Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వదేశీ.. స్వదేశీ.. స్వదేశీ... కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలతోపాటు ఆ పార్టీకి చెందిన నేతలందరూ పొద్దున లేస్తే జపించే మంత్రం ఇదే. ఈ నినాదం ఎత్తుకున్నందుకు వారిని నిజంగా అభినందించాల్సిందే. దీని ప్రకారం... దేశంలోని సహజ వనరులను వినియోగించి పెద్ద ఎత్తున పరిశ్రమలను స్థాపించి, తద్వారా కోట్లాది మంది యువతీ యువకులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కల్పించాలి. కానీ ఇదే ఆ నినాదంలోని పరమార్థమని నమ్మితే మనం చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకున్నట్టే. ఒకప్పుడు దేశానికే వన్నె తెచ్చిన మహారాజా (ఎయిరిండియా) ను, చిన్న మొత్తాల పొదుపు... అభివృద్ధికి మదుపంటూ హితోపదేశం చేసిన ఎల్ఐసీని అమ్మకానికి పెట్టింది బీజేపీ సర్కార్. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వేను, ఆర్థిక సంక్షోభంలోనూ దేశాన్ని గట్టెక్కించిన ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటోళ్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది కమలం పార్టీ. తాజాగా రెక్కాడితేగానీ డొక్కాడని రైతుల నడ్డి విరిచేందుకు... నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఇలా స్వదేశీ, విదేశీ కంపెనీలకు దేశాన్ని తాకట్టు పెడుతుంటే.. ఇంకెక్కడ 'స్వదేశీ...' అంటూ వాపోతున్నారు ఆర్థిక వేత్తలు, మేధావులు. ఇలాంటి విధానాలపై మన గులాబీ బాస్ కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో విరుచుకుపడ్డారు. 'బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైళ్లు, విమానాలు అయిపోయినరు.. ఇగిప్పుడు కరెంటు మీద పడ్డరు...' అంటూ ఆయన కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. సీన్ కట్ చేస్తే... రాష్ట్రంలో ప్రయివేటు యూనివర్సిటీలకు అవకాశ మివ్వొద్దంటూ ఇప్పుడు అన్ని చోట్లా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. వాటికి అనుమతులు ఇచ్చేందుకు వీలుగా శాసనసభ ఏకంగా తీర్మానమే చేసింది. మరోవైపు తెలంగాణ, ఏపీ మధ్య లాక్డౌన్ ఎత్తేశాక కూడా ఆర్టీసీ బస్సులు తిరగటంలేదు. ప్రయివేటు ట్రావెల్స్కు లబ్ది చేకూర్చేందుకే టీఆర్ఎస్ సర్కార్... ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి మోకాలడ్డుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తిరుమలరావు కమిటీ... తన నివేదికను సమర్పించి ఏడాది దాటినా దానిపై కేసీఆర్ సర్కార్ నోరు మెదపటం లేదు. పరోక్షంగా ఇది ప్రయివేటు, కార్పొరేట్కు లబ్ది చేకూరు స్తున్నది. ఈ క్రమంలో ప్రయివేటీకరణకు సంబంధించి కేంద్రంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న కేసీఆర్ సారు.. రాష్ట్రంలో అదే 'ప్రయివేటు'కు తలుపు లెందుకు బార్లా తెరుస్తున్నారనేది... ఇప్పుడు భేతాళ ప్రశ్నగా మిగిలింది. అందుకే జనులారా... పారాహుషార్...
- బి.వి.యన్.పద్మరాజు