Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగనాయకమ్మతో గోవిందరాజు చక్రధర్ ముఖాముఖి
(గత సంచిక తరువాయి)
ప్ర: 1960 తర్వాత రంగనాయకమ్మ అప్డేట్ కాలేకపోయారన్న విమర్శలకు మీ సమాధానం? విమర్శకులు అనేదేమిటంటే, ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా రష్యా, చైనాల్లో మార్క్సిజం కనుమరుగైంది. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ - అనే విధానాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఆధునికానంతరవాదం, వినిర్మాణ వాదం, ఫెమినిజం - ఇలా ఎన్నో కొత్త ఆలోచనా రీతులు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. అయినా మీరు 'మార్క్సిజం' అనే చోటే ఆగిపోయారు - అని మీ గురించి విమర్శ. దీన్ని విన్నారా మీరు?
జ: వినపడే వాటిని వినకుండా ఎలా ఉంటాం? పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే విమర్శకులు, అలా గాక, ఇంకెలా అర్థం చేసుకోగలరు? మీరు చూపించిన ఆ రీతులన్నీ, పెట్టుబడిదారీ విధానంలో చిన్న చిన్న మార్పులే, మారిన రూపాలే గానీ అంత కన్నా ఏమీకావు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ, ఇలా ఎన్ని కరణలైనా చెప్పండి! ఇవి 'శ్రమ దోపిడీ' జరగడానికే కార్మికవర్గం నుంచి 'అదనపు విలువ'ని లాగడానికే, దాన్ని కౌళ్ళుగా, వడ్డీలుగా, లాభాలుగా, వర్తక కమిషన్లుగా - ఇంకా ఇవిగా, అవిగా అనేక పేర్లతో పంచుకుని, స్వంత శ్రమలు లేకుండా, విలాసాలతో కాలం గడపడానికి పుట్టుకొచ్చిన వాదాలే. వాటిలో ఏ ఒక్కటైనా బీదా - ధనికా తేడాలు ఎందుకు ఏర్పడుతున్నాయో, దానికి కారణాన్ని చెపుతుందా? ఆ బీదరికాన్నీ, నిరుద్యోగాన్నీ తీసివేసే మార్గం ఏమిటో చెపుతుందా? ఆ వాదాల్లో అసలు 'శ్రమ దోపిడీ అసమాన శ్రమ విభజనా' - అనే మాటలు ఉంటాయా? ఆ విధానాలు, సమానత్వానికి మార్గం చూపిస్తాయా? వందల వేల సంవత్సరాలుగా సాగుతూ ఉన్న 'శ్రమ దోపిడీ' గురించి మాట్లాడకుండా, ఆ కరణా, ఈ కరణా - అనేవి, 'శ్రమ దోపిడీ'ని తీసి వేసే శ్రామికవర్గ పోరాటాన్ని చెప్పిన మార్క్సిజం కంటే, ఆధునిక వాదాలు అవుతాయా? సమాజంలో జరగవలిసింది, వాదాల పేర్లని కొత్త కొత్తగా మార్చడం కాదు, పేదా - ధనికా తేడాలు పోవాలి. అది జరగాలంటే 'శ్రమ దోపిడీ' పోవాలి. ఆ మాట ఎత్తకుండా ఎంతెంత సూక్తులు మాట్లాడినా, అవన్నీ 'శ్రమ దోపిడీ'ని సమర్ధించే వాదాలే అవుతాయి. రష్యాలో, చైనాలో, మార్క్సిజం వల్ల మార్పులు జరగలేదేం? - అంటారా? అక్కడ శ్రామిక వర్గాల చైతన్య స్థాయిల్ని బట్టి కొంత జరిగినా, ఎక్కువ విషయాలు జరగ లేదు. కారణం ఆ దేశాల శ్రామిక వర్గాలకు తగినంత చైతన్యం ఇంకా రాలేదు. దానికి కారణం శ్రామిక వర్గాలకు నేర్పవలిసిన నాయకుల కృషిలోనే చూడాలి. 'వర్గాలు' గల సమాజంలో, శ్రామిక వర్గ పోరాటాలు సరియైన పద్ధతుల్లో జరగకుండా 'శ్రమ దోపిడీ' విధానం మారదు. అక్కడ అలా జరగ లేదంటే 'శ్రమ దోపిడీ'ని తీసి వేయాలని చెప్పిన మార్క్సు సిద్ధాంతం 'తప్పు సిద్ధాంతం' కాదని ఆ కార్మికులకు తెలియలేదని అర్ధం. మీరు చూపించిన కొత్త కొత్త 'కరణలు' 'శ్రమ దోపిడీ' నిర్మూలన గురించి ఏం చెపుతున్నాయో అది చెప్పండి!
