Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు మెరుగైన పాలన సౌకర్యం కోసం అని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రజలకు మేలు చేసే సులభమైన పాలనను అందించే చట్టాలను ఆహ్వానించ వలసిందే. ఆరుగాలం కష్టం చేసి ప్రజలందరికీ అన్నం పెట్టే రైతుల అందరి పక్షాన తీసుకువచ్చే మెరుగైన ఏ చట్టమైనా హర్షించదగినది ఆహ్వానించదగినది. కానీ ఇది రైతుల పక్షం అవునో కాదో తెలియదు గానీ రెవెన్యూ సిబ్బంది పక్షం మాత్రం కాదని తేలిపోయింది. ప్రభుత్వం రైతుల సంక్షేమం పేరుతో ప్రవేశపెట్టే నూతన రెవెన్యూ చట్టంతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల తొలగింపు బిల్లును కూడా ప్రవేశపెట్టింది. అయితే అవినీతి పేరుతో మొత్తం పోస్టులని రద్దు చేయడం అనేది అందరూ వ్యతిరేకించాల్సిన విషయం. సమాజం మొత్తంలోనె ప్రభుత్వ పాలనలో అవినీతి వేళ్లూనుకుని పోయింది. అటెండర్ స్థాయి నుంచి మొదలు కలెక్టర్ స్థాయి అధికారుల వరకూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడటం నిత్యం పత్రికలలో చదువుతూనే ఉన్నాం. మరి ఇట్లా అవినీతిలో కూరుకుపోయారని అన్ని పోస్టులను రద్దు చేయలేం కదా! అవినీతిని నిరోధించాల్సింది పోయి మొత్తం పోస్టులే రద్ధు చేయడం వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉంది. కాలికి పుండు అయితే పుండుకు మందు రాస్తాము తప్ప కాలిని కొట్టి వేయలేం కదా! చెట్ల ఆకులకి కొమ్మలకి పురుగు పడితే పురుగుని చంపేస్తాము తప్ప వేర్లని పీకి పారేయలేం కదా? అట్లాగే వ్యవస్థలు అవినీతి మయమైతే దాన్ని నిరోధించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల అవినీతి మాటున మొత్తం పోస్టుల రద్దుకే ఎందుకు పోయింది? అవినీతి అధికారులను తొలగిస్తే సంతోషించాల్సిందే. బాధల్లా... మొత్తం పోస్టులనే రద్దు చేయడం. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడింది నీళ్లు నిధులు నియామకాల నినాదంతో. కానీ నీళ్లు నిధులతో పాటు నియామకాల్లోనూ ఆశించిన ఫలితాలు లేవు. ఎంతో మంది నిరుద్యోగులు నిరాశ నిస్పహలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మొత్తం గ్రామ రెవెన్యూ అధికారుల పోస్ట్ ని రద్దు చేయడం అంటే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లే. వీఆర్వో పోస్టుల రద్దుతో ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలను సష్టించడం ఏమోకానీ ఉన్న ఉద్యోగాలను కుదించడానికి సిద్ధ పడిందని తేటతెల్లమవు తున్నది. అసెంబ్లీలో ముఖ్యమంత్రిగారు ప్రస్తుతం ఉన్న వీఆర్వో వీఆర్ఏలకు ఎటువంటి అభద్రతా భావన అవసరం లేదనీ, వివిధ శాఖలలో అవసరాలను బట్టి సర్దుబాటు చేయడం జరుగుతుందని చెప్పారు. దీనితో చాలామంది ముఖ్యమంత్రి నిర్ణయం సరైనదని భావిస్తున్నారు. సమస్య అది కాదు. వీఆర్వో పోస్టుల రద్దు వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఎట్లా అంటే ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది వీఆర్వోలు ఉన్నారు అనుకుంటే వారిలో ప్రతి ఏడాది సుమారు ఒక 500 మంది వీఆర్వోలు పదవీ విరమణ తీసుకున్నారు అనుకుందాం... అంటే ఆ మరుసటి ఏడాది ఐదు వందల ఉద్యోగాలు నిరుద్యోగులకు అందుబాటులో ఉంటాయి. ఇలా ప్రతి సంవత్సరం పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించడం జరుగుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మరి ఇప్పుడు మొత్తం పోస్టులనే రద్దు చేయడం వల్ల ఇకముందు ఆ ఉద్యోగాలు అనేవి ఉండవు. ఆ ఉద్యోగాలే లేనప్పుడు వాటి నియామకాలు కూడా ఉండవు. అంటే నిరుద్యోగులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలను దూరం చేసినట్టే కదా? ఇంకో రకమైన నష్టం కూడా ఉంది. అదేమిటంటే ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వీఆర్వోలని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులలో సర్దుబాటు చేయడం అంటే ఆయా శాఖలలో ఖాళీలుగా ఉండి తక్షణం నియామకాలు చేయాల్సిన పోస్టులు కూడా ఇక లేనట్లే కదా? ప్రపంచీకరణలో భాగంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్న తరుణంలో నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు కుదింపు అనేది అత్యంత నిరసించ దగిన విషయం. మరి రిజిస్ట్రార్ పోస్టులను కూడా రద్దు చేస్తారా? చేయరు కదా. కాబట్టి అవినీతి పేరుతో మొత్తం పోస్టులు రద్దు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను దూరం చేయడం కాకుండా ఆ అవినీతిని నిర్మూలించడానికి అవసరమైన కఠినమైన చర్యలను చట్టాలను ప్రభుత్వం తీసుకు రావాలి. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు రైతులకు మెరుగైన సేవలను పారదర్శకంగా గ్రామాల్లోనే అందేలా చూడాలి. చిందరవందరగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి సమగ్ర భూ రికార్డులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవాలి. అపరిష్కృతంగా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన భూ సంబంధ అర్జీలను, రెవెన్యూ రికార్డులను పరిష్కరించి సవరించడానికి ప్రత్యేక అంతర్గత వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో రెవెన్యూ భూములను కొలత చేయడానికి అవసరమైన నైపుణ్యం ఉన్న ప్రభుత్వ సర్వేయర్లు సరిపడా అందుబాటులో లేకపోవడం వల్ల కూడా భూ కొలతలలో, రికార్డులలో అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ సర్వేయర్లను నియమించి ప్రభుత్వమే ప్రతి రైతు భూమిని సమగ్రంగా సర్వే చేయించి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించి పటిష్టమైన రికార్డులు తయారు చేయాలి. అంతేకానీ అవినీతి పేరుతో మొత్తం పోస్టులు రద్దు చేసి భవిష్యత్తులో నిరుద్యోగులకు అవకాశాలను దూరం చేయడం సబబు కాదు. అవినీతి అధికారులను తొలగించి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టుల రద్దును వెనక్కి తీసుకుని అవినీతి అధికారుల పట్ల కఠినంగా ఉంటూనే ప్రభుత్వరంగ వ్యవస్థలో నూతన ఉద్యోగాల కల్పన చేస్తూ నిరుద్యోగ యువతకు భరోసా ఇవ్వాలి. అవినీతి నెపంతో నేడు గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు రద్దు చేసిన ప్రభుత్వం ఇదే వంకతో మరిన్ని శాఖలలో ఉద్యోగాలను రద్దు చేసే అవకాశముంది. కాబట్టి పోస్టులను రద్దు చేయడం కాకుండా అవినీతి అధికారులను తొలగించి అవినీతికి తావులేని మెరుగైన పారదర్శకమైన పాలన అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం.
- వి. దిలీప్
సెల్:8464030808