Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగా ''మూడు వ్యవసాయ చట్టాల'' పేరుతో వచ్చిన వాటిలో ఇది మూడవది. ఇది 2020 జూన్ 5న ఆర్డినెన్స్గా అత్యవసరంగా తేబడి, తర్వాత సెప్టెంబర్ 27 నుండి చట్టంగా మారింది. ఇది 1955 నుండి అమలౌతున్న ''నిత్యావసర సరుకుల చట్టాని''కి ఒక సవరణ.
పాత చట్టం 'సెక్షన్ 3' లోని ఉప సెక్షన్ 1 కింద సింపుల్ గా మరో ఉప సెక్షన్-1 ఎ ( ఒక పేరాగ్రాఫ్) ను చేర్చారు.
అదేమిటంటే, ''(1ఎ) పైన (అంటే పాత ఉప సెక్షన్ 1లో) ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ (ఎ) ఆహార దినుసులు అంటే ధాన్యపు గింజలు, పప్పులు, ఆలు, ఉల్లిగడ్డలు, నూనె గింజలు, నూనెలు వంటి నిత్యావసర సరుకులు ప్రజలకు సరఫరా అయ్యే విషయంలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ అనేది (ఇక నుండి) కేవలం యుద్ధ సమయాలు, తీవ్రమైన కరువుకాటకాలు, అసాధారణ ధరల పెరుగుదల, తీవ్రమైన ప్రకతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో మాత్రమే ఉంటుంది''. (బి)వ్యవసాయ ఉత్పత్తుల (అంటే నిత్యావసర సరుకుల) నిలవ పరిమితి పైన ఏదేని చర్య లేదా నియంత్రణకు సంభందించిన ఆదేశం అనేది కేవలం క్రింది సందర్భాల్లో మాత్రమే ఇవ్వబడుతుంది.''
(1) ఉద్యాన వన పంటల (అంటే పండ్లు, కూరగాయలు, పూల) ధరలు రిటైల్ మార్కెట్లో గత సంవత్సరంతో పోల్చినప్పుడు నూరు శాతం దాటి పెరిగితే
(2) తోందరగా పాడవ్వని (అంటే బియ్యము, గోధుమలు, జొన్నలు, పప్పులు వంటి వాటి) ధరలు రిటైల్ మార్కెట్లో గత సంవత్సర లేదా అయిదు సంవత్సరాల సరాసరితో పోల్చినప్పుడు 50శాతం దాటి పెరిగితే మాత్రమే వాటిని నియంత్రించటం జరుగుతుంది''.
''నిల్వల నియంత్రణకు సంభందించిన పైన చెప్పిన కట్టుబాటు కూడా వారి, అంటే ఈ సరుకులు వినియోగదారునికి చేరే వరకు గల వివిధ భాగ స్వాముల యొక్క , నిల్వలు గతంలో వారు అనుమతి పొందిన స్టాక్ లిమిట్ కు లోబడి ఉన్నా , లేదా, బయటి దేశాలకు ఎగుమతి చేసే వాళ్ళు విదేశాల్లో ఈ సరుకులకు డిమాండ్ (ఆర్డర్ కూడా కాదు) ఉంది అని చెప్పినా వారిని నియంత్రించడం అనేది జరుగదు'' ఇదే కొత్త చట్టం. ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న పాత చట్టం వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుండి సేకరించాక వ్యాపారులు వాటిని బ్లాక్ చేసి, వినియోగ మార్కెట్ లో కత్రిమ కొరత సష్టించి, ధరలు పెంచి అమ్ముకోకుండా నివారించేది. ఇప్పుడు ఈ నియంత్రణను ఎత్తివేసి ఇది ''రైతులకు వరం'' అంటున్నారు కేంద్ర పరిపాలకులు. వారి మాటల్ని బట్టి చూస్తే ఇప్పటిదాకా రైతులు వారి ఉత్పత్తులను ఎంత కాలమైనా నిల్వ చేసుకుని, మార్కెట్లో ధరలు పెరిగాక అమ్ముకోవటానికి అవకాశం లేకుండింది, అలా వారు ఎంతో నష్ట పోయేవారు. ఇప్పుడు ఈ చట్టంతో రైతులు ఎంతైనా నిల్వ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి రైతులకిక పండగే పండగ అన్నట్టుంది. కానీ ఇప్పటిదాకా ఈ చట్టం, మధ్య దళారుల పైన్నే దాడి చేసిన విషయం, తమ ఉత్పత్తులు నిల్వ చేసుకోవటాన్ని నేరంగా చూడని విషయం రైతులకు అనుభవమే. అటువంటి చట్టాన్ని ఎత్తివేస్తే లాభం ఎవరికి అనేది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే సత్యం. కానీ మోదీ బందమెమో ''రైతులకే స్వేచ్ఛ కల్పించాం'' అంటున్నారు. రైతులను నమ్మించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
దేశంలో 65 శాతం మంది రైతులు ఒక హెక్టారు కంటే తక్కువ భూమి, 86 శాతం మంది రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి కలవారని, ఉత్పత్తులను నిల్వ చేసుకునే వసతులు వారికి వ్యక్తిగతంగా గానీ, సమిష్టిగా గానీ లేకపోవటంవల్ల, అలాగే, అంతకు మించిన ఆర్ధిక ఒత్తిళ్ల కారణంగా వారి ఉత్పత్తులను తక్షణమే అమ్ముకుంటున్నారనీ ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. రైతులు అలా గత్యంతరం లేక తక్షణమే అమ్ముకోకుండా, ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవడానికి వారి ఉత్పత్తులను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని వ్యక్తిగతంగా గానీ, సహకార పద్దతిలో గానీ పెంచే ప్రతిపాదనలు ఈ చట్టంలో లేవు. అటువంటప్పుడు రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎలా నిల్వ చేసుకోగలరు? ప్రాథమిక ఉత్పత్తులనే నిలవ చేసుకోలేని రైతులు వాటిని ప్రాసెస్ చేసి, వాటికి కూడా ధరలు పెరిగే వరకు నిల్వ ఉంచడం ఎలా చేయగలరు? ప్రభుత్వ అనుబంధ సంస్థలు, సహకార సంఘాలు ఈ పనులు చేయవచ్చు. కానీ పరిపాలకులు ఆ వైపు ఆలోచించటం లేదు.
