Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనవరి 2004లో బొంబాయిలో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరంలో పాల్గొన్న ఇరాన్కి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత షిరిన్ ఎబాది అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరపాలని మొదటిసారిగా ప్రతిపాదించారు. ఆమె ఆలోచనను 2007 జనవరిలో ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సత్యాగ్రహంపై సదస్సు తీర్మానం ద్వారా గాంధీజీ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా పాటించేలా చేయాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. అదే సంవత్సరం జూన్లో జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినంగా ఆమోదించింది.
ప్రపంచ ప్రఖ్యాత కవి లియోటాల్స్టారు భారతదేశ స్వాతంత్య్రానికి మద్దతునిస్తూ తారక్నాథ్ దాస్కు 1908లో రాసిన ఉత్తరంలో ప్రస్తావించిన అహింసాయుత పోరాటమార్గం గాంధీజీపై గొప్ప ప్రభావాన్ని కలిగించింది. గాంధీజీ ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి భారత స్వాతంత్రోద్యమాన్ని నడిపించాడు. అయితే ఆ స్వాతంత్రోద్యమ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని మన దేశ పురోగతిని పరిశీలించిన వారందరికీ అర్థమవుతుంది.
స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం కాదు. ఆకలితో అలమటించే కోట్లాది ప్రజల ఆర్థిక స్వాతంత్య్రం. ప్రాథమిక హక్కులు అయిన వాక్, పత్రిక, సమావేశ స్వేచ్ఛలతోపాటు కుల, మత, లింగ భేదాల కతీతంగా చట్టం ముందు ప్రతి ఒక్కరికీ సమానత్వం, అన్ని మతాల యెడల రాజ్య తటస్థత, సార్వజనీన వయోజన ఓటు హక్కు, ఉచిత నిర్బంధ విద్య, గిట్టుబాటు కాని భూకమతాలకు పన్ను మినహాయింపు, రైతులకు వ్యవసాయ రుణాల వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి, కార్మికులకు పని గంటలు తగ్గుదల, ఆరోగ్యకర పని పరిస్థితులు, ముసలితనంలోనూ, అనారోగ్యంతోనూ, నిరుద్యోగంతోనూ ఉన్న వారికి ఆర్థిక భారం నుంచి రక్షణ, వెట్టి చాకిరీ నుంచి విముక్తి, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులతో పాటు పూర్తి రక్షణ, బాల కార్మికుల నియామకంపై నిషేధం, కార్మికులు యూనియన్లు పెట్టుకొనే హక్కు, ఒక పరిమితికి మించి ఉన్న వ్యవసాయ ఆదాయంపై క్రమానుగత పన్ను, వారసత్వ ఆస్తులపై పన్ను, మిలటరీ వ్యయాన్ని సగానికి తగ్గించడం, కీలకమైన పరిశ్రమలు, ఖనిజ వనరులపై ప్రభుత్వాధిపత్యం మొదలైన లక్ష్యాలు ఆచరణలో నెరవేరినప్పుడే మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు సరైన విలువ ఉంటుంది.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోయి నప్పటికీ పై లక్ష్యాలను ఏ మేరకు మనం సాధించుకోగలిగామని ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. ముందుగా పౌరహక్కులు అయిన వాక్, పత్రిక స్వేచ్ఛ గురించి చెప్పుకుందాం. ఇటీవల 2019లో బ్రిటిష్ కాలంనాటి ఇండియన్ పీనల్ కోడ్ 124ఎ సెక్షన్ కింద దేశద్రోహ నేరాలు (సెడిషన్ చార్జెస్) మోపి అనేకమంది ప్రముఖ మేధావులను జైలుపాలు చేయడం జరిగింది. వీరందరూ తమ జీవిత కాలమంతా ప్రజల కోసం సేవ చేసిన వారే. అలాగే ఢిల్లీ మత ఘర్షణల సందర్భంగా మత సామరస్యం కోసం కృషిచేసిన లౌకికవాద నాయకులపై కూడా వివిధ రకాల కేసులు పెట్టారు. ఇక పత్రికా స్వేచ్ఛ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా పత్రికలు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అనుకూలంగా మారలేదు. పత్రికాధిపతులు ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరించి మనగలిగే పరిస్థితులు నేడు లేవు.
అంతకంటే దారుణమైన విషయం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం .అది బాహాటంగా భారత పౌరుల మానవ హక్కులను ప్రత్యేకించి మైనారిటీల హక్కులను కాలరాసే విధంగా ఉంది. ఇక మతాల యెడల తటస్థత అనే వైఖరికి ఇటీవలి ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చాయి. మత వేడుకలను ప్రభుత్వ కార్యక్రమాలుగానే నిర్వహించడం జరుగుతోంది. అలాగే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉన్నప్పటికీ ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బు తదితర ప్రలోభాల ద్వారా ఆ హక్కుని హరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఉచిత నిర్బంధ విద్యకు బదులు అన్ని స్థాయిల్లో విద్య ప్రయివేటుపరం గావించబడటంతో చదువుకునే హక్కు బదులు చదువుకొనే స్థోమతలేని కోట్లాది మంది బడుగు జీవుల పిల్లలు విద్యాలయా లకు దూరం చేయబడుతున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన విద్యావిధానం విద్యాహక్కు గురించి ప్రస్తావించకపోవడం ఆ ధోరణిని బలపరిచేదిగా ఉంది. ఇక అన్నదాతలైన రైతుల దుస్థితి చెప్పనలవి కాదు. నిరంతరం అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరుగుతూ గతిలేక వ్యవసాయాన్ని కొనసాగించే పరిస్థితి దేశంలో అనేక ప్రాంతాల్లో నెలకొని ఉంది. గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకాన్ని వమ్ము చేశాయి. బడా కార్పొరేట్ల చేతుల్లో చిక్కుకునేలా చేశాయి.
