ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో రైల్టెల్ భాగస్వామ్యంతో గూగుల్, భారతీయ రైల్వేలు 2015లో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంటే ఆయా స్టేషన్లలో రైలు కోసం వచ్చే వారు ఈ వైఫైని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రోగ్రాంను నిలిపి వేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. గూగుల్ తెలుపుతున్న దాని ప్రకారం మన దేశంలో ఇంటర్నెట్ బాగా చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్ల ధర బాగా తగ్గిపోవడంతో ఎక్కువ మంది వినియోగదారులకు డేటా అందుబాటులో ఉంటోంది. దీంతో పబ్లిక్ వైఫై అవసరం బాగా తగ్గిపోయింది. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకధరకు మన దేశంలో ఇంటర్నెట్ రావడంతో పాటు కనెక్టెవిటీ సైతం బాగా అభివృద్ధి చెందింది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను ఉపయో గిస్తున్నారు. సొంత డేటా అవకాశం ఉన్నపుడు పబ్లిక్ వైఫై గురించి ఎవరూ ఆలోచించరు కదా. అంతేకాదు, వీటి నిర్వహణ సైతం కష్టం అవుతున్నట్లు గూగుల్ పేర్కొంది.ఈ విషయంలో మెరుగైన ఫలితాలు రాకపోవడంతో గూగుల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. రైల్ వైఫై విషయంలో గూగుల్, ఇతర భాగస్వాములు సాంకేతికపరమైన మౌలిక వసతుల కల్పనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరించాలన్నా ఎంతో ఖర్చు, శ్రమ అవసరం అవుతుందనే ఉద్దేశంలో గూగుల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు సందేహాలున్నాయి. గూగుల్ తన పరిధిని వేరే ప్రాంతాల్లో విస్తరించాలను కుంటున్నట్లు సమాచారం. ఈ కారణాల దృష్ట్యా రానున్న పది నెలల్లో ఈ సర్వీసును పూర్తిగా నిలిపి వేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవలు, యాప్లను రూపొందించడం మాత్రం ఆపబోమని గూగుల్ ఈ సందర్భంగా వెల్లడిందింది. గూగుల్తో కుదుర్చుకున్న ఐదేండ్ల ఒప్పందం ముగియడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటోందని, ఆ సంస్థ సహకరించకపోయినా ప్రయాణికులకు ఉచిత వైఫైని అంది స్తామని రైల్టెల్ ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంటే గూగుల్ తప్పుకున్నప్పటికీ ప్రజలకు ఉచిత వైఫై మాత్రం ఆగదనే సమాచారం. అయితే రైల్ టెల్ ఈ ప్రాజెక్టును ఎలా నిర్వహిస్తుందో వేచిచూడాలి.
Authorization