Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ నడుస్తోంది. రాత్రి ఏడయిందంటే సాలు... పోరలంతా టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతక్కపోయి గుడ్లప్పగించి చూస్తుండ్రు. ఒక్కోడు ఒక్కో జట్టుకు మద్దతిస్తూ ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు ఒకటే ఈలలు, కేరింతలు. వాస్తవానికి దేశవాళీ, సాంప్రదాయ క్రికెట్తో పోలిస్తే... ఐపీఎల్ అనేది ఫక్తు వ్యాపార లీగ్ అనేది అందరికీ తెలిసిందే. ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయటం దగ్గర్నుంచి.. టీవీల్లో వివిధ జట్ల తరఫున పలు బహుళ జాతి కంపెనీలు ప్రకటనలు గుప్పించటం దాకా అంతా డబ్బు, డబ్బు, డబ్బు. మొన్నీ మధ్య ఓ జట్టు తరఫున ఆడే ఆటగాడు వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నానంటూ ప్రకటించినప్పుడు... సంబంధిత జట్టు యాజమాన్యం... 'నువ్వు ఆడకపోతే వచ్చే ఏడాది కాంట్రాక్టుకు సంబంధించిన రూ.11 కోట్లను కూడా కోల్పోవాల్సి వస్తుంది...' అంటూ అతడికి హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఒక్క ఐపీఎల్ సీజన్లో కేవలం నెలన్నర రోజులపాటు ఆడితే ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లిస్తారన్నమాట. ఒకవేళ జట్టు కెప్టెన్ అయితే అతడికి చెల్లించే వేతనం అంతకు మించి ఉంటుంది. దీన్ని బట్టి ఒక్కో ఐపీఎల్ సీజన్ మీద ఇటు ఆటగాళ్లకు, అటు జట్టు యాజమాన్యాలకు, ప్రకటనకర్తలకు... వీటన్నింటినీ మించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొన్ని వందల కోట్లు పోగుపడతాయన్నమాట. కండ్లు మిరుమిట్లు గొలిపే ఈ ఐపీఎల్ ముచ్చట నుంచి కొంచెం మనం తేరుకుని సామాన్యుడి చెమట చుక్కను తేరిపారా చూస్తే... వారి చెమట చుక్కకే కాదు, రక్త మాంసాలకు కూడా నానాటికీ విలువలేకుండా పోతున్నది. పొద్దస్తమానం కష్టపడి పని చేసే వ్యవసాయ కూలీలు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, దినసరి కూలీలు, చిరు వ్యాపారులు... కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి దిక్కులు చూస్తున్నారు. దేశంలో కోట్లాది మంది అన్నమో... రామచంద్రా... అంటూ ఆవేదనగా అర్థిస్తున్నారు. కానీ మన పాలకులకు మాత్రం వారి గురించి పట్టించుకునే ఓపిక, కోరిక, తీరికా లేదు. ఉల్లిగడ్డ దగ్గర్నుంచి ఉతుక్కోవటానికి వాడే సబ్బు దాకా... వంట గ్యాస్ దగ్గర్నుంచి వండుకునే రైస్ దాకా అన్నింటి ధరలూ ఆకాశానికెక్కాయి. కోడిగుడ్డు రేటు కొండెక్కగా, చికెన్, మటన్ సామాన్యుడి జీవితం నుంచి దూరంగా జరిగిపోతున్నాయి. అయినా జిగేల్ మనే ఐపీఎల్పైన్నే దృష్టి సారించిన మన ప్రభుత్వ పెద్దలు...ఈ బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు) జీవులను పట్టించుకోవటమే మానేశారు... దటీజ్ అవర్ గ్రేట్ ఇండియా.
- బి.వి.యన్.పద్మరాజు