Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగనాయకమ్మతో గోవిందరాజు చక్రధర్ ముఖాముఖి
ప్రశ్న: మీ డెయిలీ రొటీన్ ఎలా ఉంటుంది? రోజూ రాతకు ఎన్ని గంటలు కేటాయిస్తారు? ఈ రోజే, ఈ పూటే అది పూర్తి చేయాలి లేదా, ఈ గడువు లోపు ఈ రచన పూర్తి కావాలనే టార్గెట్స్ ఉంటాయా?
జవాబు: రాయడంలో 'డైలీ రొటీన్' అనేది, రోజూ ఒక్క లాగే ఉండదు. 'రోజుకి ఇన్ని గంటలు' అనే కొలత ఎప్పుడూ లేదండీ. రాయడం ప్రారంభించిన మొదట్లో గానీ, తర్వాత గానీ, ఇప్పుడు గానీ, ''ఈ పూటే ఇది పూర్తవ్వాలి'' అనేది, ఎప్పుడూ లేదు. రాయడం ఎప్పుడూ విసుగనిపించదు. ఒక రోజు ఎక్కువ కాలం, ఒక రోజు తక్కువ కాలం. అంతే గానీ, గంటల లెక్కలేదు. నా రాత పని ఉదయం మొదలైతే రాత్రి పడుకునే దాకా ఉంటుంది. ఒక్కో రోజు 8గంటలో, 10గంటలో. ఈ గంటల లెక్కని మీకు చెప్పడానికే గానీ, ఈ లెక్క ఎప్పుడూ పెట్టుకోలేదు. 'కాపిటల్ పరిచయం' రాసే రోజుల్లో కూడా పగటి విశ్రాంతి తప్పేది కాదు.
ప్ర: సాధారణంగా రోజుకు ఎన్ని పేజీలు రాస్తారు? గతంలో ఎన్ని పేజీలు రాసేవారు ఇప్పుడు ఎన్ని రాస్తున్నారు?
జ: రోజుకి ఇన్ని పేజీలు - అని ఇదో లెక్కా? ఒక రోజు ఎక్కువే ఒక రోజు తక్కువే కావచ్చు. ఆసక్తి ఉన్న విషయం మీదే మొదలు పెడతాను కదా? అది సాగాలంటే, రోజుకి ఎంత అయితే అంత. 'పేజీల' లెక్క ఎప్పుడూ లేదు.
ప్ర: మీ రచనా ప్రణాళిక ఎలా ఉంటుంది? ఒక నవల రాయటం మొదలు పెడితే, అది పూర్తయే వరకూ, మరింకే దాని పైనా దృష్టి పెట్టరా?
జ: ఒక పని జరుగుతోంటే, దాన్ని కొంతసేపు ఆపి, రెండో పని మొదలు పెట్టడమా? అలా ఎప్పుడూ జరగలేదు. పాఠకుల ఉత్తరాలు ఏవైనా వచ్చి ఉంటే, వాటికి జవాబులు అవసరమైతే, అవి మాత్రమే జరగాలి. 'బోరింగులో పిల్లలు పడ్డారు' లాంటి ఘోర వార్త కనపడితే, వెంటనే దాని మీద విమర్శ రాయడం ముఖ్యం అవుతుంది. ఈ ఘోరాల్ని పట్టించుకోకుండా మన పని ముఖ్యమా?
ప్ర: ఫలానా పెన్తో, ఫలానా క్వాలిటీ పేపర్పై, రాయటం వంటి అలవాట్లు, ముచ్చట్లు, ఉన్నాయా? ఒక చోట కూచునే రాస్తారా? ఫలానా చోటే కూచోవాలన్న పట్టింపులు ఉండవా?