ఆ బిల్లులతో పాటు ఇటీవలే పార్లమెంటులో ఆమోదించిన కార్మిక కోడ్ బిల్లులు రోజువారి పని గంటలను 8 గంటల నుంచి 12గంటలకు పెంచడం, యాజమాన్యం ఇష్టం వచ్చిన విధంగా కార్మికులను తొలగించే స్వేచ్ఛను కల్పించడం, ఎంత తిరోగమన చర్యో మనందరం గమనించాలి. అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు ఏరక్షణ లేదు. ఇక వృద్ధాప్యంలో ఉన్న వారిని, వికలాంగులను పట్టించుకునే నాథుడే లేడు. నేటి కోవిడ్ సందర్భంలో అనారోగ్య పీడితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కునారిల్లుతున్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ నేటి దుస్థితికి అద్దం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఉపాధిలేని కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు దేశ నలుమూలలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల కోవిడ్ మహమ్మారి సందర్భంగా వారందరూ తమ స్వస్థలాలకు ఖాళీ కడుపులతో కాలినడకన ప్రయాణాలు సాగించడం స్వతంత్ర భారతావనిలో కనీవినీ ఎరుగని విషాద ఘట్టం.
బాల కార్మిక నిషేధ చట్టం ఉన్నప్పటికీ నేటికీ కోటి మందికి పైగా బాల కార్మికులు పనిచేస్తుండటం మన దేశానికే సిగ్గుచేటు. ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న బాలల్లో మూడోవంతు దాదాపు ఐదు కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారనే నగసత్యాన్ని తెలుసుకుంటే మన పాలకులు విదేశాలలో ఉపన్యాసాలిస్తూ ఎలా తలెత్తుకు తిరుగ గలుగుతున్నారు అనే భావన మనకు కలుగకమానదు. అంతేకాదు ప్రపంచంలో మూడో వంతు బాల్య వివాహాలు మన దేశంలోనే జరుగుతున్నాయనేది వాస్తవం.
ఇక మహిళల పరిస్థితిని పరిశీలిద్దాం. ప్రపంచలింగ సూచికలో భారతదేశం 112వ స్థానంలో ఉంది. మహిళలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. మనదేశంలో ప్రతి రోజూ ఎనిమిది మంది ఎస్సీ మహిళలపైన, ముగ్గురు ఎస్టీ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతి గంటకు 600మందికి పైగా మహిళలు అక్రమ రవాణా చేయబడుతున్నారు. మొత్తం ప్రపంచంలో సంభవించే బాలింత మరణాల్లో ఐదు మనదేశం లోని జరుగుతున్నాయి. నేటికీ గణనీయమైన సంఖ్యలో సాంఘిక దురాచారాలకు, గృహహింసకు గురి చేయబడుతున్న వారు మహిళలే. మద్యం మహమ్మారి కోరలకు బలవుతున్న వారు మహిళలే.
స్వాతంత్రానంతరం ప్రభుత్వం మిలటరీపైన పోలీసులపైన పెట్టే ఖర్చు ప్రజల సంక్షేమంపై పెట్టే ఖర్చుకంటే ఎంతో ఎక్కువ. ఇక కీలకరంగాల్లో పరిశ్రమలు, ముఖ్యమైన గనులు క్రమేణా ప్రయివేటుపరంగా వించబడుతున్నాయి. స్వాతంత్య్రానంతరం మన దేశం అభివృద్ధి చెందినప్పటికీ అన్నింటికంటే కొట్టొచ్చినట్లు కనపడేది రోజురోజుకీ పెరుగుతున్న ఆదాయ అంతరాలు. శతాబ్దం క్రితం మనదేశంలో ఒక శాతం ఉన్న ఉన్నత కుటుంబాల చేతుల్లో 13శాతం సంపద ఉంటే నేడు 42శాతం సంపద వారి చేతుల్లో పోగు పడింది. ప్రపంచంలోనే అత్యంత అంతరాల అగాధం మన దేశంలోనే ఉన్నదని మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది.
ఇదేనా మన స్వాతంత్ర సమరయోధులు కోరుకున్న స్వర్ణ భారతం? ఇదేనా గాంధీజీ కలలు కన్న రామరాజ్యం?
నేటి ఈ దుస్థితి నుంచి బయట పడటానికి భారత ప్రజానీకం మరో స్వాతంత్ర పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. గాంధీజీ చూపిన, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా అనుసరించిన అహింసామార్గంలో ప్రగతిశీల శక్తులు స్వాతంత్రోద్యమ లక్ష్యాల సాధనకు ప్రజా సమీకరణ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అదే అక్టోబరు 2న గాంధీజీకి మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి.
- డాక్టర్ పి. నారాయణ
సెల్: 9247385331