Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా నేపథ్యంలో మార్చి16 నుంచి రాష్ట్రంలోని అన్నిపాఠశాలలకు కేంద్రప్రభుత్వ సూచనలమేరకు సెలవులను ప్రకటించడం జరిగింది. 2019 - 20 అకాడమిక్ సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకుండా, వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పదవతరగతి వరకు అన్నితరగతుల విద్యార్థులను ప్రమోట్ చేయడం జరిగింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళకుండా ఆగిపోయి దాదాపు తొమ్మిదిన్నర నెలలు కావస్తున్నది. 2020 - 21 విద్యా సంవత్సరం జూన్2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణచేసి ప్రారంభించడం లేదా జూన్12 నుంచి ప్రభుత్వం అధికారికంగా తరగతులను నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు పాఠశాలల తలుపులు తెరుచుకోకపోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక విద్యాసంవత్సరం సంపూర్ణంగా నిర్వహించాలంటే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం దాదాపు 220 రోజుల పనిదినాలు ఉండాలి. కానీ ఈవిద్యాసంవత్సరం సంగతేంటో అర్థం కానిపరిస్థితి.
రాష్ట్రంలో మొత్తం 40597 పాఠశాలలో 58లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో 22లక్షల మంది విద్యార్థులు 26వేల ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా, 31లక్షలమంది విద్యార్థులు 10549 ప్రయివేటు పాఠశాలలో మిగిలిన విద్యార్థులు ప్రభుత్వ గురుకులాలు, సెంట్రల్ గవర్నమెంటు పాఠశాలలో చదువును కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం సెప్టెంబర్ 1నుంచి డిజిటల్ పాఠాలను విద్యాశాఖ దూరదర్శన్ యాదగిరి, టీశాట్, నిపుణ చానల్స్ ద్వారా 3 నుంచి10 తరగతుల వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 80 నుంచి 95శాతం వరకు విద్యార్థులు హాజరవుతున్నారని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఎలాంటి అధికారిక గణాంకాలు లేవు. ఎంతమంది విద్యార్థులు ఆసమయంలో టీవీ ముందు కూర్చున్నారు? ఎంతమంది విద్యార్థులకు అర్థమవుతుంది? ఏమైనా అనుమానాలు వస్తే ఎలా నివత్తి చేసుకుంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలేవి లేవు. 9, 10 తరగతుల విద్యార్థులు డిజిటల్ తరగతులలో ఏమైనా డౌట్స్ వస్తే వారి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు వెళ్లి నివత్తి చేసుకోవచ్చన్న సూచనలను రాష్ట్రప్రభుత్వం అమలుపరచడం లేదన్నవిషయం తెలిసిందే. అయినా డిజిటల్ తరగతుల ద్వారా కేవలం 2, 3 సబ్జెక్టులను ప్రతిరోజు 2, 3 పీరియడ్లలో బోధించడం జరుగుతున్నది.
10549 ప్రయివేటు పాఠశాలలు ఉంటటే అందులో సగం పాఠశాలలోనే ఆన్లైన్ క్లాసెస్ జరగడం మూలంగా 15లక్షల మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నట్లు, వారిలో 9, 10 తరగతుల విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా,ఎక్కువశాతం విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థంకావటంలేదనీ తెలుస్తున్నది. ఇదిలాఉంటే కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలుచేస్తూ ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ విద్యార్థులు వారి యొక్క ఆర్థికస్తోమతను బట్టి కొంతమంది డబ్బులు కట్టి ఆన్లైన్ తరగతులకు హాజరుకాగా, మరికొంతమంది డబ్బులు కట్టలేక, స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్ అందుబాటులో లేక తరగతులకు గైర్హాజరు కావడం, ఇంకొంతమంది విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు విన్నా అర్థంకాక, వారి డౌట్స్ నివత్తి చేసుకోలేక పోతున్నారన్న విషయం అందరికీతెలిసిందే. ఇలా పలురకాలుగా విద్యార్థులు ఉన్నప్పుడు, ఈ విద్యా సంవత్సరాన్ని ఎలాముగిస్తారో అర్థంకాని పరిస్థితి తలెత్తిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రభుత్వం ఒకవేళ ధైర్యంచేసి పాఠశాల లను తెరిచినా అతితక్కువ పనిదినాలలో, తగ్గించిన సిలబస్ పూర్తిచేయగలదా? ప్రస్తుతం కరోనా 2 వేవ్ వీస్తుందంటున్నారు. ఈసమయంలో ప్రభుత్వం తెరిచే సాహసం చేస్తుందా? కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువ శాతంలో ఫీజులుకట్టి ఆన్లైన్ తరగతులు వింటున్నారు. అలాగే ప్రభుత్వం సైతం టెలివిజన్ ద్వారా తరగతులు నిర్వహిస్తుండగా, వీటినే ప్రామాణికంగా తీసుకుని ఈవిద్యాసంవత్సరాన్ని ప్రమోట్ చేస్తే, తరగతులు వినని విద్యార్థుల సంగతేంటి? ఏం చదవకుండానే పైతరగతులకు వెళితే అసలుకే ఇబ్బందిరాదా? అలాఅని ఈవిద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్గా ప్రకటిస్తే, ఫీజులు కట్టిన విద్యార్థుల భవితవ్యం ఏమిటి? అనే పలుప్రశ్నలు ఉత్పన్న మవు తున్నాయనడంలో నిజంలేకపోలేదు.
తరగతిగదిలో విద్యార్థులు హాజరై, ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా బోధించినప్పుడే అర్థంకాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆన్లైన్ తరగతులు ద్వారా ఫలితం వస్తుందనుకోవడం తప్పే అవుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు సిలబస్ను తగ్గించి, సెలవులను సైతం పనిదినాలుగా మార్చి తరగతులను నిర్వహించే అవకాశం ఏమన్నా ఉన్నదా? అనే విషయా లపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికేంద్రీకరించి, పలువురు నిపుణులచే చర్చించి, అందరికీ ఆమోదంయోగ్యమైన నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారమార్గం దొరకాలని ఆశిద్దాం.
- డా|| పోలం సైదులు
సెల్: 9441930361