Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం 2021 ఫిబ్రవరి నెల వరకు ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. గతంలో లాగే ఈసారి కూడా మేయర్ పదవికి పరోక్ష ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. స్థానిక ప్రభుత్వాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యమే మంచిది.150 డివిజన్లలో 76 డివిజన్లు గెలిచినవారు మేయర్ అవుతారు అన్న గ్యారెంటీ కూడాలేదు. జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు మేయర్ను ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఇస్తే ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన కార్పొరేటర్ల పాత్ర నామమాత్రమే అవుతుంది. ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఉంటున్నారు. బొటాబొటి మెజారిటీ వచ్చిన సందర్భాలలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎంపీలు ఫిరాయించినట్టుగానే కార్పొరేటర్లు కూడా పార్టీలు ఫిరాయించి ప్రజల ఆకాంక్షలకు గండి కొడుతున్నారు. పరోక్ష ఎన్నికల వల్ల క్యాంపు రాజకీయాలు, డబ్బు, బేర సారాలు పెరిగిపోతాయి. రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలకు ప్రత్యక్ష ఎన్నికలు కొత్తకావు. 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్కి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, సమితి అధ్యక్షులు మొదలుకొని జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు కార్పొరేషన్ల మేయర్ పదవుల వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో మరొక రెండు సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న డివిజన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, 2020 జనవరి 1 నాటికి సవరించిన ఓటరు జాబితాను జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఉపయోగిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కానీ ఇది సరైనది కాదు. ఈ విషయంపై ఎవరైనా కోర్టుకు వెళితే జీహెచ్ఎంసీ ఎన్నికలకు బ్రేకులు పడే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ సమగ్రంగా ఆలోచించి ముందుకు వెళ్లాలి.
2015లో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఏర్పాటుచేసిన డివిజన్ల ప్రకారమే ప్రస్తుత ఎన్నికలు కూడా జరుగుతాయని తెలుస్తున్నది. ప్రస్తుతం వున్న డివిజన్ల డీలిమిటేషన్ కాకుండా ఎన్నికలు జరిపితే రెండు సమస్యలు వస్తాయి. మొదటిది డివిజన్లలోని ఓటర్ల సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో తేడా ఉంది. ఉదాహరణకు గతంలో ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) ఉన్నప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో వంద డివిజన్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 2009లో ఎంసీహెచ్ చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలు కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అప్పుడు కొత్తగా డివిజన్ల విభజన అవసరమైంది. కానీ పాత ఎంసిహెచ్ పరిధిలోని 100 డివిజన్లు అలాగే ఉంచి అప్పుడు జీహెచ్ఎంసీలో కలిసిన 12 మున్సిపాలిటీల పరిధిలో మరొక 50 డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేసి మొత్తం 150 డివిజన్లు ఏర్పాటు చేశారు. 2010, 2015లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అప్పటి డీలిమిటేషన్ ప్రకారమే జరుగుతున్నాయి. ఓటర్ల సంఖ్య మధ్య అప్పటినుండే పెద్దఎత్తున తేడాలున్నాయి. ఈ పదేండ్లలో ఈ తేడాలు మరింత పెరిగాయి. ఉదాహరణకు పాత హైదరాబాద్ నగరంలో సుమారు 50కిపైగా డివిజన్లు ఉన్నాయి. అక్కడ 30వేలలోపు ఓటర్లకు కొన్ని డివిజన్ ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్ శివార్లలో ఉన్న శేర్లింగంపల్లి, పటాన్ చెరువు, కూకట్పల్లి ఇలాంటి ప్రాంతాలలో లక్ష పైచిలుకు ఓటర్లు ఉన్న డివిజన్లు కూడా ఉన్నాయి. ఎన్నికయ్యే కార్పొరేటర్ల మధ్య ఓటర్ల సంఖ్యలో సమతుల్యత ఉండాలి కానీ ఇది జరగడం లేదు. కనుక ఇప్పటికైనా మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లను మళ్లీ డీలిమిటేషన్ చేయాలి. ఓటర్ల సంఖ్య మధ్య పదిశాతం కంటే ఎక్కువ తేడా ఉండకుండా చూడాలి. 2015 కంటే ముందు ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించింది. కానీ అప్పటికే విడిపోయిన తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య కంటే ఆ కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పాలకవర్గ సమావేశాలు జరగడం వాటిని ఏర్పాటు చేయడానికి ఫంక్షన్ హాల్స్ కూడా సరిపోవని ఆ ప్రతిపాదనను మానుకున్నారు. అదే కాక అసలు కంటే కొసరు ఎక్కువ అని కార్పొరేటర్ల సంఖ్యకు సరిసమానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు లోక్సభ సభ్యులు మరికొందరు హైదరాబాద్కు చెందిన రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ అధికారులు కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి మరొక 150మంది అవుతున్నారు. వీళ్లంతా కలిస్తే మూడు వందల పైనే అవుతారు. అందుకే అప్పుడు కార్పొరేటర్ల సంఖ్య 150కి మించి పెంచలేదు. ఇప్పుడు కూడా ఆ సమస్య వస్తుంది కాబట్టి ఉన్న 150 డివిజన్ల ఓటర్ల సంఖ్యలో సమతుల్యత వచ్చేలా డీలిమిటేషన్ చేయాలి.
ఇక రెండవ సమస్య ఇప్పటికే జాతీయ ఎన్నికల కమిషన్ ప్రతీ సారీ చేసినట్లుగానే ఓటర్ల సమ్మరీ రివిజన్ ను ప్రారంభించింది. జనవరి ఒకటి 2021 నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా ఓటు హక్కు లభిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలా కొత్తగా ఓటు హక్కు పొందడానికి మరొక మూడు నాలుగు లక్షల మంది అర్హులు అవుతారు. ఒకవేళ పాత ఓటర్ లిస్ట్ ప్రకారం జరిగితే కొత్త యువ ఓటర్లకు అన్యాయం జరుగుతుంది. రేపటి ఎన్నికలలో వారు ఓటు వేసే అవకాశం కోల్పోతారు. కాబట్టి 2021 జనవరి 15 కల్లా కొత్త ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసి ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం డివిజన్ల విభజన, ఓటర్ లిస్ట్లో చేర్పులు మార్పులత్నోకలు జరిగితే బాగుంటుంది.ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరపాలి.
- బండారు రామ్మోహనరావు
సెల్:866074027