Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరతరాలుగా ఆర్థికదోపిడీ, సామాజిక అణచివేతకు గురవుతున్న దళితులపై కరోనా వైరస్ మరింత దుర్భర దారిద్య్రంలోకి నెట్టింది. ఓవైపు ఆకలి, మరోవైపు అవమానాలను భరిస్తున్న దళితుల పరిస్థితి ఈ కాలంలో మరింత దిగజారింది. దేశంలోని 16కోట్ల మంది వలస కార్మికుల్లో నూటికి 80శాతం మంది దళితులు, ఆదివాసీలే అంతరాష్ట్ర వలస కార్మికులు కూడా అత్యధికులు దళితులే. వ్యవసాయరంగ సంక్షోభం, యాంత్రీకరణ వల్ల పనులు దొరకక పొట్టచేతబట్టుకొని పట్టణాలకు వలస వచ్చిన దళితులు, నేడు కరోనా లాక్డౌన్ వల్ల తిరిగి తమ స్వంత గ్రామాలకు వెళ్ళిపోయారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉపాధికోసం వచ్చి డేరాలలో జీవనం సాగించేవారు. మహిళలు ఇండ్లల్లో పనులు, పురుషులు మట్టిపని, తాపీపని ఇతర కూలీ పనులకు వెళ్ళి తమ కుటుంబాలను పోషించుకునేవారు. గ్రామాలకు వెళ్ళాక అప్పటికే గ్రామాల్లో నివాసముంటున్న వారికి చేతినిండ పనిలేదు. కేవలం 15రోజుల పాటు వరిపోలాల్లో పని దొరికింది. గ్రామీణ ఉపాధి పనులు 15 నుంచి 20 రోజులకు మించి పెట్టలేదు. కుటుంబాలతో గ్రామాలకు వచ్చిన వారికి పనులు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధికోల్పోతున్న దళితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపడంలో పాలకులు విఫలమైన ఫలితంగా ఒకవైపు ఆకలిచావులు, మరోవైపు కరోనా చావుల మధ్య ''అడకత్తెరలో పోకచెక్కలా'' దళితుల జీవన స్థితిగతులు మారాయి.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 13లక్షల కుటుంబాల్లో 54.09 లక్షల దళిత జనాభా ఉంది. రెక్కాడితేగాని డొక్కాడని సెంటు, గుంట భూమికి నోచుకోని సమారు 7లక్షల కుటుంబాలున్నాయి. 2014 సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 3లక్షల కుటుంబాలకు గజం గూడా భూమిలేదని ప్రభుత్వం పేర్కొన్నది. వారందరికీ 3ఎకరాల చొప్పున భూ పంపిణి చేస్తానని 2014ఆగస్టు 15న సీఎం. కేసీఆర్ గోల్కొండకోట నుంచి ఆర్భాటపు ప్రసంగం చేశారు. ఏడాదిలో 60వేల కుటుంబాల చొప్పున ఐదేఏండ్ల పాలనలో 3లక్షల కుటుంబాలకి భూపంపిణి మాత్రమే చేస్తామని చెప్పారు. కానీ ఏడాదికి వెయ్యి మందికి కూడా భూపంపిణీ చేయలేదు. మూడు ఎకరాల భూమి కోసం ముగ్గురు దళితులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మొత్తం టీఆర్ఎస్ పాలనలో 6,661 కుటుంబాలకు 15,882 ఎకరాల భూపంపిణీ చేశారు. వారిచ్చిన వాగ్దానంలో రెండు శాతం కూడా అమలు చేయలేదు.
