బ్యాంకులలో చోటుచేసుకుంటున్న ఫ్రాడ్లు ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటితో పాటు లావాదేవీల విషయంలోనూ కొన్ని ఆంక్షలు ఉంటుండడంతో పెద్ద మొత్తంలో లావాదేవీలకు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. వీటన్నింటినీ అధిగమించేందుకు మన దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీని ద్వారా డిసెంబర్ మొదలుకొని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు ఒక ముఖ్యమైన సదుపాయాన్ని తీసుకు రాబోతున్నాయి. అదే సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ రిజిస్ట్రీ సేవలు. ప్రస్తుతం 'యూపీఐ' సేవలు బాగానే విస్తరించాయి. ఈ కోవలో అనేక విధానాలు కొత్తగా అందుబాటులోకి వచ్చినప్పటికీ, పెద్ద మొత్తంలో డబ్బులు ఒక అకౌంట్ నుండి మరొక అకౌంట్కి మార్పిడి చేసుకోవాలంటే మాత్రం అధిక శాతం వినియోగదారులు సెక్యూరిటీ ఉంటుందని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా NEFT లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయిత నెఫ్ట్ సదుపాయం ఉపయోగించుకోవాలంటే ఉదయం 8 గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. ఆ సమయానికి ముందు చేసినా, తర్వాత చేసినా మళ్ళీ బ్యాంక్ సమయానికి మాత్రమే సదరు అకౌంట్కు డబ్బులు చేరతాయి. ఇది ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని లావాదేవీలను మరింత సులువు చేసేందుకు డిసెంబర్ 2019 మొదలుకొని, నెఫ్ట్ లావాదేవీలను 24 గంటల పాటు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించనుంది. అంతేకాకుండా వారమంతా ఈ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు ఇప్పటివరకు నెఫ్ట్ లావాదేవీలు నిర్వహించేపుడు ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ను బట్టి రూ. 2.5 నుంచి రూ.25 వరకు అదనంగా చెల్లించే చార్జీలను తొలగించే ఆలోచనలో ఆర్బీఐ ఉంది. అదేవిధంగా, ఆర్థికపరమైన మోసాలు జరగకుండా ఉండటం కోసం సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ రిజిస్ట్రీ అనే ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచనలోనూ ఉంది. ఫ్రాడ్ లావాదేవీలు నిర్వహించే వారికి సంబంధించి సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ సమాచారాన్ని వినియోగదారులకు అందించడం ద్వారా ఆర్థికపరమైన నేరాలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కచ్చితంగా ఆర్థిక నేరాలు కొంత వరకు కట్టుదిట్టం అయ్యే అవకాశం లేకపోలేదు.
Authorization