Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్లో కొద్దిరోజుల కింద ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల నేతలు ప్రదర్శనగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నరు. నేతలు ఎంత వేడుకున్నా ముందుకు వెళ్లనిచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో అక్కడే నిలబడిన నేతలు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. పోలీసోళ్లు పక్కకు వెళ్లిపోయి ఆందోళనకు వచ్చిన కొందరు నాయకులతో ముచ్చట్లల్లో పడిపోయారు. అవినీతి పేరు చెప్పి రెవెన్యూ వ్యవస్థలోని వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను రద్దుచేశారనే ప్రస్తావన వారి మధ్య వచ్చింది. వాళ్లనే కాదు ఈ మధ్య కాలంలో ఫీల్డు అసిస్టెంట్లు, స్వచ్ఛకార్మికులు, మిషన్ భగీరథ ఉద్యోగులను తొలగించారనే చర్చా నడిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్న విషయంపైనా మాట్లాడుతున్నారు. ఇంతలోనే ఓ పోలీసు జోక్యం చేసుకుంటూ 'మీరు పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు కొంతమేరకైనా అణగిమణిగి ఉంటాయి. మీ ఆందోళనలకు పరోక్షంగా మా సపోర్టు ఉంటుంది. కానీ, ప్రభుత్వం చెప్పినట్టు మేం పనిచేయాలి కదా? మీడియావాళ్లేమో నేతలకు నచ్చజెప్పినదీ, బుజ్జగించినదీ పట్టించుకోరు. అడ్డుకోబోయిన దాన్ని హైలెట్ చేసి పోలీసుల జులుం అని ముమ్ముల్ని చెడుగా చూపుతారు. కార్మికులంటే మాకేమైనా ద్వేషమా? మేమూ ఒకరు చెప్పినట్టు పనిచేసేటోళ్లమే కదా? మాకూ మనసుంటుంది కానీ దాన్ని లోపల అణచిపెట్టి డ్యూటీ చేస్తున్నాం...ఇయ్యాల కార్మికులకు జరుగుతున్న అన్యాయం రేపు మాకూ జరగొచ్చుకదా? అన్ని వ్యవస్థలనూ ప్రయివేటు పరం చేసుకుంట పోతున్నరు. రేపురేపు పోలీసోళ్లను కూడా ప్రయివేటు పరం చేస్తారేమో? మేము కూడా కార్మికుల లెక్కనే రోడ్డెక్కాల్సి వస్తుందేమో ఎవరికెరుక' అంటూ తన మనసులోని మాటలను వెళ్లగక్కాడు. అక్కడున్న కార్మిక నాయకుడొకరు అంతేగా..అంతేగా..అంటూ నవ్వులు పూయించాడు.
- ప్రశాంత్