Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నవంబర్ 5న కరోనా నిబంధనలు పాటిస్తూ, దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను తెరిచేందుకు అనుమతించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి తీవ్రనిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ వర్సిటీలను తెరవటం లేదు. దీంతో పీహెచ్డీ విద్యార్థుల పరిశోధన, పీజీ, యూజీ విద్యార్థుల చదువులు ఆగిపోయాయి. ప్రభుత్వ వర్సిటీలలో ఆన్లైన్ తరగతులు పేరుకే మిగిలిపోయాయి, ఆచరణలో ప్రభావం లేకపోయింది. ప్రభుత్వ వర్సిటీలలో చదువుతున్న వారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన దళిత బహుజన విద్యార్థులు కావడంతో వారి చదువులను పాలకులు పట్టించుకోవటం లేదు. తెలంగాణలో ప్రభుత్వ వర్సీటీల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిన పాలకులు మరో వైపు ప్రయివేటు వర్సిటీ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించుతున్నారు. పాలమూరు వర్సిటీ, శాతవాహన వర్సిటీ, తెలంగాణ వర్సిటీలలో కనీసంగా ఉండాల్సిన టీచింగ్ స్టాఫ్ లేక, నిధులు లేక కరోనా సంక్షోభానికి ముందే భౌతిక విద్యా భోదన పూర్తి స్థాయిలో నిలిచిపోయి ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయంలో కొత్త ప్రొఫెసర్ల భర్తిలేక ఇప్పుడున్న ప్రొఫెసర్లు సగానికి రిటైర్డ్ కాగా, మిగిలిన వారు వర్సిటీ పాలన ఫోస్టులలో బిజీగా ఉండటంతో అకడమిక్ వాతావరణం నిలిచిపోయింది. కనీస సౌకర్యాలు కూడా కరువైనాయి. ప్రతిష్టాత్మక ఓయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కాలేజీలో కొన్ని శాఖలలో విద్యా భోదన సాగని పరిస్థితి ఉంది. ఓయూ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు అందరూ పదవివిరమణ చేయగా మిగిలివున్న ఓకే ఒక ప్రొఫెసర్ కృష్ణారావు డిపార్ట్మెంట్ హెడ్గా, బోర్డు ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) చైర్మన్గా, యునీవర్సిటీ ఉపకులపతి ఓయస్డీగా ఉన్నారు. ఆయనకు చదువు చెప్పాలనే ఆతురత ఉన్నా సమయం సరిపోవటం లేదు. టీచింగ్ స్టాఫ్కు నాన్ అకడమిక్ బాధ్యత అప్పగించే విధానం మారాలి. ఇది ఇలా ఉంటే వివధ వర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రారంభించిన కేంద్రాలు పనిచేయటం లేదు కదా కనీస కర్తవ్యాలు నిర్వర్తించటం లేదు. నూతన పరిశోధన ల్యాబ్ల నిర్మాణం, హాస్టల్ల నిర్మాణం అంతంతమాత్రంగానే ఉంది.
మరోవైపు పాలకులు ప్రయివేటు యూనివర్సిటీల కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీల సమస్యలను గాలికొదిలేసారు. రెగ్యులర్ ఉప కులపతులను (వైస్ చాన్సలర్)ను నియమించకుండా, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాలకుల విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యను నిరాకరించేవిగా మారాయి. మార్చ్ నెలలో యూనివర్సిటీలు మూసివేయటంతో 2019-20 విద్యా సంవత్సరానికి చెందిన పీజీ, యూజీపీజీ విద్యార్థులు రెండవ సెమిస్టర్ విద్యాభ్యాసాన్ని పూర్తిగా కోల్పోయారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీజీ మూడవ సెమిస్టర్, డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు డిగ్రీ, పీజీ కోర్సులలో చేరుతున్న విద్యార్థులకు ఏ విద్యా సంవత్సరం వర్తింపచేస్తారో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేయటం లేదు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు డిసెంబర్ 7 నుండి ఆన్లైన్ తరగతులు ప్రారంభిస్తామన్న తెలంగాణ పాలకులు అందుకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. దూరదర్శన్, టిశాట్ తరగతులు 50శాతం పాఠశాల, ఇంటర్ విద్యార్థులు వినటం లేదని స్వచ్ఛంద సంస్థల రిపోర్టులు స్పష్టం చేశాయి. తెలంగాణలో సినిమా హాళ్లు, మద్యం బార్లు ఓపెన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలు ఎందుకు తెరిపించటంలేదు? కరోనా కాలంలో నష్టపోయిన విద్యా సంవత్సరానికి బదులుగా ప్రత్యామ్నాయ విద్యాసంవత్సర క్యాలెండర్ రూపొందించి, కరోనా నిబంధనలు పాటిస్తూ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలలు తెరిపించాలి. సాధ్యం కాని పక్షంలో ''సున్నా విద్యా సంవత్సరం (జిరో అకడమిక్ యియర్)'' ప్రకటించి విద్యార్థులు, తల్లి దండ్రులలో నెలకొన్న సంగ్ధితను తొలగించాలి.
- కె. ఆనంద్
సెల్:9652357076