Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ విశాల ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. దాన్ని సాధించటానికి అతడు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. లక్ష్యం సాధించిన వాడు జబ్బలు చరుచుకుంటూ కాలరెగరేస్తే... దాన్ని చేరుకోలేనివాడు 'అందని ద్రాక్ష పండ్లు పుల్లన...' అనుకుంటూ మిన్నకుండిపోతాడు. ఇదే సూత్రం ప్రభుత్వాలకు, సంస్థలకు సైతం వర్తిస్తుంది. తమ ఆదాయ వనరులకు అనుగుణంగా త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక లక్ష్యాలను అవి నిర్దేశించుకుంటాయి. వాటికనుగుణంగా పని చేయాలంటూ తమ ఉద్యోగులను, సిబ్బందిని ఆదేశిస్తుంటాయి. ఇందుకు కొన్ని ప్రామాణికాలు, ప్రతిపాదకలను అవి సూచిస్తుండటం పరిపాటి. ఆ క్రమంలో ఇటీవల ఒక బహుళజాతి కంపెనీ తన ఎంప్లాయిస్కు ఇచ్చిన ప్రామాణికాలను వింటే మనం నోరెళ్లబెట్టాల్సిందే. ఓ రెండేండ్ల క్రితం ఒక అగ్రశ్రేణి తెలుగు దిన పత్రికలో అత్యధిక వాటాను కొనుగోలు చేసిన సదరు ఎమ్ఎన్సీ... అనతికాలంలోనే ఆ పత్రికపై తన ప్రభావాన్ని చూపింది. అంతేకాదండోరు... ఏకంగా ఓ న్యూస్ వెబ్సైట్ను స్థాపించి, 'తనదైన' శైలిలో తాజా వార్తలను పాఠకులకు అందజేస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, తద్వారా తలెత్తిన జనం సమస్యల గురించి... ఔత్సాహిక పాత్రికేయుడొకరు పుంఖాను పుంఖాలుగా రాద్దామని ప్రయత్నించాడట. ఇదే విషయాన్ని తన బాస్కు చెబితే... ఆయన కిసుక్కున నవ్వి... 'అరేరు తమ్మీ... నువ్వు గసమంటి వార్తల మీద ఫోకస్ జెయ్యకు బై. గవన్నీ యాభై ఏండ్లు పై బడినోళ్లు, రిటైరైనోళ్లు తీరిగ్గా సదువుకుంటరు. వాళ్ల వీవర్షిప్ ఎంతుటది బై. చానా తక్కువ. గందుకే మన టార్గెట్ మొత్తం పదారు నుంచి ఇరవై ఆరు ఏండ్ల పోరల మీద బెట్టినం. గాళ్లకిప్పుడు స్కూళ్లు, కాలేజీల్లేవ్. ఖాళీగున్న ఏజ్ గ్రూప్ అదే. గందుకే గాళ్లు గూగుల్ల బాగ సెర్చింగ్ జేసే క్రికెట్, సినిమా, సినీ స్టార్ల ప్రేమలు, పెండిండ్లు, వాటికి సంబంధించిన గుసగుసలు, గ్యాసిప్పుల మీద ఎంతెక్కువ రాస్తే అంత మంచిది. ఆ మేరకు మనకు అంత వీవర్షిప్, రేటింగ్ పెరుగుతది. వెబ్సైట్కు మస్తు పైసలొస్తయి...' అని ఉపదేశించిండు. దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లోనే ఉందంటూ గప్పుడెప్పుడో నెహ్రూగారు నొక్కి వక్కాణించారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన కాణ్నుంచి 1990 దాకా... యువకులు అనేక సంఘ సంస్కరణ ఉద్యమాల్లో పాల్గొని, అభ్యుదయం వైపు నడిచారు. అప్పటి పత్రికలు, సినిమాలు, సాహిత్యం వారికి ఆదారి చూపించాయి. కానీ ఇప్పుడు టీవీలు, వెబ్సైట్లు, యూట్యూబ్లు వారికి దిశా, నిర్దేశం చేయాల్సింది పోయి... సమాజానికి దూరం చేస్తున్నాయి. అన్ని పేపర్లు, సైట్ల లక్ష్యం ఇదే కాకపోయినా, అత్యధిక సంస్థల టార్గెట్ ఇదే...
-బి.వి.యన్.పద్మరాజు