Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశంలో మొదటి బాలికల విద్యాలయాన్ని 1848లో పూణే నగరంలో ఉస్మాన్ షేక్ నివాసంలో నెలకొల్పినవారు సావిత్రి భాయి ఫూలే, ఫాతిమా షేక్. తమ ప్రాణాలను, మర్యాదను పణంగా పెట్టి అగ్రవర్ణాల ఆలోచలనలకు వ్యతిరేకంగా సావిత్రి భాయి ఫూలే, ఫాతిమా షేక్ బాలికా విద్యాలయాల్ని స్థాపించారు.
ఉస్మాన్ షేక్ చెల్లెలు ఫాతిమా షేక్ 18వ శతాబ్దంలో ముస్లిమ్స్లో మొదటి ఉపాధ్యాయురాలు. ఆమె 1825-27 మధ్యభాగంలో జనవరి 9న జన్మించిందని చరిత్రకారులు భావిస్తున్నారు. సావిత్రి, ఫాతిమాలు ఇరువురూ కలిసి పూణె పరిసర ప్రాంతాలలో పలు పాఠశాలలను, వసతి గహాలను ప్రారంభించారు. ఫాతిమా ఓపికగా ఇంటింటికి తిరుగుతూ చదువు యొక్క ఆవశ్యకతను వివరించేది. ముస్లిం కుటుంబాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది. ఆనాటి ఆధిపత్య వర్గాలతోపాటు సాంప్రదాయ ముస్లిం పెద్దలు కూడా ఫాతిమా చర్యలని వ్యతిరేకించారు.
నిమ్నవర్గాల, వెనుకబడిన, దళిత ఆడపిల్లలకు విద్యాభోధన చేయడం అధిపత్యవర్గాల వారు సహించేవారు కాదు. సావిత్రిభాయి ఫూలేపై అశుద్ధం, పశువుల పేడ చల్లేవారు. రాళ్ళు విసేరేవారు. దానితో స్కూల్కు వెళ్ళేటప్పుడు సావిత్రిభాయి ఫూలే తన వెంట ఒక జత బట్టలను అదనంగా తీసుకు వెళ్ళేవారు. నిమ్న వర్గాల, శూద్ర వర్గాల బాలికలకు విద్య నేర్పించాలనే ఆమె చిత్తశుద్ది ముందు ఇతరులు చేసే దుష్ట కార్యక్రమాలన్నీ ఓడిపోయాయి.
వర్ణ వ్యవస్థ, కుల అహంకారం అధికంగా ఉన్న ఆనాటి సమాజంలో సాంఘిక సమానత్వ సాధన, స్త్రీ విద్యా వ్యాప్తి కోసం సావిత్రిభాయి ఫూలే చేస్తున్న కార్యక్రమాలలో ఫాతిమా షేక్ కీలకపాత్ర పోషించారు. వారితో పాటు సావిత్రిభాయి ఆడపడుచు సుగుణాభాయి కూడా బాలికా విద్యాలయంలో బాలికలకు విద్య నేర్పేవారు.
1818 మరాఠా సామ్రాజ్యం అంతమైన తరువాత బ్రిటిష్వారి పాలన మరాఠా ప్రాంతంలో సుస్థిరమైంది. ఆ కాలంలో జ్యోతిరావు ఫూలే ప్రముఖ సామాజిక సంస్కర్తగా పేరుగాంచారు. జ్యోతిరావు ఫూలే శూద్రులు వెనుకబడి ఉండుటకు వారిలో అక్షరాస్యత లోపం ప్రధాన కారణంగా భావించి శూద్రుల విద్యా వికాసంకు కృషి చేశారు. జ్యోతిరావు ఫూలే స్త్రీ విద్యను ప్రోత్సహించి, వితంతు వివాహాన్ని సమర్ధించారు. బాల్యవివాహం, సతి ఆచారం వ్యతిరేకించారు. అనాధలకు, పేద పిల్లలకు శరణాలయాలు, స్త్రీలకు విద్యనూ బోధించే కార్యక్రమాలు ప్రారంభించారు. జ్యోతిరావు ఫూలే అభిప్రాయంలో మన దేశంలో ఆంగ్లవిద్య తన సంస్కరణ కార్యక్రమానికి ఎంతోగానో ఊతం ఇచ్చింది. దానికి తోడూ ఫూలే అనేక మంది ముస్లిం మిత్రులను కలిగి ఉండేవారు. తన కాలంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, సాంప్రదాయ సమాజ వ్యవస్థకు వ్యతిరేకంగా జ్యోతిరావు ఫూలే పోరాడాడు. ఫూలే దంపతులు ఆనాటి సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొన్నారు. ఫూలే తల్లిదండ్రులపై కూడా ఆనాటి ఆధిపత్య వర్గాలవారు జ్యోతిరావు ఫూలేని నియంత్రణ చేయమని వత్తిడి చేశారు. ఫూలే తల్లిదండ్రులు భయపడి ఫూలేని ఇంటినుంచి బయటికి వెళ్లమన్నారు. ఆ సమయంలో షేక్ ఉస్మాన్, ఆయన సోదరి ఫాతిమాషేక్ ఫూలే దంపతులకు ఆశ్రయం కల్పించారు. ఫాతిమా సహకారంతోనే తాను విద్యా సేవా కార్యక్రమాలని కొనసాగించానని సావిత్రి స్వయంగా తన రచనలలో వివరించింది. అయితే ఫాతిమా కృషీ, రచనా వ్యాసంగంపై చరిత్రకారులు, బహుజన ఉద్యమకారులు కూడా పెద్దగా దృష్టి సారించ లేదు. స్త్రీ విద్యారంగంలో విశేష కృషి చేసిన సావిత్రి భాయి ఫూలే, ఫాతిమా షేక్లు భారత దేశం కలకాలం గుర్తుంచుకోవలసిన వ్యక్తులు. వారి త్యాగం, శ్రద్ద, స్త్రీ విద్య పట్ల వారి అంకిత భావం భారతీయ మహిళలకు మార్గదర్శకం.
-ఎం. రామ్ ప్రదీప్
సెల్:9492712836