Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పునర్దర్శనం అంటే పునరావలోకనం. ఇది ఒకరకంగా సమీక్షనే. ఆత్మగౌరవం, త్యాగనిరతి, ప్రేమాస్పద గుణం, ధిక్కారంల మేలు కలయిగా ఉన్న తెలంగాణ పునర్దర్శనం భవిష్యత్ నవ తెలంగాణ నిర్మాణానికి క్రాంత దర్శనం చేస్తుందని నా భావన. తన ప్రేమాస్పద గుణం - ధిక్కార స్వరంతో తెలంగాణ ఉద్యమానికి, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారానికి దిక్సూచిగా నిలిచిన ముచ్చర్ల సత్యనారాయణ ఆ ఉద్యమంలోనే నాకు పితృ సమానుడిగా అంది వచ్చాడు. తెలంగాణ పునర్దర్శనానికి ముచ్చర్ల సత్యనారాయణ 4వ వర్ధంతి (అక్టోబర్ 10) సందర్భంగా చర్చాగోష్టిత జరగాల్సిన సమయంలో ఆయన కుమారుడు నాకు సోదర సమానుడైన డా||పృథ్విరాజ్ అనుకోకుండా కోవిడ్ బారినపడి ఆసుపత్రిలో చేరాడు. అందుకే కాస్త ఆలస్యంగానైనా ముచ్చర్ల సత్యనారాయణ గురించి నాలుగు మాటలు రాసుకుని, తెలంగాణ పునర్దర్శనంలో వీరి భావాల ప్రత్యేకతను, తెలంగాణ ధిక్కార స్వరూప సార్వజనీనతను బేరీజు వేసుకోవాలి. ఇదే రేపటి నవ తెలంగాణ దశా దిశకు పునాది అవుతుందని నా భావన. తన నాల్గవ వర్ధంతి సందర్భంగా మరొకసారి ఇలాంటి ఆలోచన రేకెత్తించిన ముచ్చర్ల సత్యనారాయణగారికి నిండు మనస్సుతో నివాళులర్పిస్తున్నాను.
తెలంగాణ పునర్దర్శనం కోసం మొత్తం తెలంగాణ చరిత్రలోనికి పోవడం కాదు. కాకతీయ చివరి రాజు ప్రతాపరుద్రున్ని ఢిల్లీ సుల్తానులు బంధీగా తీసుకుపోతుంటే ఆయన నర్మదా నదిలో దూకి ఆత్మార్పణ చేసుకోవడం తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అంటారు ప్రొ|| కేశవరావు జాదవ్. మరొకవైపు దక్షిణ భారతంలోని బలమైన కాకతీయ సామ్రాజ్యానికి కరువులో కప్పం కట్టలేమని పోరాడి ప్రాణాలర్పించిన సమ్మక్క - సారలమ్మ తెగువ తెలంగాణ స్వంతం. తాను బతికినంతకాలం ఆదివాసుల స్వయంపాలన హక్కుల చుట్టే తిరిగిన వాడు డా|| బియ్యాల జనార్ధన్. పదిహేనవ శతాబ్దంలోనే బమ్మెర పోతన పండితులను, పామరులను మెప్పించే సరళమైన పద్యాలను పలికించి, ద్విపద సాంప్రదాయాన్ని ప్రారంభించి ప్రజాకవిగా పేరొందాడు. అలాంటి పలుకుబడులతో కాళోజి కవిత్వం సమాజం గొడవనంతా తన గొడవగా స్వీకరించింది. 370 సంవత్సరాల క్రితమే ఒక సామాన్యుడైన సర్వాయి పాపన్న బహుజన సైన్యం నిర్మించి పోరాడి బడుగుల రాజ్యమే స్థాపించినాడు. ఇక ఏకంగా 1946-51 వరకు దున్నే వారికి భూమి ప్రాతిపదికగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం చారిత్రాత్మకమైనది. మూడువేల గ్రామాల్లో ప్రజారాజ్యాల్ని స్థాపించి నాలుగువేల మంది ప్రాణాలర్పించిన