలో ఎక్కువ శక్తిని వాడుకునేది స్క్రీన్ బ్రైట్నెస్. ఫోన్ చూడగానే ఇంపుగా కనిపించేందుకు బ్రైట్నెస్ ఎక్కువ సెట్ చేస్తుంటార. ఇది బ్యాటరీ మీద ప్రభావం పడుతుంది. అందుకే బ్రైట్నెస్ అవసరం మేరకే ఉంచాలి. అంటే డిస్ప్లే సెట్టింగ్స్లో దీన్ని 30-40 శాతం వరకు సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి ఫోన్లో డేటా వినియోగం తప్పనిసరి అవుతోంది. డేటాతో అనుసంధానం చేసుకునే ఫోన్లను అవసరం లేనపుడు వాటిని ఆఫ్ చేస్తే కూడా బ్యాటరీ సేవ్ అవుతుంది. కొంత మంది ఫోన్ను మాటిమాటిక టచ్ చేస్తూ ఉండడం అలవాటు. అవసరం లేకున్నా దాన్ని అలా టచ్ చేస్తూ ఉంటే ఆన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనూ బ్యాటరీ వినియోగం అవుతుంది. స్క్రీన్ టైమ్అవుట్ సమయాన్ని ఎక్కువ సేపు ఉండేలా సెట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సమయాన్ని చాలా తక్కువకు సెట్ చేసుకోవాలి. వీటితో పాటు బ్లూటూత్ కూడా చార్జింగ్ ఎక్కువగానే వినియోగంలో ఉంటుంది. అవసరాన్ని బట్టి ఉపయోగించాలి. వినియోగించని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకుంటే బ్యాటరీని చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. బ్యాటరీ చార్జింగ్ మొత్తం అయిపోయేంత వరకు ఉంచి, తర్వాత చార్జింగ్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం బ్యాటరీ మన్నే అవకాశం ఉంటుంది.
చేయకూడనివి..
ఫోన్ను యూఎస్బీతో ల్యాప్ట్యాప్, సీపీయూకు కనెక్ట్ చేస్తే చార్జింగ్ అవుతుంది. కానీ పవర్ ప్లగ్కు కనెక్ట్ చేసి చార్జింగ్ పెట్టడం ఉత్తమం. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి చార్జింగ్ పిన్ సరిపోతే చాలని చార్జింగ్ పెట్టేస్తుంటాం. లేదంటే మొబైల్తో పాటు వచ్చిన చార్జర్ పోతే ఏదోక చార్జర్ కొని ఉపయోగిస్తుంటాం. మార్కెట్లో పలు రకాల చార్జర్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే సాధ్యమైనంత వరకు ఫోన్తో పాటు వచ్చిన చార్జర్ను ఉపయోగిస్తేనే ఉత్తమం. అలా కుదరని పక్షంలో ఫోన్ బ్యాటరీ ఓల్టేజీకి సరిపోయే లేదా దగ్గరగా ఉన్న చార్జర్ ఉపయోగించాలి. చార్జింగ్ పెట్టేపుడు కూడా ఫోన్లో అప్లికేషన్లు ఆఫ్లో ఉంచి పెట్టడం ద్వారా త్వరగా చార్జ్ అవుతుంది. ఎయిరోప్లేన్ మోడ్లో పెడితే అప్లికేషన్లు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. ఫోన్ వైబ్రేషన్లో ఉంచుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఫోన్ను నార్మల్ మోడ్లో ఉండేలా చూసుకోవాలి. చార్జింగ్ సమయంలో పాటలు వినడం, సినిమాలు చూడడం, ఫోన్ ఆపరేట్ చేయడం వంటి చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్టైమ్ను కాపాడుకోవచ్చు.
Authorization