Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశువులను దొంగతనం చేసే దొంగలు ఒక టెక్నిక్ పాటిస్తారట. పశువు మెడలో ఉన్న గంటను తీసుకుని ఒకడు ఒక వైపుకు పరుగెడితే... మరోకడు పశువును తీసుకుని వ్యతిరేక దిశలో పరుగెడుతాడు. పశువు దొంగతనం జరిగిందని తెలియడంతో ఊరి జనం గంట శబ్దం ఎటునుంచి వస్తున్నదో గమనించి అటు వైపు పరుగెడుతారు. పశువు మాత్రం దొంగల పాలవుతుంది. ప్రజలు మాత్రం గంట శబ్దం వస్తున్న వైపు పరుగెడుతూనే ఉంటారు. పశువు స్థానంలో నిరుద్యోగం, జీడీపీ, కరోనా విలయతాండవం, ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి, నియంత్రృత్వం, ప్రశ్నించేవారిపై కేసులు, అవినీతి, మత కలహాలు ఉంటాయి. గంట స్థానంలో దేశభక్తి, చైనా యాప్ల నిషేధం, సుశాంత్ ఆత్మహత్య, బిగ్బాస్-4 ఉంటాయి. ఈ దేశంలో పెట్టుబడి దారులకు వత్తాసు పలికే మీడియా కూడా మోగుతున్న గంట గురించే పుంఖాను పుంఖాలుగా రాస్తుంది. దేశంలో స్పష్టమైన విభజన రేఖను పాలకులు సృష్టిస్తున్నారు. దానికి మతం రంగు పులిమి, భావోద్వేగాలను రెచ్చగొట్టడంతో మనం బట్టలు చించుకుని గంట దిక్కు పరిగెడుతున్నాం. నల్ల ధనం తెస్తానని రిజర్వ్ బ్యాంక్ను కొల్లగొట్టారు. బుల్లెట్ రైలును తెస్తానని రైల్వేలను అమ్మకానికి పెట్టారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలను లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త విద్యా విధానమని విద్యను లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా మత్తులో ఉంటే ఒంటి మీద చొక్కా కూడా మిగలదు... తస్మాత్ జాగ్రత్త!
- ఊరగొండ మల్లేశం