Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమా మహేశ్వర ఉగ్రస్వరూప... ఇటీవల ఓటీటీ (ఆన్లైన్)లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అయితే అదే పేరుతో హైదరాబాద్లోని కొంపల్లిలో ఉన్న ఉమా మహేశ్వర కాలనీ మాత్రం ఇటీవల వచ్చిన వరదల ఉగ్రరూపం ధాటికి తల్లడిల్లిపోతున్నది. నడుముల్లోతు నీటిలో జనం నానా అవస్థలు పడుతున్నారు. తినటానికి తిండిలేక, తాగటానికి నీరు లేక, కరెంటు పోయి, సెల్ఫోన్లు మూగబోయి దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నారు. వారి దీన స్థితిని సోషల్ మీడియాలో చూసిన ఓ ఫొటో జర్నలిస్టు హృదయం ద్రవించింది. తాను అక్కడి కాలనీ వాసులకు ఎలాంటి చేయూతనివ్వలేకపోయినా... వారి బాధలు, కష్టాలు, కన్నీళ్లను బాహ్య ప్రపంచానికి చూపెట్టాలని భావించి కెమేరా మెడలో వేసుకుని... ఉమా మహేశ్వర కాలనీకి చేరుకున్నాడు. వరదలా పారుతున్న నీటిలోనే ముందుకెళుతూ అతి కష్టం మీద ఫొటోలు తీయసాగాడు. ఇంతలో ఓ అవ్వ... 'ఎందుకు మా ఫొటోలు తీస్తున్త్రు. మీరు పేపర్ల ఏసినా ఎవడూ రాడు, మమ్మల్ని పట్టించుకోరు...' అంటూ బోరుమన్నది. దానికి ఆ ఫొటో జర్నలిస్టు... 'చెరువుల్లో ఇండ్లు కట్టుకుంటే గిట్లనే ఉంటది...' అని అవ్వ మీద సెటైర్ వేశాడు. దానికి పక్కనున్న మహిళలు సీరియస్ అయిపోయి... 'హెచ్ఎమ్డీఏ లే అవుట్లనే ఇల్లు కట్టుకున్నాం. పర్మిషన్లన్నీ తీసుకున్నం...' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అయితే మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్న గవర్నమెంట్ మీద కసి తీర్చుకోండి. వచ్చే జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో కారు పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి...' అంటూ ఫొటో పాత్రికేయుడు సలహానివ్వబోయాడు. దానికి ఆ అవ్వ, మహిళలు ఒక్కసారిగా గళమెత్తారు. 'ఎన్నికలప్పుడు మనిషికి మూడు వేలిస్తరాయే... ఓటెయ్యకుండ ఎట్లుంటమయ్యా...' అంటూ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వారి చైతన్యానికి కండ్లు బైర్లు కమ్మి సొసొచ్చినంత పనైన జర్నలిస్టు... 'గట్లయితే మీ సావు మీరు సావండి...' అనుకుంటూ బురద నీటిలో ముందుకు కదిలాడు.
-కె.ఎన్.హరి