Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటు న్నట్టున్నది. ఎందుకు ఈ మాట అనాల్సివస్తుందంటే! పగలు తిట్టుకోవాలి, రాత్రికి కలుసుకోవాలి అనే పద్ధతిలో ప్రస్తుత రాజకీయాలు నడుస్తు న్నాయి. నువ్వు గిచ్చినట్టు చెయ్యి. నేను ఏడ్చినట్టు చేస్తా! అలా చేస్తే ప్రజలు మనల్ని నమ్ముతారు అనే సిద్ధాంతంతో రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో రాజకీయాలు సిద్ధాంత ప్రాతిపదికన, విలువలతో కూడినవిగా ఉండేవి. కానీ నేడు వాటికి కాలం చెల్లింది. ఇప్పుడు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించాలి. లేదా అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రత్యర్థులను లొంగతీసుకోవాలి అనే కొత్త సిద్ధాంతంతో రాజకీయాలు చేస్తున్నారు. అవసరమైతే చీకటి ఒప్పందాలు చేసుకోవాలి, మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెట్టాలి. ఎప్పుడైతే రాజకీయాలలోకి పారిశ్రామిక, వ్యాపార వర్గాలు ప్రవేశించడం మొదలయిందో రాజకీయాలలో డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టగలిగే వారికి, పార్టీకి ఫండ్ ఇవ్వగలిగే వారికి మాత్రమే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీఫామ్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. రాజకీయాలంటే డబ్బు, డబ్బు అంటే రాజకీయం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఎన్నికలలో గెలవాలంటే డబ్బు కావాలి, అందుకు ఏదొక ఒక పద్దతిలో డబ్బు సంపాదించాలి. అది అక్రమమా, సక్రమమా అన్నది ముఖ్యం కాదు.
ఇలాంటి సంస్కతి రాజకీయాలలోకి వచ్చాక విలువలు సిద్ధాంతాల గురించి మాట్లాడుకోవడం దండగ. కాకపోతే పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోచమ్మ కొట్టింది అన్నట్టుగా రాజకీయలలో కూడా అది తప్పదు. నువ్వు నీకున్న అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష నాయకులను భయపెట్టి లొంగదీసుకోవాలనుకుంటే నిన్ను నీపైనోడు లొంగదీసుకుంటాడు. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థులను సామ దాన దండోపాయం ద్వారా లొంగ తీసుకోవాలనుకుంటే రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం లొంగతీసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ రాజకీయ క్రీడ రోజు రోజుకు భయంకరంగా మారుతున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి చెప్పడం, అధికారంలోకి వచ్చాక మరొకటి అమలు చేయడం కూడా రాజకీయ పార్టీలకు సర్వ సాధారణం అయ్యింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం, చట్టాలను తుంగలోతొక్కడం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం ఇలా అనేక అక్రమ మార్గాలకు తెరలేపారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలను భ్రష్టు పట్టించారు.
విలువలు సిద్ధాంతాల సంగతి ఇలా ఉంటే, పార్టీల మధ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు కూడా అంతు పట్టకుండా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అప్పుడే తిడుతారు, వారిపై యుద్ధం చేస్తామని ప్రకటిస్తారు, వెంటనే యూటర్న్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లులకు ఉభయసభలలో మద్దతు ఇస్తారు. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రీజనల్ పార్టీలు పూటకొక మాట మాట్లాడుతున్నాయి. అవసరాలను బట్టి ఒకరికి ఒకరు సహకరించు కుంటున్నారని అర్ధం అవుతున్నది. తమిళనాడులో ఏఐడీఎంకే బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం, రజనీకాంత్ బీజేపీల మధ్య ఉన్న అవగాహన, ఎంఐఎం దేశవ్యాప్తంగా బీజేపీకి పరోక్ష సహకరిస్తూ ఆ పార్టీ గెలుపుకు కషి చేస్తుందని జరుగుతున్న ప్రచారాన్నీ ఇందులో భాగంగానే చూడాలి. మోడీ అమిత్ షాల ద్వయం ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతీయ రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. తమకున్న విస్తతాధికారాలను అడ్డంపెట్టుకొని దర్యాప్తు సంస్థలతో పాటు ఇతర సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొలిపి వారిపై కేసులు నమోదు చేయించి, వేదించి లొంగతీసుకునే పద్ధతికి తెరతీశారు. అంతే కాదు వివిధ రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకు ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను నయానో భయానో లొంగదీసుకుని వారితో రాజీనామా చేయించి తిరిగి తమ పార్టీ భీ- ఫామ్ ఇచ్చి నిలబెట్టి గెలిపిస్తున్నారు. లొంగని వారిపై సీబీఐ, ఐటి, ఈడీ సంస్థలతో దాడులు చేయించి వారిని జైలు పాలు చేస్తున్నారు. తమ చెప్పుచేతల్లో ఉండని, తమ మాట వినని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలకు తెరలేపుతున్నారు. ఒక వైపు దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలతో భావోద్రేకాలను రెచ్చగొడుతూ మరోవైపు బెదిరింపు, బ్లాక్ మెయిల్ రాజకీయాలను నడుపుతున్నారు. చాలా దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా లొంగ తీసుకున్నట్టు కనపడుతున్నది. కేసీఆర్ వారికి భయపడుతున్నట్టు కనపడుతున్నది. అందుకు ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో టీఆరెస్ అనుసరించిన వ్యూహం, అలాగే రైతు ఉద్యమం పట్ల కేసీఆర్ ఊగిసలాట ధోరణి ఆశ్చర్యం కలిగిస్తున్నది. భారత్ బంద్కు మద్దతిచ్చిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేవలం మోడీ షాలను కలిసి వచ్చాడే తప్పా రైతుల ఆందోళన శిబిరం వైపు కన్నెత్తికూడా చూడకపోవడం దేనికి సంకేతం? అప్పుడే మోడీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అప్పుడే రాజీ పడుతున్నాడు. దీని వెనుకున్న మతలబు ఏమిటి? మోడీ షాలను చూసి కేసీఆర్ భయపడుతున్నాడా? ఏమి చూపించి కేసీఆర్ను వారు కట్టడి చేస్తున్నారు? దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీని గెలిపించడానికి టీఆరెస్ పరోక్షంగా సహకరించిందా? టీఆరెస్ వ్యూహం వెనుక ఏమిటి మతలబు. ఈ రెండు ఎన్నికలలో బీజేపీతోనే తమకు పోటీ అని పదే పదే ఎన్నికల ప్రచార సభలలో చెప్పడం తద్వారా బీజేపీని వ్యూహాత్మకంగా ప్రధాన పోటీలోకి తేవడం వెనుక ఏదో రహస్య ఒప్పందం ఉందనే అనుమానం వస్తున్నది. దీనికి తోడు దుబ్బాక ఎన్నికను కేవలం హరీష్ రావు మీద, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలను కేవలం కేటీఆర్ మీద కేసీఆర్ వదిలేసారు. ఎల్బీ స్టేడియం సభలో కేసీఆర్ ప్రసంగం కూడా గందరగోళంగా ఉంది. నేను థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించడం కూడా రాజకీయ దుమారాన్ని లేపింది. అసందర్భంగా ఆ విషయాన్నీ ప్రస్తావించడమంటేనే తన మీద ఏదో రాజకీయ వత్తిడి ఉందని చెప్పకనే చెప్పినట్టయింది. దానికి తోడు మరుసటి రోజు అమిత్ షా ప్రోగ్రాంలో కూడా భారీ మార్పులు చోటుచేసుకోవడంతో ''సంథింగ్ హ్యాపెనింగ్'' అనే చర్చకు తెరలేచింది. ఇది ఇలా ఉంటే భారత్ బంద్కు మద్దతు ఇచ్చిన రోజే మోడీని పొగుడుతూ లేఖ రాయడం, ఆ వెంటనే ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలను ఏకాంతంగా కలసి మంతనాలు జరపడం చూస్తుంటే కేసీఆర్ మీద బలమైన వత్తిడి ఉందనే అర్థం అవుతున్నది. మరోవైపు కేసీఆర్ హైదరాబాద్ చేరుకోగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఢిల్లీ వెళ్లి వారి జాతీయ నాయకత్వాన్ని కలిసి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ను పదునైన పదాలతో విమర్శించాడు. వంగి,వంగి దండాలు పెట్టినా, పొరలి పొర్లి పొర్లి దండాలు పెట్టినా జైలుకి వెళ్లడం ఖాయం అని మాట్లాడాడు. దీనితో అనేక అనుమానాలు వస్తున్నాయి. కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేసి మోడీ, అమిత్ షా ద్వయం లొంగతీసుకుందనే చర్చకు తెరలేచింది. ఏది ఏమైనా ఇది మంచి పరిణామమైతే కాదు. కేసీఆర్ తాను చేసిన తప్పులకు తెలంగాణను బీజేపీ చేతిలో పెట్టడం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ మొదటి నుంచీ పోరాటాలకు, వామపక్ష, సెక్యులర్, డెమోక్రటిక్ రాజకీయాలకు కేంద్రంగా ఉంటూ వస్తున్నది. అలాంటి తెలంగాణ మతతత్వ శక్తుల చేతిలోకి వెళ్ళడానికి కేసీఆర్ పరోక్ష సహకారాన్ని అందించడం దురదష్టకరం. తక్షణమే వామపక్ష, సెక్యులర్, డెమోక్రాటిక్, దళిత, ఆదివాసీ పోరాట శక్తులు ఏకమైయి బీజేపీ, టీఆరెస్, ఎంఐఎంల రహస్య ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాల ఖిల్లా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
- ఎం. సృజన
సెల్: 8919904508