మార్క్సు - ఎంగెల్సులు ఈ కాలంలో ఉంటే వాళ్ళని కూడా పెట్టుబడిదారీ సమర్థకులు. 'మార్క్సు, ఎంగెల్సులు ఇంకా అప్డేట్కాలేదు' అంటారు. మీరు చెప్పిన విధానాలన్నీ శ్రమ దోపిడీకి మారు రూపాలు మాత్రమే! అంతే!
ప్ర: మీరు నమ్మిన దాని కోసం, వ్యక్తులను దూరం చేసుకున్నారు. లేదా ఇతరులే విభేదించి మీకు దూరమయ్యారు. వ్యక్తిగతంగా ఎవరి విశ్వాసాలు వారివి, వాటితో నిమిత్తం లేకుండా స్నేహ సంబంధాలు కొనసాగించే వీలుంది గదా? ప్రిన్సిపుల్స్, ఐడియాలజీ విషయంలో మీ కెందుకంత మొండి పట్టు?
జ: ఈ ప్రశ్న ఆశ్చర్యం కలిగిస్తోంది నాకు. ''ఎవరి విశ్వాసాలు వారివి'' అనేదాన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణగా, భక్తినీ, నాస్తికత్వాన్నీ, తీసుకోవచ్చు. ఈ రెండు రకాల వారైన ఇరుగు, పొరుగులూ, పరిచయస్తులూ, ఎందుకు లేరు? చాలా మంది ఆ తేడాలతోనే ఉన్నారు. మీరు 'స్నేహ సంబంధాల' గురించి మాట్లాడారు. పైకి మాట్లాడేది ఒకటీ, దానినే రహస్యంగా దాచేది ఒకటీ అయితే, అటువంటి విషయాలు బైట పడితే ఆ స్నేహం నిలుస్తుందా? ఎవరి రహస్యం వాళ్ళు దాచుకుంటూ ఉంటే, అది 'స్నేహం' అవుతుందా? నిజాయితీ గల ప్రేమ గల స్నేహం కోసం ఆశించడం 'మొండి పట్టు' అవుతుందా? నిజాల్ని దాచేసి అబద్దాలతో కాలక్షేపాలు చేసేది 'స్నేహం' అవదండీ! అలాంటి స్నేహాలతో ఒకరి నించి ఒకరికి సంతోషమూ ఉండదు, నేర్చుకునేదీ ఉండదు. కొంచెం మంచి విషయాలు తెలిసి, వాటి ప్రకారమే జీవించడం, మొండి పట్టా? 'మొండి తనం' అనేది వ్యతిరేక అర్థాన్నే ఇస్తుంది కదా? మూర్ఖత్వాలు లేకుండా బతకాలనుకోవడం గట్టి పట్టేనండీ! అది 'మొండి పట్టు' అవదు.
ప్ర: ఎవరైనా పరిస్థితులతో రాజీ పడకుండా తమకు నచ్చినట్టు బతకడం, ఇప్పుడున్న ఒత్తిళ్ళ సమాజంలో సాధ్యమేనా?
