Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశీయ బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో పాటుగా బొగ్గు దిగుమతులు కూడా తగ్గడం వలన బొగ్గు కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వము పురమాయింపు చర్యలను చేపట్టింది. అందుకే సింగరేణి యాజమాన్యం కూడా వీడియో కాన్ఫరెన్స్లతో అధికారులపై ఒత్తిడి చేస్తున్నది. రోజుకు లక్షా 30 వేల టన్నుల బొగ్గు నుంచి లక్షా 80వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయడానికి కసరత్తు చేస్తోంది. కాని ముందస్తుగా కరోనా వైరస్ సంక్రమించకుండా చర్యలు తీసుకోవడానికి శ్రద్ధ చూపలేదు. ''ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్'' (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోలేదు. మాస్క్లు, గ్లోవ్స్, శానిటైజర్స్ లాంటి సౌకర్యాలను కల్పించాలని చేసిన ఆందోళనలపై నిస్సహాయంగా వ్యవహరించినారు.సింగరేణి సంస్థాగతంగా నడుపుచున్న హాస్పటల్లలో, డిస్పెన్సరీలలో కనీసం పారా మెడికల్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) ఇవ్వలేదు. కరోనా టెస్ట్లు చేయాలని, వైద్య చికిత్సకై ఐసోలేషన్ వార్డ్లు ఏర్పాటు చేయాలని కొన్ని గనులపై విధులను బహష్కరించినా స్పందించ లేదు. సింగరేణిలో కరోనా వైరస్ నియంత్రణకు కనీస చర్యలు తీసుకోని యాజమాన్యం ముఖ్య మంత్రి సహాయ నిధికి 2020 మే 6న రూ.40కోట్లను ఇవ్వడం జరిగింది. కార్మిక సంఘాలు చేసిన ఆందోళనలను, ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను కూడా బుట్ట దాఖలు చేసింది.
సింగరేణిలో జరుగుచున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ఆకాంక్షలకు, చట్టాల అమలుకు సింగరేణిలో ఆదరణ కరువైంది. అధికార పార్టీ అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పటికి కూడా సంస్థాగతంగా లోపాలు జరుగడం ఎక్కువైంది. త్రైమాసికంగా జరుగ వలసిన ''సేఫ్టీ త్రైపార్టీయేట్, జేసీసీ(జాయింట్ కన్సల్ టెంట్ కమిటీ), నిర్మాణాత్మక సమావేశాలు యేడాదికి ఒకటి జరుగుతున్నాయి. సంచాలకుల, జనరల్ మేనేజర్ల నియామకాల్లో రాజకీయ జోక్యం పెరిగింది. దానితో మెజారిటీ అధికారులు అధికార పార్టీకి విశ్వాసంగా మెలగటం ఎక్కువైంది. 1628లో సాధించుకున్న ''పిటీషన్ ఆఫ్ రైట్'' హక్కుకు కనీస ఆదరణను కూడా ఇవ్వడం లేదు. అధికారపార్టీ యేతర కార్మిక సంఘాల విజ్ఞాపన పత్రాలను తీసుకోవడానికి, అలాగే సమస్యలను వినడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ''సాప్ట్ వేర్'' సంస్థలు దాదాపుగా వర్క్ ప్రమ్ హౌంకు, విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాస్లకు, యితర సంస్థలు కూడా తమ ఉద్యోగులకు విధులను నిర్వర్తించడానికి అనేక వెసులుబాట్లను కల్పిస్తున్నారు. కాని సింగరేణిలో కొత్త వెసులుబాటును కల్పించకపోగా ఉన్న వెసులుబాటుకు ఎసరుపెట్టి ఆందోళనలకు గురిచేస్తున్నారు. అడవులలో ఉంటూ, భూమిపొరల్లో వందల మీటర్లలోతులో డ్రిల్లింగ్ వేసి బొగ్గు నిల్వలను కనుగొనే కార్మికులు బ్యాచ్ల వారీగా వారానికి మూడు రోజులు 16గంటల చొప్పున 48గంటలు విధులు నిర్వహించి మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటున్న వెసులుబాటును కూడా అధికారులు నిరాకరించగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. అలాగే ఓపెన్ కాస్ట్ మైన్స్లలోని క్యాంటీన్లలో భౌతిక దూరం పాటించి భోజనం చేయడం సాధ్యం కానందున'' ''కంటిన్యూ వర్క్ విత్ అవుట్ లంచ్''తో ఇంటికిపోవు వెసులుబాటును కూడా నిరాకరించారు. రానున్న కాలంలో బొగ్గు వినియోగం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు సమద్ధిగా కురియడం వలన వ్యవసాయంలో గత యేడాది కంటే ఇప్పుడే 2,802 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. జల విద్యుత్ ఉత్పత్తి పెరిగినపపటికీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కుంటుపడకుండా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సిమెంటు, ఇనుము, ఉక్కు యితర అనేక పారిశ్రామిక అవసరాలకు కూడా బొగ్గు వినియోగం పెరుగుతుంది. బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపిన లెక్కల ప్రకారంగా 2018-2019 ఆర్థిక సంవత్సరంలో రూ.1,71,000 కోట్లు విలువ గల బొగ్గును దిగుమతి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం సింగరేణిలో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 17 వరకు 17 రకాల నాణ్యత గల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. యాజమాన్యం ప్రకటించిన టన్ను బొగ్గు ధర గరిష్టంగా గ్రేడ్-1కు రూ.4,910, కనిష్టంగా గ్రేడ్ -17కు టన్ను బొగ్గు ధర రూ.650కి అమ్మకాలు జరుగుచున్నాయి. విదేశీ దిగుమతి బొగ్గు టన్ను ధర భారత్ కరెన్సీ ప్రకారంగా విదేశీ టన్ను ధర రూ.5,475 నుంచి 5,744 ఉన్నది. ఇంకా రవాణా, దిగుమతి సుంకాలతో కలిపి టన్ను బొగ్గును దిగుమతి చేసుకుంటే స్వదేశీ బొగ్గు ధర కంటే విదేశీ బొగ్గు ధర 200శాతం ఉండే అవకాశం ఉంటుంది. అందుగురించి కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ మైనింగ్ ప్రాతిపదికన బొగ్గు గనులను ప్రయివేటు వాళ్లకు ఇచ్చి స్వదేశీ బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు వేలం నిర్వహించగా కార్మిక సంఘాలు దేశ వ్యాప్త బొగ్గు గనుల్లో సమ్మె పోరాటాలతో వ్యతిరేకించాయి. ప్రభుత్వమే బొగ్గు సంస్థలకు బడ్జెట్ సపోర్ట్ కల్పించి కొత్త అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల తవ్వకాలను వేగిరం చేసి బొగ్గు ఉత్పత్తితో పాటుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలని డిమాండ్ చేశాయి. పర్యావరణ వేత్తలు కూడా భూగర్భ బొగ్గు గనుల తవ్వకాల వలన పర్యావరణ, జీవావరణ పరిరక్షణ కొనసాగుతుందని సూచిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా ఉద్యమ సమయంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ల తవ్వకాలను వ్యతిరేకించినాడు. స్వరాష్ట్రంలో అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల తవ్వకాలను కొనసాగించి సింగరేణిని ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొంగు బంగారం చేస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా భరోసా సభలో 6 భూగర్భ బొగ్గు గనులను తవ్వకాలను వేగిరం చేసి బొగ్గు ఉత్పత్తిని, ఉపాధి అవకాశాలను పెంచుతామని హామీ ఇచ్చారు. కాని మూడేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు మొక్కుబడిగా మందమర్రి డివిజన్లో కాశిపేటు2 భూగర్భ బొగ్గుగనిని మాత్రమే తవ్వినారు.
కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి సమీక్ష అనంతరం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి చర్యలు వేగిరమైనవి. బొగ్గు డిమాండ్ పెరుగుతోందని కార్మికులపై ఒత్తిడి పెంచుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్లతో, సుడిగాలి పర్యటనలతో సంచాలకులు హడావిడి చేస్తున్నారు. కాని కోవిడ్ కలవరం వలన ఇంకా కార్మికుల హాజరు 55శాతంకు మించడం లేదు. అలాగే యాజమాన్యం అవలంబిస్తున్న వైయుక్తిక నిర్ణయాల వలన కూడా కార్మికుల హాజరు శాతం పెరగడం లేదని, బొగ్గు ఉత్పత్తి కుంటుపడుతుందన్న భావనలు కూడా ఉన్నాయి. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవ డానికి సమాలోచనలతో వ్యవహరించి సూచనలతో, సహాయ సహకారాలతో సంస్థాగత విధానాలతో ముందుకు పోతే ఫలితాలు వస్తాయని కార్మిక సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. అలాగే రక్షణ, పర్యవేక్షణ పనులను ప్రతి షిఫ్ట్లో మెరుగుపరచి, శ్రమైక జీవన సంస్కతితో సంస్థాగతముగా ముందుకుపోతే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుందని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి.
- మెరుగు రాజయ్య
సెల్:9441440791