Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగరేణికి 131 యేండ్ల చరిత్ర ఉన్నది. తెలంగాణలో సింగరేణితో బంధుత్వంలేని ఊరు లేదు. అన్ని సామాజిక వర్గాలకు సింగరేణిలో కొలువులు చేసిన చరిత్ర ఉన్నది. బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన 1889లో 59,671 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. గడచిన 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 64.02(640లక్షల టన్నులు) మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఎదిగింది. సింగరేణి బొగ్గు 82శాతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, 9శాతం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, 5శాతం క్యాఫ్టీవ్ ఫవర్ స్టేషన్లకు, 4శాతం సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. థర్మల్ విద్యుత్ యూనిట్ ఉత్పత్తి కావడానికి 0.538 కిలో గ్రాముల బొగ్గును బాయిలర్లో దహనం చేయాలి. అట్లా ఒక మెగావాట్ థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి 53,800కిలో గ్రాముల బొగ్గును మండించి ఆవిరి ఒత్తిడి ద్వారా టర్బైన్ జనరేటర్ను తిప్పి విద్యుత్ను ఉత్పత్తి చేయాలి. తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్), స్టేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గు సరఫరా అవుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పన్నులను వసూలు చేసుకునే సంస్థగా సింగరేణి కంపెనీని ఉపయోగించుకుంటున్నారు. రాయల్టీ, వ్యాట్, కాంట్రాక్టు, జీఎస్టీ, సర్వీస్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ టాక్స్, స్వచ్ఛ భారత్ సెస్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, డివిడెండ్ మొదలగు పన్నుల రూపకంగా 2014-2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-2019 ఆర్థిక సంవత్సరం నాటికి 27,467.70 కోట్లు ఖజానాలో జమచేసుకున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.13,105.22 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.14,362.48 కోట్లు వసూలు చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం 2015 మార్గదర్శకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్ 10న ''డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్''ను ఏర్పాటు చేసింది. కోల్ బెల్ట్ జిల్లాలైన కొంరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలకు 2020 ఆగస్ట్ నాటికి రూ.2,262్న85 కోట్లు సింగరేణి చెల్లించింది. ఇంకా ''కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ'' పేర కోల్ బెల్ట్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంకు బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లిలకు రూ.2 కోట్ల చొప్పున అలాగే కోల్ బెల్టేతర ప్రాంతాలకు 20శాతం నిధులను కేటాయించినారు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ నుంచి కొత్తగూడెం రైల్వే లైన్ కోసం రూ.700 కోట్లు భారత్ రైల్వేకు చెల్లించినారు. అటవీ భూముల పరిహారానికి రూ.450కోట్లు అటవీ శాఖకు చెల్లించింది. ''సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్'' (ఎస్టీపీపీ)ద్వారా 2019-2020 ఆర్థిక సంవత్సరంలో గజ్వేల్ వద్ద గల గ్రిడ్ ద్వారా 8,672 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. ఎస్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన 2016 సెప్టెంబర్ 25 నుంచి 2020 మార్చి 31 వరకు 31,750 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను తెలంగాణకు సరఫరా చేయడం జరిగింది. 2016-2017లో ప్రతి విద్యుత్ యూనిట్కు రూ.3.58పై, 2017-2018లో రూ.3.43పై, 2018-2019లో రూ.3.49పై, 2019-2020 నుండి 2023-2024 వరకు రూ.4-12పైసలు చొప్పున సరఫరా చేయడానికి ''ఫవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ)జరిగింది. సింగరేణి విద్యుత్ యూనిట్ ధర యితర రాష్ట్రాల విద్యుత్ యూనిట్ ధర కంటే చౌక అయినప్పటికీ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించకుండా బకాయి పెడుతున్నారు.
