Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల అనేది నిద్రలో కనిపించేది కాదు. కల అంటే నిన్ను నిద్ర పోనివ్వకుండా చేసేది. కల ఆలోచనలను రేకెత్తిస్తుంది. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అంటూ విద్యార్థి లోకాన్ని నిద్ర లేపిన చైతన్య స్ఫూర్తి ప్రదాత భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆయన ఎప్పుడూ విద్యార్థులకు చెబుతూ ఉండేవారు. ''చిన్న లక్ష్యం కలిగి ఉండటమనేదే పెద్ద నేరంతో సమానమని'' శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, అధ్యాపకుడిగా రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవి. అవుల్ పకీర్ జైన్ల్లుబ్దిన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జైనులాబ్దిన్, ఆసియామ్మ దంపతులకు జన్మించారు. పేద కుటుంబం కావడం వలన కుటుంబ అవసరాల నిమిత్తం కలాం చిన్నతనంలో వార్తాపత్రికలు అమ్మే వారు. చదువులో సాధారణ విద్యార్థిగా ఉన్న నూతన విషయాలు నేర్చుకోవడంలో ఆయన ఆసక్తి కనబరిచేవారు. 1960 సంవత్సరంలో'' ది మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'' నుంచి ఇంజనీరింగ్ పట్టా పొంది. డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా చేరారు. ఆ తరువాత ఇస్రోలో సేవలందించారు. 1963 సంవత్సరం తర్వాత కలాం పలు దేశాలలో పర్యటించారు. 60వ దశకంలో భారత్ పాకిస్థాన్ చైనా వంటి దేశాలతో యుద్ధం చేయవలసి వచ్చింది అప్పుడే భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయవలసిన అవసరం ఉందని కలాం గుర్తించారు. ఆయన ఇస్రోలో పని చేసేటప్పుడు పిఎస్ఎల్వి, ఎస్ఎల్వి-3 వంటి ప్రాజెక్టులు రూపకల్పనలో కీలక పాత్రను పోషించారు. 1970 దశకంలో బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్లలో ప్రముఖ పాత్రను పోషించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డవలప్మెంట్ పోగ్రామ్ ద్వారా అగ్ని, పథ్వి వంటి క్షిపణుల రూపకల్పనలోనూ కీలకపాత్ర పోషించారు. 1998 సంవత్సరంలో భారత్ రెండవ దఫా నిర్వహించిన అణు పరీక్షలలో చురుకైన పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 సంవత్సరం వరకు భారత పదకొండవ రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారు. 40కిపైగా విశ్వవిద్యాలయాలు అబ్దుల్ కలాంగారికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 1997వ సంవత్సరంలో ఆయనను భారతరత్న వరించింది. ప్రముఖ రచయిత అరుణ్ తివారితో కలిసి ఆయన తన ఆత్మ కథను ''వింగ్స్ ఆఫ్ ఫైర్'' పేరుతో వెలువరించారు. బ్రహ్మౌస్ వంటి సూపర్ సానిక్ మిస్సైల్ను భారత్ తయారు చేయగలిగిందంటే క్షిపణి రంగంలో అబ్దుల్ కలాం వేసిన గట్టి పునాదులే కారణం. అందుకే ఆయనను ''భారత క్షిపణి పితామహుడుగా'' పిలుస్తారు. 2015 జులై 27న అబ్దుల్ కలాం షిల్లాంగ్లోని ఐఐఎంలో ప్రసంగిస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో తన 83వ యేట తుది శ్వాస విడిచారు. ''ఒక క్షిపణి ప్రయోగం విఫలమైతే నాయకుడిగా అపజయం నాది. అదే ప్రయోగం విజయవంతమైతే ఆ ఘనత మనందరిదీ'' అని అబ్దుల్ కలాం తన సహచరులతో ఎప్పుడు అనేవారు. నిర్మలత్వం కష్టించే తత్వం, సమిష్టితత్వం వంటి లక్షణాలను అబ్దుల్ కలాంగారి నుంచి నేటితరం యువత నేర్చుకోవలసిన అవసరం ఉంది.
- నరేష్ జాటోత్
సెల్:8247887267