జ: మంచీ చెడ్డా - రెండూ ఉండగా, చెడ్డదాని వేపు లొంగి పోతేనే 'రాజీ పడడం' అవుతుంది. కొన్ని సందర్భాల్లో 'దయ'తో రాజీ పడడం ఉండొచ్చు. అలాంటి 'దయ' విషయం కాదు, రాజీ అంటే ఇప్పుడు. 'పోషణ'కి గతిలేకపోతే, రాజీలు పడడం తప్పదు. అది నేరం కాదు. కానీ, పోషణ సమస్యే లేకపోతే, లక్షల, కోట్ల డబ్బు సంపాదన పిచ్చీ, పదవుల్లోకి పైపైకి ఎగబాకాలనే తాపత్రయాలూ, పెద్ద పేరు రావాలనే కీర్తి పిచ్చీ- వంటి దుష్టత్వాలతో రాజీలు పడకుండా జీవించడం కష్టమా? ఆ 'చెడ్డల' మీదే కోరికలు వుంటేనే, చాలా రాజీలు తప్పవు.
ప్ర: మీ రాజీలేని ప్రయాణంలో మీ సాఫల్య - వైఫల్యాలు ఏమిటి? రాజీ పడలేక కోల్పోయిందేమిటి? పొందిందేమిటి?
జ: 'మీ రాజీలేని ప్రయాణంలో' అన్నారు. మొదటి సంసారంలో రాజీలేని రోజుఎక్కడీ ఆ రోజులన్నీ బానిసత్వ రాజీలే. ఆనాడు అవి తప్పనిసరే. ఆ సంసారాన్ని వదిలితే పోషణ లేనితనం భయమే. నిజాయితీగా చెప్పుకుంటే, ఆ మొదటిది, నాకు అజ్ఞాన దశేనండీ. రాజీలతో బతకడంలో సాఫల్యాలెలా ఉంటాయి? అన్నీ వైఫల్యాలే గానీ? రాజీల మాటే లేకుండా సాగే సంసారంలో కోల్పోయేది ఉంటుందా? రాజీలులేని సంబంధాలలో, ఆత్మ గౌరవమే, మానసిక శాంతే, వుంటాయి. అవి డబ్బూ కాదు, కీర్తీ కాదు.
ప్ర: మీరూ, గాంధీ గారూ, కలిసి నడవటం మొదలు పెట్టాక, వ్యక్తిగతంగానూ, రచయిత్రిగానూ కలిగిన ప్రయోజనాలు, వెసులుబాట్లు, ఏమిటి?
జ: వ్యక్తి గత విషయం అంటే, ఇద్దరు స్త్రీ పురుషులు, ఒకే భావాలతో, పరస్పరం ఇష్టాలతో, ఎటువంటి వ్యతిరేక భావాలూ లేకుండా కలిసి జీవించేటప్పుడు, ఆ ఇద్దరిలో, ఎవరి వ్యక్తిగత జీవితం వారిది అవుతుందా? ఇద్దరికీ సంతోషమే, ఇద్దరికీ వ్యక్తిగతం అవదా? నా వ్యక్తిగతం ఇదీ, అతని వ్యక్తిగతం అదీ - అని చెప్పడానికేమీ లేదు.
అతని వల్ల, రచయిత్రిగా నాకు కలిగిన ప్రయోజనం - అంటారా? అతను పాఠకుడిగా పరిచయం కాకముందే, నేను కధలూ, నవలలూ, రాస్తున్నాను. కష్ణవేణీ, బలిపీఠం, స్వీట్ హౌమ్, అంధకారంలో - వంటి నవలలూ, కథలూ, అప్పటికే జరిగాయి. ఇద్దరికీ మార్క్సిజం తెలియడమే ఇద్దరికీ కలిగిన అద్భుత ప్రయోజనం. భావాలలో ఏ వ్యతిరేకతలూ లేకపోవడమే, అటువంటి జీవితం ఏర్పడడమే, నాకైనా, అతని కైనా వెసులుబాటు.
