Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికలకు 15రోజులుంద నగా ఆర్టీసీ యాజమాన్యం కోరుట్లలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని అకస్మాత్తుగా బస్ భవన్కు ట్రాన్స్ఫర్పై తీసుకొచ్చింది. ఆర్డర్ వచ్చిన కొన్ని గంటలలోనే సదరు ఉద్యోగి బస్భవన్లో డ్యూటీకి రిపోర్టు చేసి, జీహెచ్ఎంసీ ఎన్నికల క్యాంపెయిన్లో పాలక పార్టీకి ఓట్లు సంపాదించేందుకు నగరంలో మీటింగ్లు నిర్వహించే పనిలోకి వెళ్ళారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆ నేతతో పాటు నగర డిపోలలో తాను సూచించిన వారికి డ్యూటీలు చేయాలని ఒత్తిడి చేయవద్దని, ప్రభుత్వంలో పెద్దల నుంచి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలందాయని సమాచారం. ఇదే విషయం ప్రముఖ దినపత్రికలో కూడా వార్త రూపంలో వచ్చింది. కరీంనగర్లో మరో నాయకుడుకు అకస్మాత్తుగా అవుటాప్ డిజిగేషన్లో ఒక మంత్రి పేషిలో పీఆర్ఓగా నియమించారు. పీఆర్ఓగా నియమించబడ్డ నాయకుడి (కండక్టర్)పై వేములవాడ డిపో కార్మికులు కంప్లైంట్ చేశారని, దానిపైన చర్యకు కూడా యాజమాన్యం సిద్ధపడుతున్న దశలో, మంత్రి పేషిలో పీఆర్ఓగా నియమించడం ఏమిటి అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించడం లేదు. మరోవైపున కార్మికుల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. పరిష్కారం కనుచూపు మేరలో కనపబడటం లేదు. అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమం ద్వారా కార్మికులు వారి మధ్య ఈ బాధలను షేర్ చేసుకొంటే, నువ్వు ప్రభుత్వానికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశావంటూ, కొంతమందిని సస్పెన్షన్కు గురి చేస్తున్నది యాజమాన్యం. ఆర్టీసీ రెగ్యులేషన్స్ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగి ఏపార్టీ కార్యకలాపాలలో పాల్గొనకూడదు. కానీ ఇప్పుడు మంత్రి పేషిలో పీఆర్ఓగా నియమించిన వ్యక్తి గతంలో బహిరంగంగా టీఆర్ఎస్ కండువా కప్పుకొని వేదికలు ఎక్కిన వ్యక్తి. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కొద్దిమంది నాయకులు నగర డిపోలలో గేట్ల వద్ద మీటింగ్లు పెట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికలలో పాలక పార్టీకి ఓట్లు వేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం కార్మికులకు చెప్పమని ప్రభుత్వ పెద్దలే మాకు చెప్పారని కూడా వారు చెప్పారు. ఆర్టీసీ కోసం తపిస్తూ పని చేస్తున్న కార్మికులు, తమ గుండె నిండా ఉన్న బాధను సామాజిక మాధ్యమంలో పంచుకొంటే అది తప్పని, వారిపై చర్యలు తీసుకుంటున్న యాజమాన్యం, ఆర్టీసీలో నియమ నిబంధనలను అతిక్రమిస్తున్న వారిని సమర్థిస్తూ, వారు కోరుకున్న స్థానాలలో పోస్టింగ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారనీ, ఇది ఎలా న్యాయమనీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మిక సంఘాలే కారణమంటూ, తమను ఆదుకొనే కార్మిక సంఘాలను అనుమతించకపోవడం అన్యాయమనీ, మరోప్రక్కన కొంతమందిని ప్రోత్సహించడంలోని అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీలో కార్మిక సంఘ కార్యకలాపాలను అనుమతించాలని, సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుల సాకుతో వేధింపులు ఆపాలనీ, పక్షపాతంతో కొంతమందిని మాత్రమే ప్రోత్సహించి కార్మిక సంఘాలలో చీలికలు తీసుకువచ్చే ప్రయత్నాలు మానుకోవాలని కోరుకుంటున్నారు.
- పుష్పరాణి, హైదరాబాద్