Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ ప్రముఖులు, రాజ కీయ నాయకులు, క్రీడాకారులు, బడా పారిశ్రామిక వేత్తలు గ్రామాలను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో దత్తత తీసుకుంటారని మనకు తెలుసు. అదే విధంగా జంతువులను దత్తత తీసుకుని జంతు ప్రదర్శన శాలల నిర్వహణను బలోపేతం చేసే జంతు ప్రేమికులు కూడా ఎందరో ఉన్నారు. మరో విషయం భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు, కరోనా లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు తమకు తోచినంత విరాళం ప్రధాన మంత్రి లేదా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వటం సహజమే. ఇంకో రకం మనుషులు ప్రచారమే ధ్యేయంగా తాము ఏం చేసినా మొబైల్లో సెల్ఫీ దిగి పత్రికల్లో ప్రచురింపచేసుకోవటం గమనిస్తుంటాం.
కొంత మంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుని నిజంగా ఆ గ్రామ అభివృద్ధికి పని చేయటం ఒక ఎత్తైతే, కేవలం నలుగురి నోటిలో నానడం కోసమో లేదా ప్రచారం కోసం మాత్రమే దత్తత తీసుకుంటున్నట్టు ఒక ప్రకటన చేయటం, తర్వాత ఆ విషయాన్ని మరచిపోయినట్టు నటించటం కూడా జరుగుతున్నది. కొంత మంది నలుగురితో నారాయణ మాదిరి భూరి విరాళం ఇస్తున్నట్టు బాహాటంగా ప్రకటన చేసి, పిమ్మట పూర్తిగా ఎగ్గొట్టడం లేదా ప్రకటించిన దాని కంటే తక్కువ ఇవ్వటం కూడా చాలా సందర్భాల్లో చాలా సెలబ్రిటీల్లో చూస్తుంటాం. అబద్ధపు ప్రచారం చేసుకోవటం కొందరి బలహీనత కాగా కొంత మందికి తాము పది మందికి చేసిన మంచి పనిని ప్రసార మాధ్యమాల ద్వారా బహిర్గతం చేసుకోవటం ఏ కోశానా ఇష్టం ఉండక పోవచ్చు. సెలబ్రిటీలు తాము చేపట్టిన మంచి పనుల ద్వారానే జనంలోకి ఒక సందేశం శాశ్వతంగా పంపించిన వారవుతారు. కాబట్టి ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలంటే వారు చేసిన సహాయం ప్రచారం చేయటంలో తప్పు లేదు. ఒక విధంగా అది అవసరమే. ఎందుకంటే ఒక ప్రముఖుడు కోటి రూపాయలు వితరణ చేశాడంటే అది స్ఫూర్తిగా లేదా ఆదర్శంగా తీసుకొని మరి కొంత మంది లక్షల్లో లేదా వేలల్లో ఒక మంచి కార్యక్రమానికి విరాళం ఇచ్చే అవకాశం ఉంటుంది. వారు చేసే మంచి పని ఎవరికీ తెలియక పోవటం వలన వారితోనే బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. ఈ రెండు రకాల మనుషుల మంచీ చెడు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి వచ్చినప్పుడే సామాన్య ప్రజలకు ఎవరు దగుల్బాజీ, ఎవరు మంచి వ్యక్తి అనేది తెలుస్తుంది. దాత తాను చేపట్టిన, చేసిన కార్యక్రమాలు తన వికీపీడియా ద్వారా బహిర్గతం చేయాలి. సాంకేతికత మన దేశంలో అందరికీ అందుబాటులో లేదు కాబట్టి ప్రింట్ మీడియా, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే వార్తలు సామాన్య జనాలకి చేరే అవకాశం ఎక్కువ. అంత మాత్రాన పదే పదే డబ్బా కొట్టుకోవటం కూడా భావ్యం కాదు. అది ఒక అవలక్షణం అనిపించు కుంటుంది. చేసింది పిసరంత చెప్పుకునేది కొండంత అన్న చందాన ఉంటుంది.
