Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 కల్లోలపు వార్తలతో ఆరంభమైన 2020 మరో నాలుగురోజుల్లో ముగిసిపోతుంది. కానీ కరోనా భయం తొలగలేదు. వ్యాక్సిన్ రాలేదు. వచ్చిందని చెబుతున్న వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్కు గురిచేస్తున్న వార్తలు భయకంపితుల్ని చేస్తున్నాయి. అందరూ సురక్షితంగా ఉండే పరిస్థితులు నెలకొనేవరకు ఎవరూ క్షేమంగా ఉన్నట్టు కాదని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్యసంస్థే చెబుతున్నది. వ్యాక్సిన్ రావడం ఒక్కటే పరిష్కారం కాదు, కరోనా వైరస్ సోకినవారికి చక్కని ఆరోగ్యసేవలు అందడం ముఖ్యం. కానీ 'అందరికీ ఆరోగ్యం'లానే ఇది కలగా మారడం ఒక వాస్తవం. ఆదాయం, విద్య, వృత్తి, జాతి, లింగవివక్ష వంటి తేడాలు చూపకుండా అందరికీ సమాన ఆరోగ్యసేవలు అందించడం ఆయా దేశాల బాధ్యత అని ప్రపంచ ఆరోగ్యసంస్థ విస్పష్టంగా పలికింది. కానీ 2020లో వైద్య ఆరోగ్యసేవలు ఎంత ఖరీదయిన వ్యవహారంగా పరిణమించాయో తెలిసిందే.
వైద్యరంగాన్ని కార్పొరేట్శక్తుల్నించి విముక్తి చేయకుండా అందరికీ సమానమైన ఆరోగ్యసేవలు అందించడం సాధ్యం కాదు. కరోనా కల్లోల కాలంలో ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రుల పరమ దుర్మార్గమైన దోపిడీ ఎందరి బతుకుల్నో ఛిద్రం చేసింది. సర్కారు ఆస్పత్రుల ద్వారా కరోనా బాధితులకు సేవలు అందిస్తామన్న మాట వట్టిమాటగా మిగలడమూ చూసాం. కరోనా వ్యాక్సిన్ పేరుతో చేస్తున్న రాజకీయాలు, కోట్లకు పడగలెత్తాలనే కార్పొరేట్ల కుటిల వాణిజ్య వ్యూహాలు వికృతరూపం దాల్చాయి. నిజానిజాల్ని చెప్పకుండా కరోనా గురించి ప్రచారంలో పెట్టే వార్తలు లేని భయాల్ని కల్పిస్తున్నాయి. మనుషుల్లోని ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భరోసాగా నిలవాల్సిన వ్యవస్థలు మనుషుల్ని భీతావహుల్ని చేస్తున్నాయి.
ఈ ఏడాది మార్చి 20 తరువాత మొదలయిన కరోనా కల్పిత భయాందోళనల్నించి విముక్తి లభించలేదు. లాక్డౌన్తో మొదలయిన ఇక్కట్లు అనేకరెట్లు పెరిగి బతుకుల్ని చిద్రుపలు చేశాయి. ఆసరా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు మాటలతోనే సరిపెట్టాయి. కీలకమైన ఆరోగ్య సంక్షోభం కార్పొరేట్లకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించి పెట్టింది. ఈ ఏడాది ఈ దేశంలోని కొద్దిమంది తప్ప కోట్ల మంది మనో వ్యాకులతతో తల్లడిల్లారు. బతుకు రుజాగ్రస్థమై అల్లాడిపోయారు. ఏడాది చివరలో గడచిపోయిన రోజుల్ని అవలోకిస్తే విషాదమే తప్ప ఆశావహరేఖ ఒక్కటీ కనిపించడం లేదు.
ప్రపంచాన్ని కుదిపేసిన మహా సంక్షోభం మనుషుల్ని ఏకం చేయాలి. మానవుల్లో వివేచనకు దారులు తీయాలి. ఇందుకు విరుద్ధంగా కొంతమంది పేరాశలు ప్రపంచ గమనాన్ని నిర్దేశించే రీతిన కొనసాగడం మానవాళికి విఘాతం. ఎల్లెడలా నిరంకుశత్వపు, అప్రజాస్వామికపు పోకడలు జనం బతుకుల్ని కన్నీటిమయం చేయడం 2020లోని క్రూర వాస్తవం. మనదేశంలో నెలరోజుల తరబడి గడ్డకట్టే చలికి తట్టుకుంటూ ఆందోళన చేస్తున్న రైతులపైన కనీస కనికరం చూపని సర్కారు ధోరణి అత్యంత పాశవికం! కార్పొరేట్లకు దయ, ఆర్ద్రత ఉంటాయని ఎవరయినా అనుకుంటే పొరపాటని నిరూపించిన సంవత్సరమిది.
ఏడాది పొడుగునా గడచిన కాలపు అడుగుజాడల్ని తరచిచూస్తే నియంతలే ధరాధిపతులై రాజ్యం చేసే చోట నిత్యం శ్రమతో లోకాన్ని వెలిగించే వారికి ఏ భరోసా లభించదని తెలిసిపోయింది. కోట్ల మంది వలస కార్మికులకు అండగా నిలిచే ఔదార్యం, నిబద్ధత, బాధ్యత ఈ వ్యవస్థకు లేదని రూఢ అయింది. భారీ ప్రాజెక్టుల, బహుళ అంతస్థుల నిర్మాణాలకు చెమటొడ్చేవారిని 'అభివృద్ధి' దాహపు బేహారులు చిన్నచూపు చూస్తారని తెలిసిపోయింది. తరాలు తిన్నా తరగని ఆస్తులు కూడబెట్టడం కోసం పాకులాడే బిలియనీయర్ల దుర్మార్గం అంతం కానిదే మనుషులు మనుషులుగా మనలేరని బోధపడింది. ఈ వివేచన ఇచ్చిన వెలుగుదారుల్లో శ్రమించేవారంతా ఏకం కావడం అవసరమని తేటతెల్లం చేసింది.
రెక్కలు ముక్కలు చేసుకునేవారి కోసం ఎవరూ రారు. వారిని ఎవరూ ఉద్ధరించరు. ఏ శాసనాలు, ప్రభుత్వాలు వారి క్షేమం కోసం నిర్మితం కావు. వారి శ్రమకి తగినరీతిన విలువకట్టే మాననీయులు, మానవతా దీప్తితో వెలుగొందే మూర్తులు ఇక్కడ ఎవరూ లేరు. సకల కళలు, సారస్వతాలు ఏలినవారి కీర్తిచంద్రికల్ని లెక్కించేందుకు తాకట్టు పడటం ఈ కాలపు వాస్తవం. మీడియా, సోషల్మీడియా ఏదైతేనేం శ్రమని శిరోధార్యంగా తలపోసేవారి పక్షాన లేవన్నది మరింత నిజం. కరోనా కాలపు పెను సంక్షోభం కండ్లు తెరిపించింది. ఎవరు ఎటు వైపు నిలబడ్డారో స్పష్టంగా చూపింది. ఏ మాటల వెనుక ఉన్న మతలబు ఏమిటో సాక్షాత్కారింపజేసింది. స్వార్థమే పరమార్థంగా బతకనేర్చిన మనుషుల యవ్వారానికి అసలు మూలాలు ఎక్కడున్నాయో చెప్పకనే చెప్పింది.
అనేకానేక రంగాలలో సరికొత్త తలపోతలకు ప్రేరణగా నిలిచిన 2020 ఈ కొత్త శతాబ్దిలో, మిలీనియంలో వైవిధ్యమైన ఏడాదిగా నిలిచిపోతుంది. ప్రపంచం ఎంత వైజ్ఞానికంగా ఎదిగినా మార్కెట్శక్తుల క్రౌర్యం అంత సులువుగా అంతరించదని అర్థం చేయించింది. ఈ లోకాన్ని సుభిక్షం చేసేందుకు ప్రతితరం తనదయిన ప్రయత్నాలు చేస్తుంటుంది. అదే సమయాన ధనస్వాములు బతుకుని సంక్షుభితం చేసే చర్యల్ని అంత త్వరగా విడనాడరు. వారి పన్నాగాల్ని వివేచనతో, విజ్ఞతతో ఛేదించే శక్తులు మరింత బలోపేతం కావాలి. మానవాళి శ్రేయస్సుని ఆకాంక్షించేవారు సంఘటితమవ్వాలి. 2020పైన మన విశ్లేషణలు, ఆలోచనలు, అవలోకనాలు ఇందుకు అనువుగా సాగాలి. ఆగామి కాలానికి కొత్త యోచనలతో స్వాగతం పలకాలి.