జ: నలుపు ఇంకే ఇష్టం నాకు. ఇప్పటికీ నల్ల ఇంకు పెన్నే. 'రచన' అనేది మొదలైన నాటినుంచీ, చాలా కాలం 'విషవృక్షం' వరకు కూడా నోట్బుక్సు మీద రాయడమే. అది బొత్తిగా బుద్ధిలేని పని. ఎక్కడ దిద్దాలన్నా, ఒక పేజీ మార్చాలన్నా వీలవదు. అప్పుడా ఆలోచన ఉండేది కాదు. అదే పుస్తకం రీప్రింటు కోసం వచ్చినప్పుడైతే శ్రద్ధ గానే చూసేదాన్ని. తర్వాత కాలం నుంచీ, విడికాయితాల మీదే మొదలు. మొదట్లో టేబుల్దగ్గిరే కూర్చుని రాసేదాన్ని. దాన్ని త్వరగానే వదిలేశాను. వాలు కుర్చీలో కూర్చుని, కాయితాల్ని ఒళ్ళో అట్టమీద పెట్టుకుని రాయడమే నాకు ఎక్కువ సదుపాయం. ఇప్పుడు రాయడానికి ఎప్పుడూ ఒకే స్థలం. బెడ్రూమ్లోనే, మంచాల దగ్గిరే, కుర్చీలోనే. దాదాపు 45ఏండ్ల నుంచీ ఈ పద్ధతే. ఇది మారలేదు. మారదు. ఇదేదో 'నమ్మకం' కాదు. నాకిదే సౌకర్యం. కాయితాలు సరైనవి లేకపోతే, రాత త్వరగా జరగదు. ఇప్పుడు రాసే కాయితాలన్నీ సరైనవే. వాటి వెనక భాగాలు అంతకు ముందు ఇతర రాతల కోసం ఒక వేవు వాడేసి ఉన్నవే. వాటిని జాగ్రత్త చేస్తాం. ఆ కాయితాలకి రెండో పక్క ఖాళీగానే ఉంటుంది కదా? రాసిన దాన్ని కంపోజ్ చేయడం కోసం ఆ కాయితాలే వెళ్తాయి. కొత్త రాతకి పాత కాయితాలు చాలు.
ప్ర: 'రైటర్స్ బ్లాక్' అంటారు గదా? ఒక్కో సారి ఎంత గింజుకున్నా, ఆలోచనలు అసలు ముందుకు సాగవు. అక్షరమ్ముక్క రాయలేరు. మీకు అలాంటి అనుభవాలున్నాయా?
జ: 'రైటర్స్బ్లాక్' అనే మాటని మీ ప్రశ్నలో చూసేదాకా నేను వినలేదు. అసలు ఒక విషయం మీద రాయాలని అనిపిస్తే, దాన్ని గురించి ఆలోచనలు ఉంటేనే రాయడం మొదలు పెడతాను. ఇతర రచయితల అలవాట్ల గురించి నా కేమీ తెలీదు. నేను ప్రారంభించింది ఏదైనా, అది పూర్తి అయ్యేదాకా ఎక్కడా ఇబ్బంది ఉండదు. కాకపోతే, రాసినదాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తాను. మార్పులు తప్పకుండా అవసరం అవుతాయి.
ప్ర: మీకు మూడ్స్ ఉంటాయా? రచయిత గానూ, వ్యక్తిగత జీవితంలోనూ, మీపై ఒత్తిళ్ళు, టెన్షన్లు, రచనలపై ప్రభావం చూపుతాయా?
జ: 'మూడ్స్' అనే మాట విన్నాను గానీ, ఆ మాటని నేను ఎప్పుడూ వాడలేదు. ఆ మాట ఎవరితో అంటాను? అసలు, మొదటి సంసారంలో చికాకులే నన్ను రాతలవేవు మళ్ళించాయి. వ్యక్తిగత జీవిత విషయాల్లో, ఇబ్బందులూ విచారాలూ, లక్ష వున్న కాలాలు ఒకప్పుడు ఉండేవి. కానీ, అప్పుడైనా రాతకీ, ఆ విచారాలకీ సంబంధం ఉండేది కాదు. విచారాలతో రాత ఆగేది కాదు. దాదాపు 50ఏండ్ల నుంచీ అయితే, వ్యక్తిగత విచారాలూ, ఇబ్బందులూ, విసుగులూ, ఏమీ లేవు. నా దృష్టి రాత మీదే. రాతలో ఉండే విషయాల మీదే. ఇప్పుడే కాదు, అప్పుడైనా అలాగే.
ప్ర: ఒక రచన పూర్తి చేశాక కలిగే ఆనందాలూ, అనుభూతులూ ఎలా ఉంటాయి? రిలీవ్డ్గా ఫీలవుతారా?
జ: రాస్తూ ఉన్నది ముగిసి పోతే, సంతోషమే. చేసే పని, జరిగే పని, ఏ పని ముగిసినా, అంతే కదా? వంట ముగిసినా సంతోషమే, నవల ముగిసినా సంతోషమే. 'దీని భారం వదిలింది బాబూ' అని కాదు. ఆసక్తిగా ఉన్న దాన్నే మొదలు పెడతాను కాబట్టి, రాయడం, నాకు భారంగా ఉండదు. అవసరమైన ఏ పనీ భారం అవదు కదా?