భూపంపిణీ అనే పదానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త అర్థం తెచ్చింది. దళితుల స్వాధీనంలో ఉన్న భూములైన అసైన్డ్ భూములు, భూదాన భూములు, ఇనాం భూములు, సొసైటీ భూములు, పోరంబోకు భూములు, పంచరాయి భూములన్నింటిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీగానే బలవంతంగా లాక్కుంటున్నది. రైతు సమన్వయ వేదికలు, పార్కులు, నర్సరీలు, వివిధ ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణం పేరిట నోరులేని, బువ్వలేని అభాగ్యుల పొట్టలు కొడుతున్నది. రాష్ట్ర వ్యాపితంగా కేవీపీఎస్ కార్యకర్తల అధ్యయనంలో వెల్లడైన కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. మహాబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో గతంలో ప్రభుత్వ మోడల్ స్కూల్ నిర్మాణం పేరిట సర్వే నెం.545/1ని బలవంతంగా దళితుల ఉమ్మడి భూమిని లాకున్నారు. నేడు రైతు సమన్వయ వేదిక పేరిట మళ్లీ దళితుల భూములనే గుంజుకున్నారు. నాడు వరంగల్ కలెక్టర్గా ఉన్న కాకి మాదవరావు 1974లో దళితులను సొసైటీలుగా ఏర్పాటు చేసి ప్రతీ కుటుంబానికి 4.14 గుంటల చొప్పున పంపిణీ చేశారు. వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం 3ఎకరాల భూమిని ఇవ్వకపోగా 47మంది దళిత రైతుల భూమిని గుంజుకుంది. నారాయణపేట జిల్లా దామరగిద్ధ మండలం గడ్డి మాకంపల్లిలో ఓ దళితరైతు 28గుంటల భూమిలో కంది, పత్తి పంట వేశాడు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఆ పంటను జేసీబీతో నేల మట్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబినగర్ శివారు రంగాపురం దళితుల భూదాన భూమి 863 ఎకరాలను నార్నే రంగారావు నార్నే ఎస్టేట్ పేరుతో ఆక్రమించుకున్నాడు. ఎయిమ్స్ హాస్పిటల్ పేరిట సగం భూమి ఆక్రమణకు గురైంది. దళితులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఎయిమ్స్లో స్థానిక నిరుద్యోగులకూ ఎటువంటి ఉపాధి కల్పించలేదు.
కరోనా లాక్డౌన్ కాలంలో చస్తామో బతుకుతామో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటున్న దళితులపై ఆధిపత్యదాడులు, అత్యాచారాలు, హత్యలు ఆగలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం మల్లాపూర్ గ్రామంలో రేవుల రాజబాబు అనే దళిత యువకుడిని తన భార్యపిల్లల ముందే అదే గ్రామానికి చెందిన గోనే శ్రీనివాసరావు అనే పెత్తందారుడు తన అనుచరుల ద్వారా భౌతికదాడి జరిపి తన కాళ్ళ దగ్గర పడేయించి మరీ కొట్టించారు. మెడనరాలు, తలకు బలమైన దెబ్బలు తగిలి వరంగల్ ఎంజీఎంలో మరణించాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మరిపెల్లి గ్రామంలో దళిత యువకుడు వీర్లపల్లి కిరణ్ కుమార్ హత్య జరిగింది. ఇసుక మాఫియాతో మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మాలాపూర్ దళిత రైతు నర్సింహ్మపై లారీఎక్కించి హత్యగావించారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు తన 30గుంటల భూమి పట్టా చేయించమని అడిగినా సర్పంచ్, వీఆర్ఓ చేయకపోవటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా మద్దులపల్లి దళిత మహిళ సర్పంచ్ కర్లపుడి సుభద్ర పట్ల మంత్రి పువ్వాడ ప్రోటోకాల్ పాటించకుండా అహాంకాపూరితంగా మాట్లాడి సభావేదికపైకి రానియ్యకుండా అవమానించాడు. భువనగిజిల్లా ముత్తిరెడ్డి గూడెం గ్రామ దళిత మహిళా సర్పంచ్ విజయను ఉపసర్పంచ్ చాడా శశిధర్రెడ్డి తన అనుయాయులు నిరంతరం వేధించడం తన విధులు నిర్వహించకుండా వివక్ష పాటించడంపై ఉద్యమం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ దళిత మహిళా సర్పంచ్ జాన్సీ తన వార్డు మెంబర్లపై అదే గ్రామానికి చెందిన ఆనంద్రెడ్డి, నర్సింహరెడ్డి తన అనుయాయులతో భౌతిక దాడి చేయించారు.