ప్ర: కలిసి నడవాలని మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు? మార్క్సిజమే మిమ్మల్ని కలిపి ఉంచిన బంధమా?
జ: కాదు. అప్పుడు 'మార్క్సిజం' అనే మాటలేదు. అతని ఉత్తరాలలో తరుచుగా 'సోషలిజం, విప్లవం' అనే మాటలు ఉండేవి. వాటికి అర్ధాలు రాయమంటే, అది జరిగేది కాదు. నిజానికి అతనికి అప్పుడు, ఆ రెండు మాటలూ తప్ప ఏమీ తెలీదు. ఆ వివరాలు తెలియక పోవడం వల్ల, నాకు ఆ 'సోషలిజం' మీద ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. కాకపోతే, కేవలం పాఠకుడిగా అతనితో జరిగే చర్చల్లో నడిచే విషయాలు, స్త్రీ పురుషుల సమానత్వం, కుటుంబ జీవితం, పిల్లల్ని ప్రేమగా పెంచడం, మంచి స్నేహం - వంటివి. ఇవి చలంలో పోజిటివ్ అంశాలు. మా పరిచయానికీ, అది పెరగడానికీ, మార్క్సిజం కారణం కాదు. అప్పటికి అది లేదు. 'కలిసి ఉంచిన బంధం' అయితే, మార్క్సిజమే. సమానత్వం గానీ, ప్రేమలూ స్నేహాలూ గానీ, ఏ సంస్కార భావాలైనా గానీ, మార్క్సిజం వల్ల సరిగా అర్థమై, స్థిర పడినవే.
ప్ర: మీ సంబంధాన్ని, మీ పెద్దలూ, అతని పెద్దలూ, అంగీకరించారా?
జ: అతనికి తల్లీ తండ్రీలేరు. తన అక్కలకి చెప్పుకున్నాడు. నాకు తండ్రి లేడు. తల్లికి చెప్పుకున్నాను. పెద్దలందరూ, ఆశ్చర్యాలతో అనేక ప్రశ్నలు అడిగారు గానీ, వ్యతిరేకించ లేదు. 'ఇది నిలుస్తుందా?' అన్నవే వాళ్ళ ప్రశ్నలు. 'మాకా నమ్మకం ఉంది. భవిష్యత్తు మీద కూడా నమ్మకం ఉంది!' అని మా వాళ్ళతో నా జవాబు. అతని వాళ్ళతో అతని జవాబు అయితే, 'నాకు సందేహం లేదు' అని! నిజమైన విషయం అయితే, నా తల్లికి గానీ, అతని అక్కలకు గానీ, మా అభిప్రాయం నచ్చకపోతే, ఏ విషయంలోనూ, వారి వ్యతిరేకత మా మీద పని చెయ్యదని వారికి తెలుసు. ఇరు పక్షాల వారూ, మాతో ఎప్పుడూ ఆప్యాయంగానే ఉన్నారు.
ప్ర: గాంధీగారి ప్రోద్భలంతోనే మీకు మార్క్సిస్టు సిద్దాంత అవగాహన, ఆచరణ, ఆ దిశగా అడుగులు పడ్డాయా?