మహేష్బాబు, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, చిరంజీవి, సుమన్, మురళీమోహన్, షారుఖ్ ఖాన్, వివేక్ ఒబెరాయ్, అమీర్ఖాన్, నానాపటేకర్, మరి కొంత మంది టాలీవుడ్, బాలీవుడ్ నటులు గ్రామాలను దత్తత తీసుకున్నట్టు మనకు తెలుసు. అయితే సంబంధిత ప్రభుత్వాలు లేదా అధికారులు తగిన సహాయ సహకారాలు, చేయూత అందించినప్పుడే వారి ఆశయాలు అమలు చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు దాతలకు ప్రోత్సాహం కలిపించి వారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజేయాలి. పాఠశాల నెలకొల్పాలన్నా, మరుగుదొడ్లు, కమ్యూనిటీహాలు, నీటి ట్యాంకు నిర్మించాలన్నా, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పరచాలన్నా, రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగు పరచాలన్నా, ఏ ఇతర అభివద్ధి కార్యక్రమానికైనా దాతలిచ్చే ధన సహాయం ఒకటే ముఖ్యం కాదు. నిపుణుల సేవలు, ప్రభుత్వ ఆలోచనలు, మద్దతు, దూరదష్టి, స్థానిక నాయకుల సహకారం, గ్రామస్తుల ఇష్టాఇష్టాలు కూడా గమనంలోకి తీసుకున్నప్పుడే గ్రామ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. గ్రూపు తగాదాలు, రాజకీయ పార్టీల మధ్య సయోధ్య లేక పోవటం దాతల కార్య క్రమాలను ముందుకు నడిపించలేవు. పైగా ఈ విధమైన ఒత్తిళ్లు దాతను అయోమయంలో పడేసి చేపట్టాలనుకునే పనిని మధ్యలోనే వదులుకునే పరిస్థితి రావచ్చు. దాతలు పౌరుల ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని ప్రాధాన్య క్రమంలో అమలు చేయాలి. విద్య, ఆరోగ్యం, నీరు, నీడ, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లు, జీవనవిధానం మెరుగు పరచడానికి కుటీర పరిశ్రమలు నెలకొల్పే విధంగా ఆసరా, ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఏర్పాటు లాంటి వాటిపై ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించాలి.
దత్తత తీసుకునే వారు ఇంకో రకం ఉంటారు. వారు జంతు ప్రేమికులు. క్రికెట్ క్రీడాకారులు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, ధోని, జహీర్ఖాన్ ఇంకా కొంత మంది జంతు ప్రదర్శనశాలలోని పులులను, సింహాలను, ఏనుగులను, జిరాఫీలను దత్తత తీసుకున్నట్టు విన్నాం. వారు ఇచ్చే ధన సహాయం జంతు ప్రదర్శనశాల నిర్వహణకు ఉపయోగ పడుతుంది. దానికి ప్రతిఫలంగా దాతలు ఉచిత ప్రవేశం లాంటి సౌకర్యాలు పొందుతారు. కొన్ని కంపెనీలు, బ్యాంకులు కూడా గ్రామాలను, జంతువులను దత్తత తీసుకోవటం ముదావహం. దాతలు దత్తతకు చేసే ఖర్చు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మినహాయింపు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు నలుగురికి మంచి చేయాలనే ఆలోచన నెరవేరటమే కాకుండా ఆదాయపు పన్ను మినహాయింపు దొరుకుతుంది. మన దేశంలో చాలా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులకు స్వంత భవనాలు లేవు, మౌలిక వసతులు లేవు. అద్దె భవనాల్లో వాటిని నడుపుతున్నారు. బాల బాలికలకు, ఆడ మగ రోగులకు సరియైన మూత్రశాలలు లేవు, తాగు నీటి సౌకర్యం లేదు, సరిపడా మందులు లభ్యం కావు, ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురు రోగులు సర్దుకోవలసిన పరిస్థితి, ప్రభుత్వాలు నిధులు కేటాయించవు, ప్రజా ప్రతినిధుల రాజకీయ క్రీడ, మీరు తప్పంటే కాదు మీరే తప్పనటం... ఈ విధంగా ఐదేళ్ల పుణ్యకాలం గడచిపోద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో సినిమా ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, బ్యాంకులు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల దత్తతకు మొదటి ప్రాధాన్యత నిచ్చి నేటి బాలలే రేపటి పౌరులు, ఆరోగ్యమే మహాభాగ్యం అవశ్యకతను గుర్తించాలి. దాతల ఆశయాలు సక్రమంగా ముందుకు నడిచే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించినప్పుడే గ్రామ అభివృద్ది పురోగమిస్తోంది
- టి. మురళీధర్
సెల్: 848545970