Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణంలో మూడు కాలాలు. ఒకదాని వెంట మరొకటి వేసవిని వెన్నంటి వర్షాకాలం దాన్ని తోసేసి శీతాకాలం వస్తూనే ఉంటాయి. ఈ సారి వానాకాలంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ''వానపడేది, ప్రాణం పోయేది తెల్వదు'' అంటారు పెద్దలు. కానీ శాస్త్రసాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత వాతావరణ శాఖ వారి అంచనాల మేరకు ప్రభుత్వాల ముందస్తూ హెచ్చరికలతో జాగ్రత్తలతో వానాకాలం ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. కానీ మన ప్రభుత్వాలకు ఆ అప్రమత్తత కొరవడింది. వర్షాకాలంలో ఎక్కువ రోజులు సాధారణం కన్నా ఎక్కువ వర్షం కురువడం ఈ సారి ప్రత్యేకత అని వాతావరణ శాఖ చెపుతున్నది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ మొత్తం 122 రోజులు వానాకాలం సీజన్లో ఏకంగా 82 రోజుల పాటు వర్షాలు కురవడం సరికొత్త రికార్డు. గత 33 ఏళ్లలో 2010లో మాత్రమే 81 రోజులు కురవగా, ఈసారి అంతకంటే ఇంకొక రోజు ఎక్కువ కురిస్తాయి. ఈ సారి ఎక్కువ రోజులు మాత్రమే కాదు ? రోజు వారీ వర్షపాతంలోను రికార్డు నమోదు అయిందని తెలుస్తున్నది. అలాగే సాధారణ వర్షపాతం 759.6 మి.మీ.లకు గాను 50 శాతం అదనంగా వర్షపాతం కురిసినట్లు తెలుస్తున్నది.
వాతావరణ శాఖ వారు ముందస్తుగా వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఏఫ్రిల్, మే నెలల్లో రెండుసార్లు అంచనాలను విడుదల చేస్తారు. అలా గత ఏప్రిల్, మే నెలల్లో ఇచ్చిన అంచనాల్లో తెలంగాణలో సాధారణం కన్నా 8శాతం ఎక్కువ లేదా తక్కువ ఉంటుందని తెలిపింది. కానీ సాధరణం కన్నా 50శాతం అదనంగా వర్షాలు కురవడం గమనార్హం. ఇంత ఘోరంగా అంచనాలు తలకిందులవ్వడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని తెలుస్తున్నది. ఫలితంగా వ్యవసాయరంగపైన ఆధారపడ్డ మనదేశంలోని పంటలకు వరదల ముప్పుతో రైతాంగం చాలా నష్టపోయింది. మహానగరాలు, పట్టణాలు, జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. ఒకవైపు కరోనా మరణ మృదంగంతో అతలాకుతలమౌతున్న ప్రజలు భారీ వర్షాలు తోడవ్వడంతో పనుల్లేక సీజనల్ వ్యాధుల విజృంభనతో భారీ కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులే అధిక వర్షాలకు గానీ, వర్షాభావానికి గానీ కారణమని విశ్లేషిస్తున్నారు. మనషి ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పర్యావరణానికి హాని చేస్తూ, కాలుష్య కోరల్లో ముంచుతున్న స్వార్థానికి ఫలితం అనుభవించాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ వానల సీజన్లో బంగాళాఖాతంలో 9 అల్ప పీడనాలు ఏర్పడ్డాయి. జూన్, జులైల్లో ఒక్కొక్కటి, ఆగష్టులో ఏకంగా 5, సెప్టెంబర్లో 2 అల్పపీడనాలు ఏర్పడి విస్తారంగా వానలు కురిసాయి. భారతదేశంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య గాలుల వలయాలు ఏర్పడినవి. ఇవి తెలంగాణ మీదుగా ప్రయాణించి చల్లబడి తరుచూ కుంభవృష్టి కురిపించాయి. ఇలాంటి వాతావరణం గత 33 ఏండ్లలో ఎన్నడూ ఏర్పడలేదని వాతావరణ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. ఇదిలావుంటే ఈ వ్యాసం రాసే సమయానికి ఇంకా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం ముగిసినప్పటికీ నవంబర్ వరకు పడుతుండవచ్చనీ, శీతాకాలంలో ఈ వర్షాల మూలంగా చలిగాలులు, విపరీతంగా వీచునని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ స్థాయిలో వర్షపాతం గత వందేళ్లలో ఇదే రెండో అత్యధికమని అధికారులు చెపుతున్నారు. మన రాష్ట్రంలో భారీ వర్షాలతో పలు జిల్లాలు, హైదరాబాద్్ ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. ఈ నెల 1 నుంచి 14వ తారీఖు వరకు ఒక్క హైదరాబాద్లోనే సాధారణం కన్నా 404 శాతం అధిక వర్షం కురిసింది. 10 జిల్లాలు 106 మండలాల్లో భారీ వర్షం నమోదైంది. ఇలా వాతావరణ శాఖ అంచనాలు తప్పడం వలన తగిన అప్రమత్తత లేక వర్షాలతో భారీ నష్టమే జరిగింది. ఇకనైనా మానవుడు ప్రకృతి విరుద్ధ జీవనం విడనాడాలి. పాలకులు అభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరుతో కాలుష్యాన్ని పెంచి పోషించడం, నేల కన్పించకుండా కాంక్రీట్ జంగల్లాగా మార్చడం, నగరీకరణ పేరుతో నేలను గుళ్ళపొడుస్తూ, గాయాలు చేయడం మాని పర్యవరణానికి హాని జరగకుండా అభివృద్ధికి బాటలు పరచాలి.
- మేకిరి దామోదర్
సెల్: 9573666650