సామాన్యంగా చావుకు అందరూ భయపడతారు. కాని సింగరేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తిని చేస్తారు. 2020 సెప్టెంబర్ 19న లోకసభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపిన వివరాల ప్రకారంగా 2015 నుంచి 2020 ఆగస్ట్ వరకు సింగరేణి గనుల ప్రమాదాల్లో 57మంది కార్మికులు చనిపోయినారు. అయినప్పటికీ బొగ్గుట్ట నుండి గోలేటి వరకు విస్తరించిన 131యేండ్ల సింగరేణిలో ప్రమాదమని తెలిసికూడా మూడుతరాలుగా పని చేస్తున్న వేల కుటుంబాలు ఉన్నాయి. అందుకే సింగరేణి కంపెనీని ''నల్ల బంగారు తల్లిగా, బాయి మైసవ్వ తల్లిగా కొలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బొంబాయి, దుబారు వలసలు తగ్గిపోయి బొగ్గు బాయి బతుకులు మెరుగు పడుతాయని ఆశించినాము. కాని స్వరాష్ట్రంలో కూడా సింగరేణి కొలువులకు గండిపెడుతున్నారు. మంచిర్యాలజిల్లా జైపూర్లో రూ.8,250 కోట్లు వెచ్చించి నిర్మించిన 2400 మెగావాట్ల ''సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్'' (ఎస్టీపీపీ) కనీసం 400 ఉద్యోగులను కూడా భర్తీ చేసుకోలేదు. ఆపరేషన్, ప్రీవెంటీవ్, రోటీవ్ మేయింటనెన్స్ పనులన్నింటినీ స్టీగ్ అనే బహుళ జాతి సంస్థకు కాంట్రాక్ట్కు ఇచ్చారు.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కె.రోశయ్య ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల బొగ్గు బ్లాక్1ను 47.93 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను తవ్వి 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ''కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ (కెేటీపీపీ)కి సరఫరా చేయడానికి సింగరేణి కంపెనీకి అనుమతి ఇచ్చింది. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరి 12న ''రీ అలికేషన్ ప్రాతిపదికన ప్రయివేటు కాంట్రాక్టుకు ఇచ్చింది. ఇల్లందులో జేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లోని ఓవర్ బర్డెన్, బొగ్గు ఉత్పత్తి పనులలోనూ ప్రయివేటు వారికే అవకాశం ఇచ్చారు. అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లో రూఫ్ బొల్టింగ్, డ్రిల్లింగ్, పారా మెడికల్ సిబ్బంది, సెక్యూరిటీ పనులను, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లలో మట్టి తొలగింపు, యంత్రాల రిపేర్ పనులను, క్యాంటీన్ల నిర్వహణను కాంట్రాక్టుకు ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు బాయి కొలువులు కూడా కరువయ్యే ప్రమాదం రాబోతుంది. ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏకంగా ''విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో బొగ్గు గనుల తవ్వకాలకు అనుమతించింది. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2020 జూన్ 18న'' కమర్షియల్ మైనింగ్ ప్రాతిపదకగా బొగ్గు తవ్వడానికి ''44'' బొగ్గు బ్లాక్లను కేటాయించడానికి వేలం పాటను ప్రారంభించినాడు. వేలం పాటలో బొగ్గు గనులను దక్కించుకున్న వారికి 50 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చినాడు. గతంలో ప్రభుత్వాలు ''కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు సంస్థల యెడల ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయాన్ని అవలంబించేవి. ప్రతి వార్షిక బడ్జెట్లో బొగ్గు సంస్థలకు బడ్జెట్ సపోర్ట్ కల్పించేవి. కానీ మోడీ 2014 నుంచి బడ్జెట్ సపోర్ట్ను విరమించుకున్నారు. పైగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియతో బొగ్గు సంస్థలను వాటాల రూపకంగా అమ్ముతున్నారు. కొత్త బొగ్గు గనులను తవ్వడానికి సకాలములో అనుమతులను ఇవ్వడం లేదు.
సింగరేణి కంపెనీ 1998-1999 ఆర్థిక సంవత్సరం నుంచి గడచిన 2019-2020 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా నికర లాభాలతో అభివద్ధి సాధిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి ''ఆసియా పసిఫిక్ ప్రెన్యూర్ షిప్ అవార్డ్ నుండి జాతీయ స్థాయి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డ్''తో పాటుగా అనేక ఉత్తమోత్తమ అవార్డ్లను పొందింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కంపెనీ నుండి పన్నులు వసూలు వసూళ్లు చేసుకోవడంపై చూపూచున్న శ్రద్ధ అభివృద్ధిపై చూపడం లేదు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి యితర ప్రభుత్వ సంస్థల నుండి దాదాపు రూ.12 వేల కోట్లు బకాయిలుగా పేరుకు పోయాయని తెలుస్తున్నది.
సింగరేణి కంపెనీ తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల పారిశ్రామిక ఇంధన అవసరాలను తీర్చుతూ దేశాభివృద్ధిలో భాగస్వామ్య మవుతోంది. రాజకీయంగా, సామాజికంగా 8 అసెంబ్లీ, 4 పార్లమెంటు నియజకవర్గాలు కలగి ఉన్నది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొంగు బంగారంగా, ప్రభుత్వ పరిశ్రమగా ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఆపని చేయకపోగా నష్టాల్లోముంచి ప్రయివేటుకు అప్పగించాలని చూస్తున్నాయి. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణిని కాపాడుకోవడం ఇప్పుడు కార్మికులు, ప్రజల బాధ్యతే. బలమైన ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాల మెడలు వంచి సంగరేణిని రక్షించుకోవాలి.
- మేరుగు రాజయ్య
సెల్: 9441440791