Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరిలాగే సామాన్య కుటుంబంలో జన్మించింది.
నాటి సామాజిక స్థితికి అనుగుణంగా బాల్య వివాహం జరిగింది.
భర్త ప్రోత్సాహంతో చదువుకుంది. ఒక్కోమెట్టు ఎదిగింది.
రాజకీయ అవగాహనతో చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొంది.
సాయుధపోరాటంలో పాల్గొని తుపాకీ పట్టింది.
రజాకార్లతో, నిజాం పోలీసులతో పోరాటంలో ప్రత్యక్షంగా తలపడింది.
శాసన సభ్యురాలై ప్రజాసమస్యల్ని పరిష్కరించింది.
తెలంగాణ జనం గుండెల్లో చిరస్మరణీయురాలైంది.
ఇన్ని విశిష్టతలున్న ఆ తెలంగాణ మహిళాతేజం ఆరుట్ల కమలాదేవి.
ఆరుట్ల కమలాదేవి నేటి యాదిద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో పుట్టింది. మధ్యతరగతి రైతుకుటుంబం వారిది. అది నిజాం పాలనలో పౌరహక్కులకు స్వేచ్ఛ లేని కాలం. సనాతన ఆచారాలు, మూఢవిశ్వాసాలు, కులమతతత్వం, అంటరానితనం వ్యవస్థని శాసిస్తున్న రోజులవి. పల్లెటూర్లలో పాఠశాలలు ఉండేవి కావు. ఆ రోజులలో ఆడపిల్లలకి చదువులు ఊహించడం కూడా తప్పే. అందువల్ల కమలాదేవి బాల్యం ఇంటికే పరిమితమయ్యింది.
ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేయడం ఆచారంగా ఉండేది. ఆమెకు 11 సంవత్సరాల వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్ళిచేయాలని నిశ్చయించారు. పుట్టినపుడే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డి బార్య అవుతుందని రెండు కుటుంబాలు నిశ్చయించుకున్నవి. అప్పటికే ఆరుట్ల రామచంద్రారెడ్డి హైదరాబాదులో విద్యార్థిగా, రెడ్డి వసతిగృహంలో ఉంటూ ఆంధ్రమహాసభ సభ్యడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు పొందాడు. తల్లిదండ్రులు పెళ్ళి ప్రస్తావన తేగానే బాలికగా ఉన్న రుక్ష్మిణికి అప్పుడే పెళ్ళెందుకన్నాడు. కొన్ని షరతులతో పెళ్ళికి అంగీకరించాడు. ''పెళ్ళి సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆదర్శ వివాహం జరగాలి. కట్నకానుకుల పద్ధతి ఉండకూడదు. పెళ్ళయిన తరువాత తన సహచరిగా రాజకీయాలలో పాల్గొనాలి.'' అన్నాడు రామచంద్రారెడ్డి. ఇరు కుటుంబాలవారు షరతులు ఒప్పుకున్నారు. వివాహం జరిగింది. కమలాదేవిని తీసుకొని రామచంద్రారెడ్డి హైదరాబాద్ చేరాడు.
రామచంద్రారెడ్డి కమలాదేవిని చదివించాలని అనుకున్నాడు. కమలాదేవి ఈ వార్త విని ఎంతగానో సంతోషించింది. మాడపాటి హన్మంతరావు నెలకొల్పిన బాలికల పాఠశాలలో చేరింది. ఎక్కడ ఉండాలన్నది సమస్య. దంపతులిద్దరూ రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డిగారిని కలిసి బాలికలకు హాస్టల్ ఏర్పాటుచేయాలని కోరారు. దానికి వారు సరేనని బాలికల హాస్టల్ ఏర్పాటు చేశారు. ఆ బాలికల హాస్టల్లో కమలాదేవి ప్రథమ విద్యార్థిగా ప్రవేశించింది. పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తిచేసింది. విద్యతోపాటు రాజకీయాలూ అర్థంచేసుకుంది. మహిళా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నది. అప్పుడు తెలంగాణలో నిజాం రాచరిక పాలన ఉండేది. సంస్థానాధీశులు, దేశ్ముఖ్లు లక్షల ఎకరాల భూమిని తమ ఆధీనంలో ఉంచుకునేవారు. భూస్వాములు, గ్రామీణ పెత్తందార్ల కింద గ్రామ ప్రజలు, రైతులు అన్ని కులాలవారు అణిగి ఉండాల్సిందే. వెట్టిచాకిరి పేరుతో ప్రతిఫలం లేకుండా భూస్వాముల ఇండ్లలో పనిచేయాలి. తిరగబడితే దండన. ఇంటిలో పెంచుకున్న కోడినో, కుక్కనో చంపినట్టుగా పేదలను చంపినా అడిగేవారు లేరు. చట్టం లేదు. తెలుగుభాషలో చదువుకునే అవకాశాలు లేవు. పాఠశాలలు, గ్రంథాలయాల స్థాపనకు అడ్డంకులుండేవి. ఇట్లాంటి గోసను కమలాదేవి సహించలేక పోయింది. ఇదే ఆమెలో ఉద్యమభావాలకు ప్రాణం పోసింది. 1944లో పుట్టిన కొడుకుకు 'విప్లవం' అని పేరు పెట్టింది. పురిటిబిడ్డను చుట్టాల దగ్గర వదిలేసి కమలాదేవి ఉద్యమ కదనరంగానికి కదిలింది.