వ్యాపార వర్గాలు, కంపెనీలు ఈ చట్టాలతో బాగా లాభాలు గడిస్తే రైతుల దగ్గర పంటలు కొనే సందర్భంలో మరింత ఎక్కువ రేటు పెట్టి కొనవచ్చనే మీ జోస్యాన్ని నమ్మాలన్నా కనీసం రైతుల ఉత్పత్తి ఖర్చుకు, శ్రమకు సరిపడా ధరలు (కనీస మద్దతు ధర) చెల్లించకుండా వారినుండి ఉత్పత్తులను సేకరించ కూడదనే నియమం ఆ చట్టంలో ఎందుకు పొందుపర్చలేక పోతున్నారు? రైతుల నిల్వ సామర్థ్యం పెంచరు, రైతు కష్టార్జితానికి మద్దతు ధరను చట్టంలో బాగం చేయరు. ఇంక, రైతులకు ఇందులో ఏం లాభం ఉంది, నష్టం తప్ప. కాబట్టి వాస్తవంగా, జరుగుతున్నది కళ్ళకు కనిపిస్తూనే ఉంది. కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం, ఓపెన్ మార్కెట్ చట్టాల ద్వారా నూటికి నూరుశాతం రైతులపై కి కార్పోరేట్ దళారులను ఎగబెట్టి సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవాలంటే అందుకు అడ్డుగా ఉన్న నిత్యావసర సరుకుల చట్టాన్ని మార్చాలి. అప్పుడే వారి వ్యాపారం అప్రతిహతంగా సాగిపోతుంది. ఇక ఈ చట్టంతో వినియోగదారుల జేబులు కూడా ఖాళీ అవుతాయి. ఇప్పటిదాకా ఆయా సీజన్ లలో కొంత చవకగా పండ్లు, కూరగాయలను పొందినవాల్లకు ఇక ఆ అవకాశం వుండదు. ధరలు వ్యాపారుల చేతిలో ''స్థిరంగా'' ఉంటాయి.
మోసగాడు తనను నమ్మే వాళ్లను మాత్రమే మోసం చేయగలడంటారు. కేంద్ర పాలకులు వారిని నమ్మే అమాయక రైతుల్ని మభ్యపెట్టగలరు. కానీ వారిని నమ్మని పంజాబ్, హర్యానా రైతులను ఎలా మభ్యపెట్టగలరు? వారిని నమ్మించలేక, వారి వాదనను ఓడించలేక మోడీ బందం వేసే తలకిందుల వేషాలు వాళ్ళు రైతాంగానికి చేసిన మోసాన్ని ధృవపరుస్తున్నాయి.
ఇక మన తెలంగాణలో కారణ జన్ముడు, మాట అంటే తల కోసుకునుడే గానీ మాట తప్పని మన ముఖ్యమంత్రి గారు నూతన వ్యవసాయ చట్టాలను ఒప్పుకునేది లేదని గర్జించుకుంట ఢిల్లీకి పోయి, మ్యావ్ అనుకుంట తిరిగచ్చిండు. ఒంటి చేత్తో తెలంగాణను పట్టుకచ్చిన మనిషి, ఢిల్లీకి వెళ్లి మోడీ బందాన్ని అల్లాడిస్థడనుకుంటే, ఒకేసారి, అంతా తుపాల్ అన్నడు. కొత్త చట్టాలు తేనె పూసిన కత్తులు అన్న వ్యక్తి అదే నాలుకతో వాటిని అమలు చేస్తాననటమే కాక, అదనంగా, ఉన్న ప్రభుత్వ ఐకేపీ కేంద్రాలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించిండు. పండే ప్రతి గింజను కొంటామని నిన్నటిదాకా అని, ఇప్పుడు రైతుల పంటలు కొనటానికి ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని కొత్త లాజిక్ కూడా తీసిండు. అది, పరిపాలకుల మాటల తీరు, సామాన్య ప్రజల పట్ల పట్ల వారి నిబద్ధత.
ఈ పరిస్థితులలో రైతులు ప్రేక్షకులుగా ఉండకూడదు. అలాగే ఎవరినైనా విశ్వసించడం అనేది అహేతుకంగా ఉండకూడదు. ఈ కాలం సామాన్యులకు, బలహీనులకు మేలు చేసే కాలం కాదు. ఇది రైతులు గుర్తించాలి. రైతులే నాయకులుగా ఎదగాలి. వారికి వారే ప్రాతినిథ్యం వహించుకోవాలి. పంజాబ్, హర్యానా రైతులది అదే బలం. రైతు ఓడిపోతే దేశంలో మూడింట రెండు వంతుల జనాభా ఓడిపొయినట్టే. రైతులు తమను మోసం చేసేవాళ్లతో ఘర్షిస్తారని, తప్పకుండా గెలుస్తారని ఆశిద్దాం.
- డా|| ఎస్. తిరుపతయ్య
సెల్:9849228212