Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం పాఠశాలలు తెరవకుండానే సగం ముగిసింది. మిగిలిన నెలల కోసమైనా తరగతులు ప్రారంభిస్తారా.. అన్నది పెద్ద సందేహంగా మారింది. ఉపాధ్యాయులను తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభం గురించి తరచూ సందేహాలు అడుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తొలుత తొమ్మిది, పది తరగతులను ప్రారంభించి, తర్వాత క్రమంలో మిగిలిన తరగతులను ప్రారంభించు కోవచ్చు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఆయా తరగతుల సిలబస్, డిజిటల్ పాఠాల కొనసాగింపు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వేసవి సెలవులు ఎలా ఉండాలో ఎస్సిఈఆర్టీ పరిశోధించి మార్గదర్శకాలు తయారు చేయాలి. రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి అనే సంస్థ ఒకటుందని, అందులో ప్రొఫెసర్లు ఉంటారని చాలా మందికి తెలియనే తెలియదు. వాళ్ళు కోవిడ్ విద్యా సంవత్సరం ఎలా ఉండాలో, నవోదయ తదితర ప్రవేశ పరీక్షల విధానం ఎలా ఉంటుందో తదితరాల గురించి వివరాలు తెలియజేయాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సిలబస్ తగ్గిస్తే ప్రవేశపరీక్షల్లో ఎలాంటి మార్పులు చేపడతారు, విద్యా సంవత్సరం జీరో ఇయర్ అవుతుందా అనే సందేహాలు తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. విద్యార్థుల చదువులకు ఆటంకం జరిగిందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆయా తరగతులకు సంబంధించి విద్యార్థులు ఇంట్లో ఏవిధంగా చదువులు కొనసాగించాలి, విద్యా సంవత్సరం ముగింపు, తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎలా ఉండాలో ఎస్సీఈఆర్టీ ప్రకటించాలి. దానికనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో డిజిటల్ పాఠాల సహకారంతో తమ చదువులను కొనసాగించే అవకాశముంది. - గూడూరు అశోక్, జగిల్యాలజిల్లా.