కమలాదేవి జాతీయ భావాలతో ఎదుగుతూ, తనలాగే తన ఊరి జనులు చదువుకోవాలని ఆకాంక్షించింది. తన భర్త ఊరైన కొలనుపాకలో పాఠశాల స్థాపించాలని అనుకున్నది. అప్పడు ఊరిలో బడిలేదు. అది జాగీర్ గ్రామం. బడిపెట్టాలన్నా, గ్రంథాలయం నడపాలన్నా ఆంక్షలు ఉండేవి. వంటశాల పేరుతో తలుపులూ, కిటికీలూ లేని స్థలంలో విద్యార్థులను పోగుచేసి కమలాదేవి బడిని, గ్రంథాలయాన్ని నడిపింది. కొంతకాలానికి ఈ విషయం జాగీర్దారులకు తెలిసిపోయింది. వారు ఈ కేంద్రాన్ని మూసివేయించారు. కొలనుపాకలో పురాతన జైన దేవాలయమున్నది. ఆ నిర్వాహికులనడిగి అక్కడ ఒక ఏడాదిపాటు బడి నడిపి గ్రామీణ వయోజనులను అక్షరాస్యులుగా మార్చింది. దానితోపాటు రానున్న మహాసంగ్రామానికి రైతుకూలీలను సమరోన్ముఖులను గావించింది.
ఆంధ్రమహాసభ ఒక ఉద్యమంగా రూపొందుతున్న సందర్భం. ఇటువంటి సమయంలో స్త్రీలకు ఆత్మరక్షణ అవసరమని భావించింది కమలాదేవి. కమ్యూనిస్టుపార్టీవారు నిర్వహించన ''మహిళా ఆత్మరక్షణ శిక్షణ శిబిరం''లో సైనిక శిక్షణ పొందింది. తుపాకి పట్టింది. భర్తతోపాటు తెలంగాణ సాయుధ సమరంలో అడుగుపెట్టింది. రజాకార్లతో, నిజాం పోలీసులతో జరిగిన ప్రతిఘటన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది. చల్లూరు గుట్టల్లో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అపరకాళికవలె విజృంభించింది. పరాక్రమాన్ని ప్రదర్శించింది. అమెరికన్ రైఫిల్తో శత్రువులను తిప్పికొడుతూ దళానికి నష్టం వాటిల్లకుండా కాపాడింది. ఈ పోరాటంలోనే జబ్బుపడింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నిజాం పోలీసులు కమలాదేవిని అరెస్టుచేశారు. వరంగల్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ మొదలైన జైళ్ళలో శిక్షలను భరించింది. ఇలాంటి వీరుల త్యాగాలతో, వేలాదిమంది బలిదానంతో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి చెందింది.
ఆ తరువాత ఆరుట్ల కమలాదేవి 1952 మొదటి సాధారణ ఎన్నికలలో ఆలేరునుండి అత్యధిక ఓట్ల మెజరిటీతో శాసనసభకు ఎన్ని కైంది. 1967 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆదరాభిమానాలు పొందింది. 1964లో శాసన సభలో ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది. స్వతంత్ర బారతదేశంలో రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రజల దైనందిన సమస్యలపై అసెంబ్లీ లోపల, బయట క్రియాశీలంగా పోరాడింది. పలు సమస్యలపై శాసనసభలో చర్చలు జరిగినప్పుడు వారి ప్రసంగంలో హుందాతనం, ఉన్నతభావాలు, ప్రజల సమస్యలపై అవగాహన, స్పష్టంగా కనిపించేది. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
కమలాదేవి కార్యశీలతలో తిరుగులేని నాయకత్వ లక్షణాలు అడుగడుగునా కనిపించేవి. ఆమె చూపులోను, నడుముకు కట్టిన కొంగులోను, కత్తిలాగ పట్టుకునే కలంలోనూ అవి కనిపించేవి. ఆమె ఎవ్వరితోనూ మహానాయకురాలిగా ప్రవర్తించలేదు. ఉన్నతాశయాలకోసం ఉత్తమ వ్యక్తిత్వంతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆరుట్ల కమలాదేవి జనవరి 1వ తేది 2001న ఈలోకం విడిచింది. కాని తెలంగాణ పల్లె తల్లుల చిరునవ్వుల్లో ఎప్పటికీ బతికే ఉంటుంది.
- తోట నగేష్
సెల్: 9912764580