Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాష నేర్చుకోవడానికి అనుసరించాల్సిన నాలుగు ప్రధానమైన అంశాలు వినడం, మాట్లా డడం, చదవడం, రాయడం. వీటిని ఒక క్రమ పద్ధతిలో బోధించడం ద్వారా భాషలో నైపుణ్యాన్ని పెంచవచ్చు. చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినడం ద్వారా వాటిని అవాగాహన చేసుకొని స్వంత మాటలలో వ్యక్తపరచడానికి బాటలు పడతాయి. అదే విధంగా సరైన ఉచ్ఛారణతో చదివి అర్థం చేసుకొన్న విషయాన్ని తప్పులు లేకుండా రాయడం అలవాటు అవుతుంది. అలాగే మిగతా విషయాలైన గణితం, పరిసరాల విజ్ఞానాలను నేర్చుకోవడం అనేది కూడా భాషతో ముడిపడి ఉంది. చదివి అర్థం చేసుకొని వ్యక్తపరిచే సామర్థ్యం భాషలో పెంపొందినప్పుడే మిగిలిన విజ్ఞాన, సామాజిక శాస్త్రాలు, గణితం లాంటివి అభ్యసించడం సాధ్యమవుతుంది. అందుకే పిల్లలు సులభంగా అర్థం చేసుకోగలిగే వ్యావహారిక భాషయైన తెలుగు భాషలోనే బోధన సాగాలని గిడుగు రామ్మూర్తి పంతులు అహర్నిశలు కృషి చేశారు. అంతే కాకుండా విద్యలో సంస్కరణలకు సంబంధించి నియమించబడిన పలు కమిషన్లు కూడా ప్రాథమిక తరగతులలో మాతృభాషలో బోధన సాగాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానము (చీజుూ-2020)లో కూడా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాతృభాషలోనే బోధన జరగాలనే అంశాన్ని చేర్చడం ఆహ్వానించదగ్గ విషయమై నప్పటికి, తప్పనిసరి కాదని మెలికపెట్టడం పాలకుల ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నది. లాకౌడౌన్ కాలంలో ఫీజులు వసూలు చేయకూడదని, ఆన్లైన్ క్లాసులు నిర్వహించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికి, హైకోర్టు హెచ్చరించినప్పటికి పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పెడచెవిన పెట్టడం చూస్తుంటే ప్రభుత్వాలకు వాటి పై ఏ మాత్రం నియంత్రణ లేదనే విషయం స్పష్టమవు తుంది. ఇటువంటి సందర్భంలో తప్పనిసరి కాని మాతృభాషలో బోధన అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని, ఇది ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలకు మేలు చేసేదిగా ఉందని విద్యావేత్తలు, మేధావులు పెదవి విరుస్తున్నారు. దీనిని పునఃపరిశీలించి మాతృభాషలో బోధనను ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రపంచంలోని సుమారు 6600 భాషల్లో తెలుగు ఒకటి. నేడు టి.వి. సీరియళ్లలో, సినిమాలలో ఆంగ్ల భాషా పదాలను చొప్పించడం వల్ల చాలావరకు తెలుగు పదాలు కనుమరుగవుతున్న స్థితి ఏర్పడు తున్నది. ఆంగ్ల మాధ్యమం మోజులో తల్లిదండ్రులు కూడా చిన్నప్పటినుండే ఇంగ్లీష్ పదాలను నేర్పించడంలోనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల పిల్లలు బాల్యం నుండే మాతృభాషను చిన్నచూపు చూడడం, ఆసక్తి కనబరచకపోవడం లాంటి వింత ధోరణులకు దారి తీస్తుంది. ప్రయివేట్ పాఠశాలల్లో ఆంగ్లంలోనే మాట్లాడాలనే నిబంధనను కఠినంగా అమలు చేయడం పిల్లలు ఆత్మన్యూనతకు లోనై అభ్యసనలో వెనుకబాటుతనానికి కారణమవుతుంది. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు రెంటికి చెడ్డ రేవడిలా అటు ఆంగ్ల భాషలో ఇటు తెలుగు భాషలో ప్రావీణ్యాన్ని సాధించలేక పోతున్నారు. ఇదిలాగే కొనసాగితే మేము తెలుగువాళ్ళం అని చెప్పుకోవడం తప్ప తెలుగు భాష మిగిలి ఉండదేమో! అనిపిస్తుంది. పరభాష మోజులో మాతృభాషను చిన్నచూపు చూడడం వయస్సు మీరిన అమ్మను వద్ధాశ్రమానికి తరలించడమంత అమానవీయ చర్య అని గుర్తెరిగి తెలుగు భాష పరిరక్షణకు నడుం కట్టాలి.
అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రస్తుత సర్కారు తెలుగు భాషా పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడతామంటూ చేసిన వాగ్ధానాలన్ని బుట్టదాఖలు కావడం విచారకరం. వాడుక భాషలో అభ్యసన కొనసాగడం ద్వారానే పిల్లల్లో సృజన పురులు విప్పుకుంటుందని, యువతలో నైపుణ్యం పెరిగి దేశాభివృద్ధికి మూలస్తంభాలై నిలుస్తారని గుర్తెరిగి పాలకులు మాతృభాషలో బోధనను తప్పనిసరి చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలు, న్యాయస్థానాల తీర్పులు మొదలగునవి తెలుగులోనే వెలువడే విధంగా చర్యలు చేపట్టాలి. నిరాదరణకు గురవుతున్న తెలుగు భాషను ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించి కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అప్పుడే తెలుగు జాతి ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుంది.
- గుండు కరుణాకర్
సెల్:9866899046