Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దశాబ్దాల తరబడి కోట్ల మందికి ఉచిత వైద్య సేవలందించిన ఉస్మానియా ఆస్పత్రి భవనం బహుశా త్వరలో కనుమురుగు కావచ్చు. వందేండ్ల చరిత్రకు తాళాలు పడనున్నాయి, చివరకు ప్రభుత్వ పంతం గెలవబోతోంది. ఒకసారి ఉస్మానియా చరిత్రలోకి వెళితే 1866లో సాలార్జంగ్-1 చేతుల మీదుగా అఫ్జల్గంజ్ ఆసుపత్రిగా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఉన్న భవనాలు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1908లో పనులు ప్రారంభించగా, 1919లో పూర్తయ్యాయి. దీన్ని భారతీయ - బ్రిటిష్ వాస్తు శైలిలో, భారతీయ, బ్రిటిష్ ఆర్కిటెక్ట్లు కలసి నిర్మించారు. విన్సెంట్ ఎస్క్ అనే బ్రిటిష్ ఇంజినీర్ ఈ ఉస్మానియా ఆసుపత్రితోపాటూ హైకోర్టు, సిటీ కాలేజ్, కాచిగూడ రైల్వే స్టేషన్, కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లు డిజైన్ చేశారు. మూసీ నదిని ఆనుకుని 26.5 ఎకరాల్లో ఈ ఆస్పత్రి నిర్మించారు. ఒక్క ఐపీ బ్లాకే 2.37 ఎకరాల్లో ఉందంటే ఆ ఆసుపత్రి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీ 1846లో అప్పటి ఐదవ నిజాం రాజు మీర్ తనియత్ అలీ ఖాన్ హయాంలో హైదరాబాద్ మెడికల్ స్కూల్గా ప్రారంభం అయింది. ఆ తరువాత 1919లో ఉస్మానియా మెడికల్ కాలేజీ అనే పేరు పెట్టారు. మలేరియా మందును కనుగొనడంలో పురోగతి హైదరాబాద్లోనే జరిగిందని తెలుసు. సర్ రోనాల్డ్ రాస్ పరిశోధనలకు అఫ్జల్గంజ్ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఎంతో సహకారం అందించాయి. ముఖ్యంగా మత్తు వైద్యంపై ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ప్రపంచంలోనే తొలి మహిళా మత్తు డాక్టర్ రూపాబాయి ఇక్కడే చదువుకున్నారు.
అప్పట్లో ముఖ్యమంత్రి, ఐఏఎస్లు అయినా వైద్యానికి ఇక్కడికే వచ్చేవారు. ఎప్పుడైతే 1985లో ప్రయివేటు మెడికల్ కాలేజీలు వచ్చాయో, అప్పటి నుంచీ ఉస్మానియా దుర్దశ మొదలైంది. అయితే ఇప్పటి వరకూ ఉస్మానియా ఆసుపత్రిని కూల్చవద్దనే అక్కడి డాక్టర్లు చెప్పేవారు. కానీ మొదటిసారిగా ఆ భవనాన్ని కూల్చేసి కొత్తది కట్టాలంటూ కొందరు ఆందోళన చేసారు. మరోవైపు అప్పట్లో ఉస్మానియా ఆస్పత్రిపై వేసిన కేసు హైకోర్టులో విచారణకు రానుంది.
2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఆస్పత్రి భవనాలు బాగుచేయడానికి 200కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. కానీ పనులు ముందుకు సాగలేదు. 2010 నవంబర్ 11న జీవో విడుదల అయింది. చారిత్రక కట్టడానికి రిపేర్లు చేసి, దాన్ని అలానే ఉంచి మిగిలిన భవనాలను మాత్రం కూలగొట్టి వాటి స్థానంలో కొత్తవి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల వ్యవధిలో 12 లక్షల ఎస్ఎఫ్టీలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. దానికోసం కన్సల్టెన్సీకి కూడా పనులు అప్పగించారు. ఆ తరువాత ఆ పనుల పర్యవేక్షణకు వైద్యులు, పూర్వ విద్యార్థులు.. ఇలా చాలా మందితో కమిటీలు కూడా వేశారు. కానీ అది ముందుకు సాగలేదు.
