Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బంజారాహిల్స్ నుంచి బాగ్ లింగంపల్లి దాకా... అమీర్ పేట నుంచి హయత్ నగర్ దాకా ఆ బస్తీ ఈ బస్తీ అనే తేడా లేకుండా వాననీరు, వరదలతో ఏకమైపోతున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు జనం... భయంతో వణికిపోతున్నారు. వాహనదారుల తిప్పలు అన్నీ ఇన్నీ గావు. తెలంగాణ రాకముందు గులాబీ బాస్ కేసీఆర్... సమైక్య పాలనలో హైదరాబాద్ నగరంలోని నాలాలన్నీ కబ్జా అయ్యాయనీ.. దాంతో వరదనీరు పోయే వీల్లేక అసెంబ్లీ, గవర్నర్ బంగ్లాతో పాటు సీఎం క్యాంపు ఆఫీసు ముందు కూడా నీరు నిలిచిపోతున్నదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. సరే...తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మరి ఈ ఆరున్నరేండ్ల నుంచి అదే వానలు.. హైదరాబాద్లో అదే వరదలు. పరిస్థితి ఏం మారలేదు... గీ ముచ్చట కాసింత సేపు పక్కనబెడితే... నిన్న గాక మొన్న ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో... పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...గత ఆరున్నరేండ్ల కాలంలో హైదరాబాద్ అభివద్ధి కోసం రూ. 67 వేల కోట్లు ఖర్చు పెట్టామంటూ నొక్కి వక్కాణించారు. మరి అంత డబ్బు ఖర్చు బెడితే... ఈ వరదలు గిట్లెందుకు వస్తున్నరు... కార్లు.. బైకులు నీళ్లల్లో ఎందుకు తేల్తున్నరు... ఈ విషయం సమజ్గాక హైదరాబాద్ జనాలు తెగ ఇదై పోతున్రు... ''అందరు శాఖాహారులే అయితే రొయ్యల బుట్ట ఎట్ట మాయమైందో అన్నట్టుంది'' పరిస్థితి....
- బి.వి.యన్.పద్మరాజు