Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె పేరు వినబడితే చాలు వేలవేల శాంతి కపోతాలు ఆకాశంలో ఎగురుతూ నక్షత్రాలను తాకుతాయి. ఆమె గొంతు వినబడితే చాలు భారతమాత సైతం ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతుంది. జాతీయ జెండా సైతం ఆమె కీర్తికిరీటాల్ని వినువీధుల్లో ఎగుర వేస్తుంది. ఇలా చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఈమె ఆడపిల్లల చదువు కోసం ఎంతో తపించి అవమానాలను సైతం భరించింది. అట్టడుగు వర్గాల మహిళల అభ్యున్నతి కోసం జీవిత కాలమంతా అలుపెరుగని పోరాటం చేసిన ఆ ధీరవనితే ఉత్తమ ఉపాధ్యాయురాలు, ఆదర్శ మహిళ, భారతమాత ముద్దుబిడ్డ అమ్మ సావిత్రిబాయి ఫూలే. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళాలోకానికే వన్నెతెచ్చిన మానవత్వం మూర్తీభవించిన ఆదర్శ మహిళ. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా తాలూకాలోని నైగావ్ గ్రామంలో ఖండోజి నవ్ సె పాటిల్, లక్ష్మీబాయి దంపతుల ఇంట జన్మించింది.
సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో చక్కని ప్రేమపూర్వక బంధుత్వం ఉంది. సావిత్రిబాయి తన తొమ్మిదవ యేటనే 12 సంవత్సరాల వయసున్న జ్యోతిరావు ఫూలేను 1840లో వివాహం చేసుకున్నారు. దళిత వైతాళికుడు, అణగారిన వర్గాలకు దిక్సూచిగా నిలిచిన భర్త జ్యోతిరావు పూలే ప్రోద్భలంతో 1841లో విద్యాభ్యాసం ప్రారంభించారు. అందుకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ధైర్యంగా నిలబడడమే కాక భర్త మొదలుపెట్టిన సాంఘిక విద్యాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషించారు.
సమాజంలో మార్పు రావాలంటే క్రింది స్థాయి నుంచి ప్రయత్నాలు జరగాలి అనే పట్టుదలతో వీరు 1948 జనవరి 1న బుధవార పేటలో అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గాల ఆడపిల్లల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. ఇందుకోసం ఆమె క్రమంగా విద్యావంతురాలై అహ్మద్నగర్లో ఉపాధ్యాయు రాలిగా శిక్షణపొందారు. దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయసు 18 సంవత్సరాలు. అందరికీ విద్య అనే భావనతో చదువును మహర్వాడకు ఇంకా చెప్పాలంటే వారి ఇండ్ల దగ్గరికి తీసుకువెళ్ళారు.
సావిత్రిబాయి మహరుల బాలికలకు టీచరుగా పాఠాలు చెప్పేది. అణగారిన వర్గాల వారి కోసం ప్రారంభించిన మొట్టమొదటి పాఠశాల ఇదే. ఇది గిట్టని వారితో అనేక అవమానాలు, చిత్కారాలకు తోడు దాడులు ఎదురవడంలో అక్కడి నుండి వచ్చేశారు. కొన్నాళ్ల తర్వాత కాయకష్టం చేసుకుని నిలదొక్కుకొని మళ్లీ పాఠశాలను ప్రారంభించారు. ఈ లోపు మళ్ళీ కేశన సీతారాం, భావల్కర్ అనే ఉపాధ్యాయుల వద్ద ఉపాధ్యాయ వృత్తిలో శిక్షణ పొంది మరింత నైపుణ్యం సాధించారు ఆమె.