2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేసి ఆ స్థానంలో 24 అంతస్తులుండే రెండు భారీ భవనాలను నిర్మించాలని తలపెట్టింది. దానికోసం ఎమ్మెల్యేలతో పరిశీలనా బందాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది. అప్పట్లో కేసీఆర్ స్వయంగా ఉస్మానియా ఆస్సత్రిని సందర్శించారు. కానీ సచివాలయం నిర్మాణంలో చూపిన శ్రద్ధ ఉస్మానియా ఆస్పత్రి విషయంలో ఎందుకు చూపలేదన్న ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
ఉస్మానియా భవనాలు బాగుచేశాక ఎంత కాలం నిలిచి ఉంటాయో చూడాలంటూ అప్పట్లో ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసింది. బాగు చేసినా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండబోవని చెప్పింది జేఎన్టీయూ నిపుణుల బందం. దీంతో బాగుచేత బదులు కూల్చివేతకు మొగ్గు చూపింది తెలంగాణ ప్రభుత్వం. కానీ జేఎన్టీయూ నివేదికను తప్పు పట్టింది ఇంటాక్ (భారతదేశ చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కషి చేసే ట్రస్ట్). ఇంటాక్ తమ ఇంజినీర్లను ఢిల్లీ నుంచి పిలిపించి మూడు రోజులు అధ్యయనం చేసి ఈ భవనానికి ప్లాస్టరింగ్ స్టింగ్ పనులు చేస్తే చాలనీ, నిర్మాణం చెక్కుచెదరలేదనీ చెప్పింది. 2015, 2019లలో రెండుసార్లు ఈ బందం ఉస్మానియా బిల్డింగును సందర్శించింది.
భవనం బలంగా, భద్రంగా ఉంది. చాలా కాలం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే పైపైన దెబ్బతింది. ప్లాస్టరింగ్ పనులు చేస్తే చాలు. దీంట్లో అన్ని ఆధునిక సౌకర్యాలూ కల్పించవచ్చు. పక్కనే కొత్త భవనాలు కూడా కట్టవచ్చు. నిర్వహణ లోపాలూ, లీకేజీలు, మొక్కలు పెరగడం ఆపితే చాలు. అని నివేదిక ఇచ్చారు ఇంటాక్ ఇంజినీర్లు. అయితే ఇంటాక్ నివేదికతో విభేధిస్తున్నారు తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అధికారులు. అక్కడ కొత్త భవనాలు నిర్మాణం చేయలేం. పేరుకు కాగితాలపై 26.5 ఎకరాలు ఉన్నా, వాస్తవంగా అంత భూమి లేదు. ప్రధాన భవనం కింద నుంచే మురుగు కాలువ వెళుతోంది. చారిత్రక కట్టడాలకు వంద మీటర్ల దూరంలో ఏమీ కట్టకూడదనీ, కట్టినా అవి భుజం ఎత్తు దాటకూడదని ఇలా నిబంధనలున్నాయి. కనీసం ఆ భవనాన్ని బాగు చేయండీ డబ్బులు ఇస్తామన్నా, ఆగా ఖాన్ ట్రస్ట్, తెలంగాణ పురాతత్త్వ శాఖలు కూడా మేం చేయలేమని చెప్పేశాయి.
సాధారణంగా వందేళ్లు పైబడ్డ ఏ కట్టడమైనా పురాతన కట్టడంగా పరిగణిస్తారు. అందుకే ఈ భవనాన్ని కూల్చివేయవద్దని పురాతన కట్టడాలను పరిరక్షించే కార్యకర్తలు, ఉస్మానియాలో ఒకప్పుడు చదువుకున్న, వైద్యం చేసిన వారు అప్పట్లో డిమాండ్ చేశారు. వారు కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించారు. ప్రతిపక్షాలు కూడా అప్పట్లో ఈ భవనాల కూల్చివేతను నిరసించాయి. కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో వారితో చర్చించడమో, కోర్టులో పోరాడడమో చేయకుండా, మొత్తానికి ఆ ప్రతిపాదననే పక్కన పడేసింది తెలంగాణ ప్రభుత్వం.
కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర అధ్యక్షులు, ఇతర ప్రతిపక్షాల నేతలు ఆస్పత్రిని సందర్శించారు. మంత్రుల బందం కూడా వెళ్లింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పు పట్టాయి. మంత్రులు మాత్రం ప్రతిపక్షాల వల్లే మేం కొత్త భవనాలు కట్టలేకపోతున్నాం అన్నారు. మరోవైపు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఉస్మానియా విషయాన్ని టేకప్ చేసి ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికైనా రాజకీయాలకు స్వస్తిచెప్పి పేదల ఆరోగ్య ప్రదాయిని, చారిత్రక ఉస్మానియా ఆస్పత్రిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- జియాఉద్దీన్ ముహమ్మద్
సెల్ :9989236393