ఇక కరోనా లాక్డౌన్కంటే ముందునుండే దళిత నిరుద్యోగులకు రుణాలు అందటంలేదు. ప్రభుత్వం కార్పొరేషన్కు పరిపుష్టి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల గత రెండేండ్లుగా 2లక్షల మంది లబ్దిదారులు రుణాలకోసం ఎదురుచూస్తున్నారు. 2018-19, 2019-20 ఆర్థిక యాక్షన్ప్లాన్ విడుదల చేయలేదు. గత రెండేండ్లుగా రుణాలు అందక దళిత నిరుద్యోగులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. డీఐసీ రుణాలు గత నాలుగేండ్లుగా లబ్ధిదారుల దరిచేరలేదు. దళితులందరిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామన్న వాగ్దానం ఎండమావిగా మారింది. కరోనా కాలంలో ఎస్సీ కార్పొరేషన్ నిరుద్యోగులకు రుణాలు ఇచ్చి ఆదుకోవల్సిన సమయంలో పెండింగ్ పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నది.
గత ఐదు నెలలుగా విద్యాసంస్థలు మూత పడ్డాయి. సెప్టెంబర్ 1నుంచి ఆన్లైన్ విద్యను ప్రారంభించారు. దేశవ్యాపితంగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైన అంశం ఏమిటంటే నూటికి 10శాతం దళిత కుటుంబాలకు ఇంటర్నెట్ అందుబాటులోలేదు. దళిత విద్యార్థులు ఆన్లైన్ విద్యకు దూరంగా ఉన్నారని మనకు విధితమవుతున్నది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్కు నోచుకోని దళిత పిల్లలకు చదువు దూరం కావాల్సిందేనా?
ఓవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విద్యకు దూరం చేస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విదానం కార్పొరేట్లకు కాసులున్న వారికే విద్య పరిమితం చేస్తున్నది. దీంతో ఉన్నత విద్య కూడా విద్య ప్రయివేటీకరణ, కాషాయీకరణతో దళితులు, పేదలందరికీ దూరంకానుంది. ఈ కరోనా కాలంలో దళితుల పట్ల అనుసరించిన కపటమోసం ఇది. స్కాలర్షిప్లు, రిజర్వేషన్లు గురించి పల్లెత్తు మాట నూతన విదానంలోలేదు.
కరోనా మొదటి దశలో 12కేజీల బియ్యం, రూ.1500లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నేడు కరోనా తీవ్రంగా పెరిగి ఉపాధి లేక విలవిలాడుతుంటే ఆకొద్ది పాటి సహాయాన్ని కూడా రద్దుచేసి ప్రజల కష్టాలను గాలికొదిలింది. డబ్బులున్న వాళ్ళంత కార్పొరేట్ హాస్పిటల్స్లో లక్షలు పెట్టి కరోనా చికిత్స పొందుతుంటే పేదలు మాత్రం బిక్కుబిక్కు మంటున్నారు. ఆరోగ్యశాఖలో ఖాళీలు భర్తీ చేయడంలేదు. పీహెచ్సీలలో డాక్టర్లు లేరు. మందులు, యంత్ర పరికరాలు లేవు, బెడ్స్ లేవు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలే దళితులకు అందుబాటులో ఉంటాయి. అక్కడే అరకొర సౌకర్యాలుంటే కరోనా వచ్చిన దళితులు, పేదలకు ప్రభుత్వం వైద్యం ఎలా అందిస్తుంది? రాష్ట్రంలో 584 మండలాల పరిధిలో 20వేల ఎస్సీ పల్లెలు ఉన్నాయి. మండలానికో సంచార వైద్య వాహనం 104 ద్వారా నెలరోజుల పాటు ప్రతీ వ్యక్తికీ కరోనా పరీక్షతో పాటు సీజనల్ వ్యాధులు సోకిన వారికి వైద్యం అందించాలి. ప్రతీ పీహెచ్సీలో 100బెడ్స్ ఏర్పాటుచేసి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. అవసరం అయితే ఎస్సీఎస్డీఎఫ్ నుంచి ఖర్చు పెట్టాలి. కరోనా లాక్డౌన్ విపత్తులో రెండు రోజుల పాటు దళితుల ప్రాథమిక సమస్యలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చజరపాలి. దళితులకిచ్చిన ప్రధాన వాగ్దానాల అమలు తీరుతెలన్నులపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలి.
- టి. స్కైలాబ్ బాబు
సెల్: 9177549646