భర్త జ్యోతిరావ్ ప్రారంభించిన మొట్టమొదటి పాఠశాలకు తన పూర్తి సహాయ సహకారాలను అందించారు. 1876 -'77 మధ్యకాలంలో మహారాష్ట్రలో అత్యధికంగా 50 పాఠశాలలను ప్రారంభించి రికార్డు సృష్టించారు. మహిళల హక్కులే మానవ హక్కులని నినదించారు. స్త్రీలని చైతన్య పరచడానికి 1852లో ''మహిళా సేవా'' అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. ఇలా సామాజిక కార్యకర్తగా, భర్తకు జీవిత సహచరిగా నిత్య చైతన్యంతో పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. ముఖ్యంగా అగ్రకులాల వితంతువులు మోసాలకు గురై గర్భవతులైనప్పుడు వారిని అక్కున చేర్చుకున్నారు. వారికి ఆశ్రయం ఇవ్వడానికి సావిత్రిబాయి భర్తతో కలిసి 1863లో ఒక శరణాలయాన్ని స్థాపించారు. వారికి పురుళ్ళు కూడా పోశారు. అలా పురుడుపోసుకున్న ఒక వితంతువు కొడుకును దత్తత తీసుకొని పెంచుకున్నారు. వీరికి పిల్లలు లేరు, ఆ పిల్లవాడికి యశ్వంత్గా నామకరణం చేసి వారసునిగా ప్రకటించారు.
అక్షరాలు నేర్చుకుంటే కాని జీవితం అర్థం కాదని గ్రహించిన ఈమె స్త్రీలలో ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు. నిరాదరణకు గురైన బాలికలను చేరదీసి వారికోసం ''సత్య శోదక్'' అనే సమాజాన్ని ప్రారంభించి వారికి కొత్త జీవితాన్ని అందించే ప్రయత్నం చేశారు. బాల్య వివాహాలను, మూఢనమ్మకాలను, సతీ సహగమనాన్ని వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాల కొరకు ఆనాటి వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమమే నడిపారు. ఈ సంస్థ ద్వారా వితంతు పునర్వివాహాలు పురోహితుడు లేకుండా వారే స్వయంగా నిర్వహించేవారు. ఈ క్రమంలోనే 1856 జూలై 25న వితంతు పునర్వివాహాలను అనుమతినిచ్చే చట్టాలను రూపొందించేందుకు ప్రభుత్వం కూడా ముందుకు రావడం విశేషం. రాత్రి పాఠశాలలను ప్రారంభించి వయోజనులలో విద్యావ్యాప్తికి కృషి చేశారు. ఈమె ఓ గొప్ప సాహితీ సజనకారిణి. సమాజానికి ఆదర్శంగా ఉండే ఎన్నో కవితలు రాసి ప్రజల్లో చైతన్యం నింపారు. 1854లో ఆమె తన మొదటి కవితా సంపుటి ''కావ్య పూలే''ను ప్రచురించారు. అలాగే తన ఉపన్యాసాలను కూడా పుస్తక రూపంలో తెచ్చి రచయిత్రిగా అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఆమె భర్త జ్యోతిరావ్ పూలే 1890 నవంబరు 28న మరణించడంతో ఆమె దుఃఖసాగరంలో మునిగి పోయారు. ఈ దుఃఖం నుంచి మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. భర్త చితికి తానే నిప్పు పెట్టి మరో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భారత దేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన కూడా ఇదే.
భర్త మరణానంతరం కూడా ఆమె బాధ్యతగానే సమాజానికి అత్యున్నతమైన సేవలను అందించారు. 1897లో ప్లేగు వ్యాధి నగరానికి వ్యాపించింది. పూణే నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా భయంతో దగ్గర్లోని అడవుల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. సావిత్రిబాయి మాత్రం మానవతా దృక్పథంతో ఆలోచించి కొడుకు యశ్వంత్తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులానికి చెందిన చిన్నపిల్లల్ని చంకలో వేసుకుని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధి ఆమెకు సోకి 1897 మార్చి 10న ఆమె మరణించారు. ఆమె గౌరవార్థం ఇండియన్ గవర్నమెంట్ ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. అలాగే పూణే యూనివర్సిటీనీ ''సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ'' గా మార్చి ఆమె మీద ఉన్న గౌరవాన్ని చాటుకుంది. ఈ మహిళా రత్నానికి జేజేలు అర్పిస్తూ ఆమె చూపిన బాటలో నడుస్తూ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవడం ఈ సంఘ సంస్కర్త, ఉత్తమ విద్యా ప్రధాతకు మనమంతా ఇచ్చే ఘనమైన నివాళి.
- పి. భాగ్యలక్ష్మి
సెల్: 9704725609