పోరాటమది. ప్రాంతీయ ప్రజాస్వామిక పోరాటంగా ప్రసిద్ధిగాంచిన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి పొలిటికల్ కంపల్షన్ సిద్దాంతాన్ని జోడించిన వారు ప్రొ|| జయశంకర్. దాదాపు ఈ పరిణామాలన్ని ముచ్చర్ల సత్యనారాయణ పుట్టి పెరిగిన ప్రాంతం చుట్టే ప్రధానంగా అల్లుకున్నాయి. అందుకేనేమో వీటన్నింటి మేలు కలయిగా ముచ్చర్ల (సంగంరెడ్డి) సత్యనారాయణ (83) జీవితం ఉంటుంది. ఆయన జీవితంపై సమగ్రమైన విశ్లేషణ రావాల్సి ఉంది.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో 13 సంవత్సరాల వయస్సులో ఆ సంఘర్షణంతా చిత్రించుకున్నట్టు ఆయన జీవితం కొనసాగింది. భూమి కోసం పోరాటం, దొరపటేల్ల ఆగడాలకు వ్యతిరేకంగా బాగోతాల రూపంలో కళా ప్రదర్శన, విద్యార్థిగా 1952లోనే నాన్ ముల్కి గోబ్యాక్ ఉద్యమంలో చురుకైన పాత్రతో పాటు 1969 తొలి తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. న్యాయశాస్త్రం చదువుకున్నా నిఖార్సయిన రైతుగాను మెప్పించాడు. చక్రవ్యూహం లాంటి పంచాయితీరాజ్ వ్యవస్థలో నెగ్గుకు వచ్చి ఆనాడే క్యాంపు రాజకీయాలను చిత్తుచేశాడు. బహుజన ఉద్యమానికి ప్రతీకగా ఉన్నందునే 1983లో ఎన్.టి. రామారావు పిలిచి తెలుగుదేశం టికెట్ ఇచ్చాడు. ఎంఎల్ఎగా గెలువగానే రవాణాశాఖ మంత్రి పదవి ఇచ్చాడు. మంత్రి పదవులొచ్చినా తాను సామాన్యుడిగానే జీవన యాత్ర సాగించాడు. తన సహజమైన ధిక్కార స్వభావంతో ఆత్మగౌరవం కోల్పోతూ మంత్రిగానూ ఇమడలేక తిరుగుబాటు చేశాడు. దాని తర్వాత మలిదశ తెలంగాణ పోరాటంలో ఆయన టిఆర్ఎస్లో చేరినా అక్కడా ఇమడలేదు. సామాజిక తెలంగాణ గురించి కలగంటూ చివరిదాకా ఉద్యమకారులకు వెన్నంటి నిలిచాడు. ప్రజలపక్షపాతిగా బతికాడు. ప్రజల మనిషిగానే తనువు చాలించాడు.
ఒక సీరియస్ ఉద్యమకారుడుగా, రాజకీయవేత్తగా కైగట్టి పాడటం, వాగ్గేయకారుడిగా ప్రాచుర్యం పొందడం అనేది కూడా చాలా అరుదైన పరిణామం. తెలంగాణ చారిత్రక - రాజకీయ పరిస్థితుల నుండి ఉద్భవించిన ముచ్చర్ల సత్యనారాయణ జీవితాన్ని వివరిస్తూ పి.చంద్ రాసిన 'ధిక్కార కెరటం' నవల ఒక ఎత్తయితే, ఆరేండ్ల తెలంగాణ పాలన తర్వాత తెలంగాణ దశా - దిశ ఎలా ఉండాలన్న లక్ష్యంతో ఇలాంటి వారెంతో మంది జీవితాన్ని పునర్ దర్శించుకోవాలి. ముచ్చర్ల సత్యనారాయణ లాంటి వారి జీవితాల నుండి సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక తెలంగాణ లాంటి భావాలను కాసి వడపోయవచ్చు. అవే స్మృతులు, కాలగతులు కావాలని ఆశిస్తూ ... ప్రజా పక్షపాతి, పితృసమానుడైన సంగంరెడ్డి సత్యనారాయణ (83)కు మరొకసారి నివాళులర్పిస్తున్నాను.
- విమలక్క