జ: కాదు, గాంధీ ప్రోద్భలంతో కాదు. చెప్పాలంటే, నా ప్రోద్భలంతోనే ఇద్దరికీ మార్క్సిజం వేపు నడక ప్రారంభమైంది. అతనికి, 'సోషలిజం, విప్లవం' అనే మాటలు తప్ప, మొదట్లో అసలు 'కాపిటల్' అనే పుస్తకం పేరే లేదు. అప్పుడు అతను ఒక పార్టీ పనులు కూడా చేస్తూనే వున్నాడు. 'కాపిటల్' చదివితేనే 'శ్రమ దోపిడీ' సంగతీ, 'వర్గాల' సంగతీ, తెలుస్తుందనే అభిప్రాయాలు ఆ పార్టీ నాయకులకే లేవు. ఆ పార్టీ పనుల్లో ఇతను కూడా అలాగే ఉన్నాడు. కాకపోతే, 'సోషలిజం' అనే మాటల్ని మాత్రం వదలకుండా! నేను, అతని 'సోషలిజం'తో బాగా ఆశ పడి, అటువంటి పుస్తకాలు ఒకటో రెండో చదివాను. 'కాపిటల్' పుస్తకం మాట ఎక్కడో దొరక బుచ్చుకుని, దాని అనువాదం కోసం ప్రయత్నించమన్నాను. అది, అప్పటికి జరగనే లేదు కాబట్టి, అదీ దొరక లేదు. కానీ, 'కాపిటల్' ముట్టుకోకుండా రెండో పుస్తకం వొద్దు - అన్నాను. ఇక అప్పటి నించీ, మార్క్సు రాసిన 'కాపిటల్' చదవడం ప్రారంభించాం. ప్రతీ వాక్యానికీ అనువాదం రాయడం కాకుండా, నేను నోట్సు పద్ధతిగా రాసుకోవడం మొదలు పెట్టాను. 'సరుకులూ - డబ్బూ' అనే మొదటి చాప్టరులోనే దాదాపు చాలా భాగం అర్ధం అయింది. మొదట దాన్నే 'కాపిటల్ పరిచయం' పేరుతో మొదటి పుస్తకం రాశాను. మిగతా పుస్తకాన్ని చదవడం ఆపలేదు. నేను కథలూ అవీ రాయడం మానేశాను అప్పుడు. క్రమంగా, ఇద్దరికీ 'కాపిటల్'ని చదవడం మీద ఆసక్తి పెరిగి పోయింది. అదే చదవక పోతే, 'శ్రమ దోపిడీ' అనేదే తెలీదు, 'అదనపు విలువా' తెలీదు, శతృవర్గాలూ తెలీవు. 'కాపిటల్' చదివి, అర్ధం చేసుకోవడం ద్వారానే, మార్క్సు కనిపెట్టిందే, 'శాస్త్రీయ కమ్యూనిజం' అని అర్ధమైంది. 'కాపిటల్' చదవడం ద్వారా, 'శ్రమ దోపిడీ' సంగతి తెలుసుకోకపోతే, 'రామాయణ విషవృక్షం' జరిగేది కాదు, 'జానకి విముక్తి' ఉండేది కాదు. ఈ నాటికీ, అప్పుడప్పుడూ, ఒకటి రెండు నవలలూ, ఇతర వ్యాసాలూ, జరుగుతోన్నా 'మార్క్సిజం' పనులే, ఆ రాతలే, ఇంకా జరుగుతున్నాయి.
ప్ర: గాంధీగారితో పరిచయమే లేనట్లయితే, మీ ఆలోచనలు, నడక ఎలా ఉండేవి?
జ: దాన్ని ఎలా చెప్పాలి? 'ఇలా జరిగేది' అని చెప్పలేను. గాంధీతో జీవితం కన్నా ముందు నించే కథలూ, నవలలూ రాస్తున్నాను కదా? తర్వాత కూడా అలాంటివే జరుగుతూ ఉండేవేమో! గాంధీతో జీవితం లేకపోతే, 'కాపిటల్' విషయం అయితే, దాన్ని చదవడం జరిగేది కాదనే అనుకుంటాను నేను. అనువాదం వచ్చినప్పుడే చదివేదాన్నేమో. కానీ, 'అనువాదం' అనేది నేను చేసిన పరిచయం తర్వాతే కదా వచ్చింది! చెప్పలేను, ఏం జరిగేదో!
- గోవిందరాజు చక్రధర్