ప్ర: 'బలిపీఠం' రోజులకూ, ఇప్పటికీ, మీ ఆలోచనల్లో, దృక్పథాల్లో, రచనా రీతుల్లో, శైలిలో వచ్చిన మార్పులేమిటి?
జ: 'బలిపీఠం'లో కథ 'కుల భేదాల్ని' విమర్శిస్తూ 'కింది కులాల' మీద ప్రేమతో ఉంటుంది. కానీ, అది 'సంస్కరణ వాదం' దృష్టితో మాత్రమే ఉంది. అప్పటికి నాకు 'సమానత్వానికి' కారణాన్నీ, మార్గాన్నీ చూపే మార్క్సిజం తెలియదు. అది తెలిసిన వాళ్ళకి, భావాలన్నీ తప్పకుండా మారతాయి. మారకపోతే, తార్కిక భావాలూ, న్యాయమైన భావాలూ తెలిసినట్టు కాదు. రచనా శైలిలో మార్పు - అంటారా? 'రామాయణ విషవృక్షం' రాసినప్పటి నుంచి, నా రాత ధోరణి మారుతున్నట్టూ, తేలికగా రాయగలుగుతున్నట్టూ నాకు అనిపించింది. ఈ మాట నా పుస్తకాల్లో ఎక్కడో చెప్పుకున్నాను కూడా.
ప్ర: మీ రచనల ప్రభావం ఆ రోజుల్లో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది?
జ: రచనల్లో ఏ భావాలు ఉంటాయో, వాటి వల్ల పాఠకుల ప్రభావాల్లో మార్పులు కొంత వరకూ అలాగే జరగొచ్చు. అప్పటి నా పుస్తకాల్లో 'నాస్తికత్వం' స్పష్టంగా లేదనుకుంటా. 'మార్క్సిజం' అసలే లేదు. ఇప్పటి రచనల ప్రభావం - గురించి అడిగారు. చెప్పాను కదా? రచనల్లో ఏం ఉందో, ఆ ప్రభావం కొంతైనా చదివిన వారిలో ఉండి ఉండొచ్చు. నాకు పాఠకులతో ఎప్పుడూ పరిచయాలు ఉంటాయి. 'మార్క్సు'ని చదివితే, పాఠకుల పాత భావాలు మారిపోవాలి - అనగలనా? పాఠకుల జీవితాల్లో, రకరకాల పునాదులు ఉంటాయి. ఆ వ్యక్తుల్లో మార్పులు, తక్కువ ఎక్కువ స్థాయిల్లోనే ఉంటాయి. ఒక వ్యక్తి ఒక మంచి పుస్తకం చదివి, పాత తప్పుడు భావాల్ని పూర్తిగా వదిలించుకోవచ్చు. కానీ, అందరిలో మార్పులూ అలా ఉండవు. వ్యక్తులు వ్యక్తిగతంగా అయితే పూర్తిగా తెలుసుకోలేరు. 'సమిష్టిగా'నే చర్చించుకోవాలి. అందుకే 'సంఘాల' అవసరం. సంఘాల్లో సమిష్టిగా కలుస్తారు. ఒకరి సమస్యలు ఒకరికి తెలుస్తాయి. వాటిని అందరూ చర్చిస్తారు. చర్చల ప్రభావం సహజంగా ఉంటుంది. చర్చలు జరగడమే అన్నిటి కన్నా ముఖ్యం.
ప్ర: నిన్నటి - నేటి మేధావులపై మీ అంచనా?
జ: ఏ మేధావులూ నాకు తెలియరు. 'చర్చ' ప్రకారం చెప్పమంటే, 'నాస్తికత్వం' ఉంటే నా దృష్టిలో అది మేధావితనమే ఆ నాడు. దానితో కలిసి ఉన్న 'శతృ వర్గ భేదాల' సంగతి తెలుసుకుంటే అది ఈ నాటి మేధావి తనం.
ప్ర: విషవృక్షం మొదటి భాగానికి ముఖచిత్రం కోసం ఓ ప్రముఖ చిత్రకారుడు బొమ్మ వెయ్యడానికి నిరాకరించాడని మీరు ఎక్కడో రాశారు. ఆయన రామభక్తుడనీ, ఆ భక్తుడు మీ పనిని తిరస్కరిస్తాడనీ మీరెందుకు అనుకోలేదు?
జ: నిజమే, నేను అలా అనుకోలేదు. అది నా తెలివి తక్కువ తనమే. డబ్బు తీసుకుని బొమ్మలు వేసి పెట్టే చిత్రకారుడు, తన వృత్తి కోసం అలా చేస్తాడనే అనుకున్నాను. అంతకన్నా ఆలోచన రాలేదు. డబ్బు వెనక్కి పంపించేసి 'బొమ్మ వెయ్యను' అంటే సరి పోయేది. డిమాండ్ డ్రాఫ్ట్ని వెనక్కి పంపుతూ దాని వెనక 'రామ రామ' అని రాయాలా? 'విషవృక్షం' మీద కక్ష అలా ఉంటుందని ఊహించలేదు. చిత్రకారుడు 'త్రిగుణ్' మాత్రం భక్తుడు కాడా? విషవృక్షానికి అందం తెచ్చాడు తన బొమ్మలతో.
ప్ర: 'విషవృక్షం' రాసినప్పుడు గానీ, 'మహాభారతం' మీదా, 'వేదాల' మీదా రాసినప్పుడు గానీ మీకు బెదిరింపులు ఏవైనా వచ్చాయా?
జ: బెదిరింపులు అస్సలు లేవు. 'విషవృక్షం', 2004లో ఇంగ్లీషులో వచ్చినప్పుడు, 'ఆజ్తక్' అనే హిందీ టీవీ చానల్లో ఆ వార్త రోజంతా వచ్చిందట. ఆ వార్తని చూసి గుజరాత్లో అప్పుడు ఒక చోట నా పేరుతో దిష్టి బొమ్మని తగలేసినట్టు పేపర్లలో చూశాం. లోక్సభలో నర్సాపురం బీజేపీ ఎం.పీ కృష్ణంరాజు, అప్పటి బీజేపీ ప్రభుత్వంలో హౌంశాఖ సహాయ మంత్రిగా ఉన్న చెన్నమనేని విద్యాసాగరరావుని 'ఆ పుస్తకం మీద ('విషవృక్షం' మీద) ఏమైనా చర్యలు తీసుకున్నారా?' అని అడిగితే, 'రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చాక ఆలోచిస్తాం' అని మంత్రి జవాబు ఇచ్చినట్టు ''హిందుస్థాన్ టైమ్స్' పత్రికలో వార్త! ఇవే తెలుసు.
ప్ర: విషవృక్షం రాయడం వల్ల మీ కంటి చూపు దెబ్బ తిన్నదని అప్పట్లో ఒక ప్రచారం జరిగింది. ఆ సంగతి?
జ: నా కంటి చూపు పుట్టికలోనే దెబ్బతిని ఉంది. మా అమ్మకి 7గురు పిల్లలు పుడితే, ముగ్గురికి షార్ట్ సైటులే. అందులో నేను ఒక దాన్ని. నా షార్ట్ సైటు మైనస్ 14. ఇంకో ఇద్దరికీ అలాగే. ఇది, 'విషవృక్షం' వల్ల కాదు. కండ్లకు బాధ అదీ ఏమీ ఉండదు. కళ్ళ జోడు చాలు. కానీ మా పల్లెటూళ్ళో మా చిన్న తనాల్లో అవేమీ లేవు. 'విషవృక్షం' వల్లే నా కండ్లకి అలా జరిగి ఉంటే 'రాముడనే దేవుడు' ఉన్నాడని తెలిసేది.
ప్ర: మీరు సాహిత్య సమావేశాలకు వెళ్ళరు. సన్మానాలూ అవీ ఇష్టపడరు. అవార్డులంటే వ్యతిరేకత ఎందుకు?
జ: అవన్నీ సమానత్వానికీ, హేతువాదానికీ విరుద్ధాలు. 'జ్యోతి వెలిగింపులు' లాంటివి చేస్తే గానీ సభ మొదలు పెట్టరు. సభకి వచ్చే సగం జనం స్టేజి మీదే ఉంటారు. జనాభాలో మెజారిటీ మందికి చదువులే లేవు. మన గొప్పల గురించి, మనం చెప్పుకోవడమా? ఇతరులకు లేనిది, మనకు ఉంటేనే అది గొప్ప! అది ఎంత అన్యాయం! 'అవార్డు' లంటే డబ్బండీ. 'శ్రమ' పడితేనే 'డబ్బు' తీసుకోవాలి. శ్రమ లేకుండా డబ్బు తీసుకోవచ్చా? సన్మానాలా? గుర్రాల మీదా, ఏనుగుల మీదా, పల్లకీల్లోనూ ఎక్కి ఊరేగే రాజుల కాలం తగ్గింది. అయినా సన్మానాలు తగ్గడం లేదు. అవన్నీ ఎవరికైనా టైమ్ దండగ పనులు.
(మిగతా వచ్చేవారం)
- గోవిందరాజు చక్రధర్